అంతర్గత మతోన్మాదుల పీచమూ అణచాలి
- DV RAMANA
- May 2
- 2 min read

కశ్మీర్లో విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులను పహల్గాం బైసారన్ లోయలో చుట్టుముట్టిన ఉగ్రమూకలు మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడం హేయం. దానికి స్పందనగా పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ మునీర్ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రస్తావించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ మధ్యకాలంలో తొలిసారి కశ్మీరీ ముస్లింలు శుక్రవారం ప్రార్ధనలు అయ్యాక వేలాదిగా వీధుల్లోకి వచ్చి పహల్గాం పాశవిక ఘటనను ఖండిరచారు. త్రివర్ణపతాకం పట్టుకుని పాకిస్తాన్ ముర్దాబాద్ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ నిరసనలకు శిఖరాయమానంగా శ్రీనగర్ ప్రధాన ముల్లా మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని జామా మసీదు నిలిచింది. పహల్గాం ఊచకోత పట్ల కాశ్మీరీలు ఎంతగా అసంతృప్తికి, అసహనానికి, ఆందోళనకు గురవుతున్నారో ఈ పరిణామాలు తెలియచేస్తున్నాయి. మరోవైపు దారుణం జరిగిన ఐదు రోజులకే తిరిగి కాశ్మీర్లో పర్యటించేందుకు సిద్ధమైన పర్యాటకుల దేశభక్తి, గౌరవం, ధైర్యం, లౌకిక స్పందనను అభినందించక తప్పదు. కశ్మీర్లో నివసిస్తున్న సాధారణ ముస్లింలు తమ ప్రాణాలు అడ్డుపెట్టి పర్యాటకులను కాపాడానికి చేసిన ప్రయత్నాలు కూడా విశేష మన్ననలు పొందుతున్నాయి. దాడి సమయంలో అక్కడున్న పర్యాటకులు సాధారణ ముస్లింల ప్రతిస్పందనను వెల్లడిరచారు. ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కుని ఒక స్థానిక ముస్లిం విసిరేయటంతో తన ప్రాణాలు దక్కాయని ఒకరు చెప్తే.. గాయపడిన పర్యాటకుడిని భుజాని కెత్తుని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి మోసుకెళ్లిన మరో ముస్లిం గురించి ఇంకో పర్యాటకుడు చెప్పారు. అదేవిధంగా బాధిత పర్యాటకులను వారి స్థావరాలకు ఉచితంగా చేర్చడానికి అక్కడున్న టాక్సీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, బరువులు మోసే ముఠా కూలీలు చేసిన కృషి గురించి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రమాద సమయాల్లో మనిషన్నవాడికి కలగాల్సిన సహజ స్పందన ఇదే. పహల్గాం ప్రాంతంలో ఉండాల్సిన సైనిక శిబిరాలు, బలగాల పహరా ఘటన జరిగిన రోజున మాయం కావటం వెనుక కారణాలు ఏమిటో.. ఆదేశాలు ఎవరివో అక్కడ డ్యూటీలో ఉండాల్సిన సైనిక సిబ్బందికి, వారిని పర్యవేక్షించే ఉన్నత సైనికాధికారులకే తెలియాలి. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధిపతి అసివమ్ మునీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న హిందువుల పట్ల సానుభూతి ప్రకటించటం వెగటు కలిగిస్తుంది. 1937లో జరిగిన హిందూ మహాసభ వార్షిక సమావేశాల్లో పలువురు వక్తలు భారతదేశం రెండు జాతులు కలిగిన దేశమనీ.. ఒకటి హిందూ జాతి అయితే రెండోది ముస్లిం జాతి అనీ చెప్పిన విషయాలను మునీర్ వ్యాఖ్యలు గుర్తుచేస్తున్నాయి. ఒక దేశ సైన్యాధక్షుడు ఎంత కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారో వీటిన బట్టి అర్థం చేసుకోవచ్చు. పహల్గాం అనంతర పరిణామాలు కొన్ని రాష్ట్రాల్లో ముస్లింల దైనందిన జీవితాన్ని దుర్భరం చేయటం ఆందోళనకరం. కాశ్మీరీ ముస్లిం విద్యార్ధులపై దాడులు, దౌర్జన్యాలు, వెలివేతలు మొదలయ్యాయి. కొంతమంది బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు రాజ్యాంగంపై వారు చేసిన ప్రమాణాలను బాహాటంగా ఉల్లంఘించేవిగా ఉన్నాయి. పదేపదే రాజ్యాంగ ప్రమాణాలు ఉల్లంఘిస్తున్న వారిలో ఒకరు నితీష్ రాణె. పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను కల్మా చదవమని బలవంతం చేసినట్లే.. దేశంలో వ్యాపారాలు చేసుకుంటున్న ముస్లింలు హనుమాన్ చాలీసా చదివితేనే వారి దుకాణాల్లో హిందువులు వస్తువులు కొనాలని, లేకుంటే వారిని వెలివేయాలని పిలుపునిచ్చారు. తాను పన్నిన ఉచ్చులో భారతీయులు పడిపోతున్నారని గర్వంగా నవ్వుకోవడానికి జనరల్ మునీర్కు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? కానీ భారతీయుల్లో చీలికలు తెచ్చేందుకు మునీర్ విసురుతున్న కుట్రపూరిత పాచిక లను ఛీత్కరిస్తూ శుక్రవారం ప్రార్థనలు అయ్యాక దేశవ్యాప్తంగా మసీదుల నుంచి వెలుపలికి వచ్చిన వేలాదిమంది ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఇవన్నీ గమనిస్తే జనరల్ మునీర్, ఇతర పాక్ నాయకులు భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి ఉగ్ర వాదాన్ని ఎదుర్కోవడంలో దేశమంతా ఏకతాటి మీద నడుస్తోందని మరోసారి రుజువు చేయటానికి ఉపకరించింది. ఈ స్పందన తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్లో తీవ్రవాదుల భరతం పట్టడానికి సిద్ధం కావటంతో పాటు మన దేశంలో మన చుట్టూ తిరుగుతున్న మతోన్మాద ముష్కరుల భరతం పట్టేందుకు కంకణం కట్టుకోవాలని ఆశిద్దాం.
Comments