అపార్ట్మెంట్లే భావి ఆశాసౌధాలు
- BAGADI NARAYANARAO
- Apr 24
- 4 min read
భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో అవే శరణ్యం
నిర్మాణరంగంపై ప్రజల్లో చైతన్యానికి కృషి
బిల్డర్లు, డెవలపర్లు, కొనుగోలుదారుల సమస్యల పరిష్కారానికి కృషి
సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు
‘సత్యం’ ప్రత్యేక ఇంటర్వ్యూలో క్రెడాయ్ జిల్లా అధ్యక్షుడు పి.ఆర్.చక్రవర్తి
శ్రీకాకుళం నగరానికి అపార్ట్మెంట్ సంస్కృతే బాగా ఉపయోగపడుతుంది. భూముల ధరలు బాగా పెరిగిపోయిన పరిస్థితుల్లో వ్యక్తిగత గృహాలకంటే అపార్ట్మెంట్ల రూపంలో ఫ్లాట్ల కొనుగోళ్లే ఆశాజనకంగా ఉంటాయి. దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమను ప్రగతిశీలం, వ్యవస్థీకృతం చేయడమే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఏర్పాటు లక్ష్యం. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 13 వేల చాప్టర్స్(శాఖలు) కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 24 చాప్టర్స్లో 1300 మంది బిల్డర్లు, డెవలపర్లు సభ్యులుగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా చాప్టర్లో 60 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం నగరానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో దశాబ్ధం క్రితమే క్రెడాయ్ శాఖ ఏర్పాటైనా, గత రెండేళ్ల నుంచి అది క్రియాశీలంగా పనిచేస్తోంది. బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్మాణరంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల వల్ల కలిగే నష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సానుకూల మార్పులు చేయించేలా క్రెడాయ్ కీలకంగా వ్యవహరిస్తోందని, తీవ్రంగా కృషి చేస్తుందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు పి.ఆర్.చక్రవర్తి చెప్పారు. ‘సత్యం’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రెడాయ్ పాత్ర, అది చేస్తున్న కృషి, దాని లక్ష్యాలను వివరించారు.
సత్యం: నిర్మాణ రంగంలో క్రెడాయ్ పాత్ర ఏమిటి?
చక్రవర్తి: భూమి ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి సొంతింటి కల సాకారం కావడం లేదు. తక్కువ భూమిలో సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మించడానికి అపార్ట్మెంట్ కాన్సెప్ట్ వచ్చింది. శ్రీకాకుళం ప్రజలు మొదటి నుంచి సంప్రదాయ పద్ధతులే పాటిస్తున్నారు. అందులో భాగంగా భూమిపైనే పెట్టుబడులు పెట్టడం అనవాయితీగా వస్తోంది. ఫలితంగా భూముల ధరలు అమాంతం పెరిగి సామాన్యుల సొంతింటి కల కష్టసాధ్యమైంది. దీన్ని అధిగమించడానికి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. నాణ్యతతో కూడి, ప్రభుత్వ నిబంధనలకు లోబడి వీటి నిర్మాణాలు ఉండాలి. బిల్డర్లు, డెవలపర్లకు వీటిపై పూర్తి అవగాహన అవసరం. నిబద్ధతతో కూడిన నిర్మాణాలు చేపట్టే విషయంలో బిల్డర్లకు అవగాహన కల్పించేందుకు క్రెడాయ్ కృషి చేస్తోంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ఆవిష్కరణలు, నిర్మాణ రంగానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనల్లో మార్పులు చేర్పులు, వాటి ప్రభావంపై బిల్డర్లు, డెవలపర్లకు తరచూ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటాం.
సత్యం: శ్రీకాకుళంలో నిర్మాణ రంగం ఎలా ఉంది?
చక్రవర్తి: పేదల ఊటీగా పేరొందిన శ్రీకాకుళం అపార్ట్మెంట్ కాన్సెప్ట్కు పూర్తి అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ గాలిలో తేమ శాతం ఎక్కువ. నీరు, వాయు, శబ్ధ కాలుష్యాలు ఉండవు. మౌలిక సదుపాయాలు, వసతులు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలకు నివాసయోగ్యమైన ప్రాంతం. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వలసలు పెరిగి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇదే ప్రధానం. నగరానికి వస్తున్నవారంతా అపార్ట్మెంట్ కాన్సెప్ట్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల వల్ల ప్రస్తుతం నిర్మాణ రంగం అంత సానుకూలంగా లేదు.
సత్యం: నిర్మాణ రంగంపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందా?
చక్రవర్తి: నిర్మాణ రంగంపై సుమారు 200 రంగాలు ఆధారపడి ఉన్నాయి. అందువల్ల నిర్మాణ రంగం ఊపందుకుంటే ఈ రంగాల వారందరికీ ఉపాధి లభిస్తుంది. అయితే ధరల పెరుగుదల భవన నిర్మాణాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారీ ప్రభుత్వ పెద్దలను కలిసి నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు నిర్మాణ రంగమే ప్రధాన ఆదాయవనరుగా ఉంది. ప్రతి ఏటా సుమారు రూ.25 కోట్ల ఆదాయం లభిస్తోంది. బిల్డింగ్ పర్మిట్ ఫీజు, హౌస్ ట్యాక్స్, డెవలప్మెంట్ ఛార్జీలు, లేబర్ సెస్తో పాటు ఇతర పలు రూపాల్లో ఈ ఆదాయం వస్తోంది. ఇక గృహాల క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్, జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరుతోంది. మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
సత్యం: సామాన్యుల సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందా?
చక్రవర్తి: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. ఒక వ్యక్తి అవకాశానికి మించి ప్లాట్లు కొనుగోలు చేయడం వల్ల సొంతింటి కల నెరవేరడం లేదు. ప్రస్తుతం భూమి ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల అపార్ట్మెంట్ ద్వారానే సొంతింటి కల సాకారం అవుతుంది. అపార్ట్మెంట్ కల్చర్ వల్ల వాటిలో నివసించే కుటుంబాలకు రక్షణ ఉంటుంది. మానవ సంబంధాలు మెరుగుపడతాయి. అపార్ట్మెంట్ కల్చర్లో అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి. బ్యూటిఫికేషన్లో భాగంగా పార్కులు అభివృద్ధి చెందుతాయి. పార్కింగ్ సమస్య పరిష్కారం అవుతుంది.
సత్యం: శ్రీకాకుళానికి అపార్ట్మెంట్ కల్చర్ సూట్ అవుతుందా?
చక్రవర్తి: రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే శ్రీకాకుళంలో విభిన్నమైన వాతావరణం ఉంది. కట్టుకున్న ఇల్లు, కొనుగోలు చేసే ఫ్లాట్ సంప్రదాయబద్ధంగా ఉండాలన్న ఆలోచనతో ఉంటారు. మిగతా ప్రాంతాల్లో బిల్డర్ తనకు అనుకూలంగా నిర్మిస్తే.. వాటిని కొనుగోలు చేసినవారు తమ ఆలోచన, అభిరుచి మేరకు కొన్ని మార్పులు చేస్తుంటారు. జల్లాలో అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో సంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. కొనుగోలుదారుల అభిరుచి మేరకు ఫ్లాట్లు ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ చేసే స్కిల్డ్ వర్క్ర్లు జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తుంటారు. ఫ్లాట్ ధరలో దాదాపు 50 శాతం ఇంటీరియర్ డిజైనింగ్కే వెచ్చించాల్సి ఉంటుంది. అందువల్ల మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే జిల్లాలో అపార్ట్మెంట్ ఫ్లాట్లే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి.
సత్యం: ప్రభుత్వం నుంచి మీ సంస్థ ఏం ఆశిస్తోంది?
చక్రవర్తి: ప్రభుత్వం ద్వారా ప్లాన్ అప్రూవల్స్ మంజూరు చేయడంతో పాటు ఆక్యుపెన్సీ అనుమతులు త్వరితగతిన మంజూరుచేయాలి. నిబంధనలు సులభతరం చేయాలి. నిర్మాణ సామగ్రి ధరలను అదుపులో ఉంచాలి. సిమెంట్పై విధిస్తున్న జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలి. బిల్డింగ్ కాంపోనెంట్స్పై 18 శాతం జీఎస్టీ శ్లాబును ఎత్తేయాలి. ఎంఐజీ జీఎస్టీ 5 నుంచి 12 శాతం ఉంది. దీన్ని ఒక్క శాతానికి తగ్గించాలి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి పెంచిన 200 శాతం ధరలను తగ్గించాలి. నాలుగు శాతానికి పెంచిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ చార్జీలను తిరిగి ఒక శాతానికే తగ్గించాలి. కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఛార్జీలను కూడా ఒక్క శాతానికి తగ్గించాలి. 7.5 శాతానికి పెంచిన అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తిరిగి ఒక శాతానికి తగ్గించాలి. ఇలా అన్నింటిపైనా పన్నులు పెంచడం ఫ్లాట్ల కొనుగోలుదారులకు భారంగా మారింది. ప్రభుత్వం పునరాలోచించి తగిన నిర్ణయాలు తీసుకుంటే నిర్మాణ రంగం వృద్ధి చెందడమే కాకుండా ప్రజల సొంతింటి కల నెరవేరేందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తక్కువ ధరలకే ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి. నిర్మాణరంగంపై ఆధారపడిన వారికి ఉపాధి లభించడంతో పాటు ప్రభుత్వ అదాయం పెరుగుతుంది.
సత్యం: క్రెడాయ్ ద్వారా ఇతరత్రా చేపడుతున్న కార్యక్రమాలేమిటి?
చక్రవర్తి: క్రెడాయ్ తరఫున ప్రతి ఏటా సీఎస్ఆర్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు ఉపయోగించేలా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్చాతా హీ సేవ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు భాగస్వాములు అవుతున్నారు. ప్రతి ఏటా రథసప్తమి రోజు ఆదిత్యుని దర్శనానికి అరసవల్లికి వచ్చే లక్షలాది భక్తులకు అల్పాహారం, తాగునీరు అందిస్తున్నాం. నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్పై అధికారుల సమక్షంలో క్రెడాయ్ అధ్వర్యంలో బాపూజీ కళామందిర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించాం. మాస్టర్ ప్లాన్ను కరపత్రాలుగా ప్రింట్ చేయించి నగర ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు సేకరించారు. అలా వచ్చిన సుమారు 400 అభ్యంతరాలను నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరష్కారానికి క్రెడాయ్ కృషి చేసింది.
సత్యం: నగరంలో హోం ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నారు కదా.. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి?
చక్రవర్తి: నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఏటా హోం ఎక్స్పో నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది కూడా నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఆనందమయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు ఈ ఎక్స్పో జరుగుతుంది. బిల్డర్స్ అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఎక్స్పో ఉపయోగపడుతుంది. ఇందులో బిల్డింగ్ కాంపోనెంట్స్ ప్రదర్శన ఉంటుంది. మధ్యవర్తిత్వం లేకుండా కొనుగోలుదారులు నేరుగా తమకు నచ్చిన ఫ్లాట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. అలాగే బ్యాంకుల ద్వారా అక్కడికక్కడే రుణాలు పొందే అవకాశం ఎక్స్పోలో కల్పిస్తున్నాం. దీనివల్ల కొనుగోలుదారుడికి సమయం, శ్రమ కలసివచ్చి ఆర్థికంగా కొంత వెసులు బాటు కలుగుతుంది. ఎక్స్పోలో ప్రవేశం ఉచితం. సందర్శకులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు కూడా అందజేస్తాం.
Comments