అందరి చూపూ ఇప్పుడటే..!
- ADMIN
- Aug 24, 2024
- 3 min read
హర్యానా, జమ్ము`కశ్మీర్లలో ఎన్నికల నగారా మోగించిన ఎన్నికల కమిషన్
పదేళ్ల తర్వాత జమ్ము`కశ్మీర్లో ఎన్నికలు
నేడో రేపో మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్
- దుప్పల రవికుమార్

గురువారం జాతీయ ఎన్నికల కమిషన్ జమ్ము కశ్మీర్తో పాటు హర్యానా రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరగబోతున్న మొదటి ఎన్నికలు కావడంతో అందరిలో గొప్ప ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది హర్యానాతో పాటు మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగవలసి ఉంది. మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువరించాల్సి ఉంది. మధ్యలో జమ్ము కశ్మీర్ చేరింది. ఈ రాష్ట్రం విషయం చాలా ప్రత్యేకం, సున్నితం. భారతీయ జనతా పార్టీ చాలా మొండిగా ఈ రాష్ట్రంతో వ్యవహరించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంలో ప్రత్యేకంగా పొందిపరచిన 370వ అధికరణాన్ని రద్దు చేసింది. ఈ ఆర్టికల్ ద్వారా కశ్మీరంలో కొనసాగుతున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదాను తొలగించి, రాష్ట్రపతి పాలన విధించింది. దీనికి అయిదేళ్లు పూర్తి కావస్తుండడంతో సుప్రీంకోర్టు సెప్టెంబరు నెలాఖరుకల్లా ఎన్నికలు జరపమని కేంద్రానికి గట్టిగా చెప్పడంతో ప్రజాస్వామ్యయుత పాలన కోసం కసరత్తు మొదలుపెట్టారు. జాతీయ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జమ్ము కశ్మీర్లో మూడు దశలలో (సెప్టెంబర్ 18, 25, అక్టోబరు 1) ఎన్నికలు జరుగుతాయి. హర్యానాలో మాత్రం అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికలు ముగుస్తాయి.
హర్యానాలో జరగబోయే శాసనసభ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా బ్లాక్ల మధ్య జరుగుతోన్న రసవత్తరమైన పోరును మరింత స్పష్టంగా దేశప్రజలకు విశదపరుస్తుంది. లోక్సభలో సమ ఉజ్జీలుగా ఉన్న ఎన్డీయే, ఇండియా బ్లాక్ల మధ్య అసలు సిసలు పోరుకు ఈ ఎన్నికలు ఒక తెరంగేట్రంలా పనికొస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేడో రేపో మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుంది. చాలా చిత్రంగా హర్యానా, మహారాష్ట్రలు బీజేపీ పాలిత ప్రాంతాలే కావడం మరో విశేషం. అయినప్పటికీ మొన్నటి పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో రెండుచోట్లా భారతీయ జనతా పార్టీ బొక్కబోర్లా పడిరది. హర్యానాలో పది లోక్సభ స్థానాలకు గాను 2019లో పది స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ, 2024లో కేవలం ఐదు స్థానాలే గెలవగలిగింది. మిగిలిన ఐదు స్థానాలు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. అంటే హర్యానాలో కాంగ్రెస్ బలం పుంజుకుందనే చెప్పాలి. అదేవిధంగా 48 పార్లమెంటు స్థానాలున్న మహారాష్ట్రలో 2019లో ఎన్డీయే 43 స్థానాలు గెలవగా, యుపిఏ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. 2024 ఎన్నికలలో ఎన్డీయే భాగస్వామి అయిన అధికార పక్షం మహాయుతి కేవలం 17 ఎంపీ స్థానాలు గెలవగా, ప్రతిపక్ష మహా వికాస్ అఘాది 30 సీట్లు కైవసం చేసుకుంది. కాగా శాసనసభ విషయానికొస్తే మహారాష్ట్రలో 288 స్థానాలుండగా, హర్యానాలో 90 స్థానాలున్నాయి. హర్యానాలో గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అందుకని అక్కడ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ముందే పసిగట్టిన అధికార పక్షం తగిన జాగ్రత్తలు తీసుకుంది.
పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత
అందులో మొదటి అడుగుగా దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే ఆయనెక్కడ అలుగుతాడోనని తిన్నగా దేశ రాజధానికి తీసుకుని వెళ్లి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. ఆయన స్థానంలో వెనుకబడిన తరగతులకు చెందిన నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి పీఠం అధిష్టింపజేశారు. అది కూడా ఐదు నెలల కిందట. పాలనలో తన మార్కు చూపించుకోవడానికి ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉండే సైనీ ఖట్టర్ అనుచరుడిగా, కంప్యూటర్ ఆపరేటర్గా బీజేపీ పార్టీ ఆఫీసులో 1996లో చేరారు. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కి, 2005లో యువమోర్చా అంబాలా జిల్లా అధ్యక్షుడిగా, 2012కల్లా హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర బాధ్యతలు చేపట్టి, 2014లో నారాయణ్ఘర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి ఎంపీగా గెలిచారు. ముఖ్యమంత్రి కాకముందు హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జాట్ ఓటర్లను ఊరించడం మానేసి జాటేతర ఓటర్లను ఆకర్షించే విధంగా పలు రకాల పథకాలను ఇప్పటికే ప్రారంభించిన సైనీ ఎన్నికల ప్రచారంలో ఒకడుగు ముందే ఉన్నారని చెప్పాలి.
వీరికి ధీటుగా కాంగ్రెస్పార్టీ కలిసివచ్చే పార్టీలను కలుపుకొని రావాలని విఫల యత్నం చేస్తోంది. ఒకవైపు వివిధ నియోజకవర్గాలలో బీజేపీ వ్యతిరేక ఎజెండాను స్పష్టంగా ముందుకుపెట్టి, ప్రభుత్వ వ్యతిరేకతను తమ ఓటుబ్యాంకుగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే చాలా ఇతర రాష్ట్రాల మాదిరిగానే హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరు కొంత మైనస్గా మారొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎన్నికల ఫలితాల్లో ఈసారి తమకు సానుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అత్యంత ఆత్మస్థైర్యాన్ని మాత్రం ప్రదర్శిస్తోంది. ఈ రెండు ముఖ్యమైన పార్టీలకు ధీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా చాలా దూకుడుగా హర్యానాలో 90 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయడానికి ఉద్యుక్తమవుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక శాసనసభ్యుని గెల్చుకుంది. హర్యానాకు రెండు పొరుగు రాష్ట్రాలుగా ఉన్న పంజాబ్, ఢల్లీిల్లో ఆప్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఆప్ పార్టీ పాలనను హర్యానా ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారని ఆప్ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గురువారం హర్యానాలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ప్రకటించారు. పైగా హర్యానా ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు బీజేపీకి అధికారమిచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని, ఇప్పుడు ఆప్కు అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. ఆ విధంగా స్పష్టమైన త్రిముఖ పోటీ హర్యానాలో నెలకొని ఉన్నట్టు మనం భావించవచ్చు.
త్రిముఖ పోరు తప్పదిక!
అక్టోబరు 1న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటన వెలువడగానే ముందుగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావం మోగించింది. తమ వివిధ దళాల పదాధికారులతో గురువారమే గురుగ్రామ్లో సన్నాహక సమావేశం ఏర్పాటుచేసింది. నియోజకవర్గాల వారీ బాధ్యతలను ప్రకటించింది. బీజేపీ హర్యానా శాసనసభ ఎన్నికల ఇన్ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఎన్నికల సహ ఇన్ఛార్జి విప్లవ్కుమార్ దేవ్ తదితరులు తమ సన్నాహాలు ప్రారంభించారు. దీనికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ వారం పది రోజుల్లో నియోజకవర్గాల వారీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్టు తెలిపింది. 2019 ఎన్నికల నాటికే బాగ్రీ, జాట్లాండ్ ప్రాంతాలలో బీజేపీ ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని స్థాపించగలిగింది. పార్లమెంటు ఎన్నికల్లో సుమారు 68 నియోజక వర్గాలలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సంపాదించింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. నారాయణ్ఘర్, కాల్కా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పట్టును కోల్పోగా, ఫిరోజ్పూర్ జిర్కా, నూప్ా, ఆహిర్వాల్, బ్రజ్, జాట్లాండ్ నియోజక వర్గాల్లో తిరుగులేని ప్రాబల్యాన్ని పొందింది. ఏదేమైనా కాంగ్రెస్ విజయావకాశాలను బాగ్రి, జాట్లాండ్ లాంటి నియోజక వర్గాలు తేలుస్తాయని చాలామంది విశ్వసిస్తున్నారు.
Comentarios