అకస్మాత్తుగా కాలేజీ మూసివేత.. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాకులాట
- BAGADI NARAYANARAO

- Jul 21
- 1 min read
అదనపు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యం
కౌన్సెలింగ్ల వేళ ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్

(సత్యం న్యూస్,నరసన్నపేట)
పట్టణంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ‘శ్రీ విజయం జూనియర్ కాలేజీ్ని యాజమాన్యం అకస్మాత్తుగా మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సారవకోటకు చెందిన బోర జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలను ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధ్రువపత్రాలు ఇవ్వకుండా ..
ఇంటర్ మొదటి ఏడాది పూర్తి చేసుకున్న విద్యార్థులను పట్టణంలోని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసినప్పటికీ, పూర్తి స్థాయి విద్యాపత్రాలు (టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, మెమోలు) ఇవ్వడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కళాశాల చుట్టూ తిరుగుతున్నా, నిరేపు రండి, ఎల్లుండి రండి” అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు.
అదనపు వసూళ్లకు ఒత్తిడి!
చేరిన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఫీజులు మొత్తం చెల్లించినప్పటికీ, ఇప్పుడు సర్టిఫికెట్లు కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్, ఇంజినీరింగ్, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో, ధ్రువపత్రాలు లేక కౌన్సెలింగ్కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యం
ఈ విషయమై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా, నిఈ అంశంపై నాకు పూర్తి సమాచారం లేదు, సిబ్బందితో మాట్లాడి తెలియజేస్తాం” అని బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారని విద్యార్థులు తెలిపారు.
అధికారుల జోక్యం కోసం విజ్ఞప్తి
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న సదరు ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా వెంటనే తమ విద్యాపత్రాలు అందేలా చూడాలని కోరుతున్నారు.






Comments