అసమ్మతి ముఖచిత్రం మారుతోంది!
- DV RAMANA
- Mar 27, 2024
- 3 min read
30లోపు తేలిపోనున్న టీడీపీ అభ్యర్థులు

`అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం చర్యలు
`నగరానికి రానున్న రాష్ట్ర ప్రతినిధి బృందం
`అతనికి తప్ప ఎవరికిచ్చినా ఓకే అంటున్న గుండ వర్గం
`తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కలమట రమణ
(రచ్చబండ)
డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ప్రకటించాల్సిన స్థానాలతోపాటు ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు, చేర్పులతో కూడిన తుది జాబితాను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ప్రజాగళం పేరుతో రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గంలో ఉన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్కడి నుంచే కసరత్తు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో టిక్కెట్ల పంపిణీ తతంగాన్ని పూర్తి చేసి, అసంతృప్తులకు కూడా చెక్ పెట్టి అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రచార క్షేత్రంలోకి దించాలనే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై నిరసనలు వ్యక్తమవుతున్న శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి చక్కదిద్దే మార్గాలను సూచించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి బృందం జిల్లాకు వస్తున్నట్లు స్థానిక టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈక్వేషన్లు ఏ రకంగా మారుతాయోనన్న ఆసక్తి, ఉత్కంఠ ఆ పార్టీలో నెలకొన్నాయి.
ప్రత్యేక టీమ్ రంగప్రవేశం
జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో పీటముడి ఇంకా వీడలేదు. శ్రీకాకుళం నియోజకవర్గ టిక్కెట్ను గొండు శంకర్కు ప్రకటించిన దగ్గర్నుంచి గుండ అప్పలసూర్యనారాయణ నిత్యం తన క్యాడర్తో సమావేశమవుతూ పార్టీ అధిష్టానానికి తన అసంతృప్తిని తెలియజేస్తున్నారు. అలాగే పాతపట్నంలో తనను కాదని మామిడి గోవిందరావుకు టికెటివ్వడంతో సిటింగ్ ఇన్ఛార్జి కలమట రమణ ఇండిపెండెంట్గా పోటీ చేసే విషయంపై పార్టీకి పది రోజుల డెడ్లైన్ విధించారు. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అక్కడ టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావు వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల కోసం మరో మాట లేదని, బీజేపీ ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భోగట్టా. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ అప్పలసూర్యనారాయణ వర్గంతో ప్రత్యేకంగా సమావేశమవడం కోసం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ఒక టీమ్ వస్తోంది. ఈ టీమ్తో భేటీ కోసం లక్ష్మీదేవిని బలపర్చే నాయకులు సిద్ధంగా ఉండాలంటూ అప్పలసూర్యనారాయణ ఇంటి నుంచి ఇప్పటికే అందరికీ ఫోన్లు వెళ్లాయి. రెండు రోజులుగా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మనసు మార్చుకుంటుందనే భావనలో అప్పలసూర్యనారాయణ, ఆయన భార్య లక్ష్మీదేవి ఉన్నారు.
గళం మారుతోంది
ఈ సర్వే ప్రారంభమైన తర్వాత వారి బాడీలాంగ్వేజ్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు బుధవారం ఆయన అనుచరులు విలేకరుల సమావేశం నిర్వహించిన తర్వాత పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో టికెట్ తమకే వస్తుందన్న ఆశలు మళ్లీ చిగురించాయి. గొండు శంకర్ను కాకుండా ఎర్రన్నాయుడు భార్యను గానీ, ఎంపీ రామ్మోహన్నాయుడు భార్యను గానీ పోటీలో నిలిపినా తమకు అభ్యంతరం లేదని, శంకర్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ ఇవ్వకూడదన్న ప్రతిపాదనతోనే ఆ వర్గం పని చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే టికెట్లు ప్రకటించిన మరో మూడుచోట్ల కూడా మార్పులు, చేర్పులు ఉంటాయని తేలిన నేపథ్యంలో శ్రీకాకుళంలో కూడా ఆమేరకు నిర్ణయం తీసుకుంటారని వీరు భావిస్తున్నారు. టీడీపీకి సంబంధించి ఐదు అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి ఇటు కళా వెంకట్రావు, అటు గంటా శ్రీనివాసరావు సుముఖంగా లేకపోవడంతో ఇక్కడ సందిగ్ధత ఏర్పడిరది. చీపురుపల్లికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునకు టికెటిస్తే ప్రతిఘటిస్తానంటూ ఆయన భార్యే స్పష్టం చేయడంతో ఇక్కడ వలస నాయకుడి కోసం ఆ పార్టీ చూస్తోంది. నియోజకవర్గాలు మార్చి మార్చి పోటీ చేసే ఆనవాయితీ ఉన్న గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్లడానికి నిరాకరించడంతో పాటు భీమిలీనే కోరుతుండటం వల్ల ఆ స్థానాన్ని కూడా టీడీపీ ఇంకా ప్రకటించలేదు. వైకాపా నుంచి టీడీపీలోకి వస్తారన్న అంచనాతో ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు కోసం దర్శి, మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ కోసం గుంతకల్లు పెండిరగులో ఉంచగా, ఆలూరు నియోజకవర్గం వైకుంఠం శ్రీరాములు, వీరభద్రగౌడ్ మధ్య పోటీ కారణంగా పెండిరగ్లో పడిపోయింది. ఇప్పుడు వీటి విషయంలో సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున చంద్రబాబు ఈ నెల 30లోపు తుది జాబితా ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కడప, అనంతపురం, విజయనగరం లెక్క ఇంకా తేలలేదు. ఒంగోలు స్థానాన్ని ఇంకా ప్రకటించకపోయినా అక్కడ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఖరారైంది. కడపలో ఇక్కడ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీపై స్పష్టత వచ్చాక టీడీపీ తన అభ్యర్థిని ప్రకటిస్తుంది. అలాగే అనంతపురం జేసీ కుటుంబం, ఇతర టీడీపీ నేతల మధ్య పోటీతో గందరగోళం నెలకొనగా విజయనగరం పార్లమెంట్ స్థానంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన రఘురామరాజును నిలుపుతారని లీకులిచ్చారు. అయితే అందుకు అక్కడి టీడీపీ నాయకులు ససేమిరా అనడంతో ఇక్కడ ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతున్నారు.
మర్యాద ఇవ్వలేదనే కినుక
కళా వెంకట్రావు ఎంపీగా వెళ్లడానికి ససేమిరా అనడంతో ఈ స్థానం ఎవరికి కేటాయించాలో తెలీక చివరకు మీసాల గీతకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాతపట్నంలో కలమట వెంకటరమణ గానీ, శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి గానీ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం 99 శాతం ఉండదు. కేవలం గత ఐదేళ్లుగా ఇన్ఛార్జిలుగా వ్యవహరిస్తున్న తమను కనీస మర్యాద కూడా లేకుండా తప్పించడంపైనే వారు కినుకతో ఉన్నారు. పాతపట్నంలో తనకే టికెట్ కావాలని కలమట రమణ గట్టిగా కోరుతున్నా శ్రీకాకుళంలో మాత్రం గొండు శంకర్కు తప్ప ఎవరికైనా ఇవ్వండంటూ అప్పలసూర్యనారాయణ వర్గం సంకేతాలు పంపుతుండటాన్ని అధిష్టానం గుర్తించింది. ఈ రెండుచోట్లా ఏం చేస్తారో తెలీదు కానీ, టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాత్రం కొందరు రావడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
Comments