అక్కడికక్కడే పరిశీలన.. పరిష్కారం
- Prasad Satyam
- 3 days ago
- 1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ కొత్త కార్యక్రమం
వారంలో రెండురోజులు వార్డు విజిట్
మూడు విభాగాల అధిపతులతో కార్యక్షేత్రంలోకి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హనుమంతు కూర్మారావు మరో కొత్త విధానానికి నాంది పలికారు. ప్రతిరోజూ కార్యాలయంలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కూర్మారావు.. ఇప్ప్పుడు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మÖడు విభాగాల అధిపతులతో నగరంలోని డివిజన్లలో సమస్యలను నేరుగా పరిశీలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళ, బుధవారాల్లో డివిజన్లలో మున్సిపల్ హెల్త్ అధికారి, మున్సిపల్ ఇంజినీర్లతో కలిసి పర్యటించి సమస్యను నేరుగా చూసి, వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం వీరిద్దరితో కలిసి కమిషనర్ అమ్మవారి పండగలు జరుగుతున్న ఇలిసిపురం, బొందిలీపురం ప్రాంతాల్లో ఉదయాన్నే పర్యటించారు. ఓచోట పైప్లైన్ లీకేజీతో రోడ్డు మీదకు నీరు ప్రవహిస్తుండటాన్ని గమనించిన కమిషనర్ అక్కడే ఉన్న వార్డు ఎమినిటీస్ ఇన్ఛార్జిని పిలిచి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే వార్డుల్లో పారిశుధ్యం, రోడ్డు మరమ్మతు పనులకు సంబంధించి స్థానికులు మున్సిపల్ ఇంజినీర్కు సమస్యలు విన్నవించారు. వారంలో రెండు రోజులు ఏదో ఒక డివిజన్లో పర్యటిస్తామని, చిన్న సమస్యలుంటే వాటిని తక్షణమే పరిష్కరించేందుకే కార్యక్రమాన్ని రూపొందించినట్లు కమిషనర్ తెలిపారు. పుణ్యపువీధిలో రోడ్డు పాడైందని స్థానికులు తెలపడంతో అక్కడికక్కడే మెటల్ వేయించి, సాయంత్రంలోగా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎలక్ట్రికల్, వాటర్వర్క్స్ ఏఈలు ఉన్నారు.






Comments