అంబానీ పెళ్లి ఒక పొలిటికల్ స్టేట్మెంట్!
- ADMIN
- Jul 24, 2024
- 4 min read
` ఐదు వేల కోట్లతో ఆరు నెలల పాటు సాగిన ఆడంబరమైన పెళ్లి!
` స్వయంగా అతిథుల్ని పలకరించి, సాగనంపిన వైనం
` పెళ్లికి పోకుండా అత్యంత పరిణతి ప్రదర్శించిన రాహుల్
(దుప్పల రవికుమార్)

పెళ్లి లేదా ఏదైనా శుభకార్యంలో ఒక్కొక్కరూ ఒక్కోలా ముస్తాబవుతారు. కొందరు సింపుల్గా, ఎటువంటి అలంకరణ లేకుండా వచ్చేస్తారు. అది కొందరికి నచ్చుతుంది. సూటూబూటుతో ఫంక్షనుకొస్తే మరికొందరికి నచ్చుతుంది. మరికొందరైతే ఒంటినిండా నగలేసుకుని వచ్చినవారిని చూసి ‘ఉన్న సంపదను అసహ్యంగా ప్రదర్శిస్తున్నారని’ (వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్) ఈసడిరచుకుంటారు కొందరు. మరి ఈ మధ్య ఏ టీవీ చానెళ్లలో చూసినా ఒకటే కుండపోతగా ఓ పెళ్లికి వచ్చిన దేశదేశాల ప్రముఖులను చూపించడం మీరు కూడా చూసేవుంటారు. దాదాపుగా సోషల్ మీడియా అంతా ఆ పెళ్లికి వచ్చిన అతిథులను, ఆ గౌరవ అతిథులకు వారిచ్చిన సంప్రదాయబద్దమైన స్వాగత మర్యాదలను ప్రచారం చేసింది. అది కూడా మీరు వీక్షించేవుంటారు. మన జీవితంలో ఇంత రిచ్గా ఇంతవరకూ పెళ్లి జరగలేదని మనబోటి వారే కాదు, ముసలివారు సైతం గొప్పగా చెప్పుకుంటున్నారు. అది అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి.
ఈ పెళ్లికి దాదాపుగా 1500 నుంచి 5వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఒక అంచనా. ఇదేదో ప్రభుత్వ కార్యక్రమంలా, ప్రజోపయోగ కార్యక్రమంలా కొంత ఖర్చును మన భారత ప్రభుత్వం కూడా భరించింది. దీనిలో అసహ్యమైన, వికృతమైన పార్శ్వాలు, భవిష్యత్తు విపరిణామాలు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాళ్ల పెళ్లి ఎలా చేసుకుంటే మనకెందుకు గాని, టైం.. ఆ పెళ్లి జరిగిన టైం గురించి మనం మాట్లాడుకోవాలి. దేశం ఆర్థికంగా అతలాకుతలమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అసమానతలు, నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరినపుడు, మన ప్రభుత్వాలు గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న 67 శాతం పన్నులలో 50 శాతం పేద ప్రజలు కడుతున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో, ఈ దేశ సంపదలో 40 శాతం సంపదను కేవలం ఒక శాతం వ్యాపారస్తులు నియంత్రణ చేస్తున్న సమయంలో, 800 మిలియన్ల ప్రజలు బతకడానికి రేషన్ బియ్యం మీద ఆధారపడుతున్న దేశంలో ఇలాంటి పెళ్లి జరగడం శోచనీయమే. లక్షలాది రూపాయల వెచ్చించి తయారుచేసిన ఆహ్వాన పత్రాలు పంపిణీ నుంచి, దాదాపు ఒక వంద ప్రైవేటు జెట్ విమానాల్లో అతిథులను ఒకచోట చేర్చడం నుంచి, ప్రి వెడ్డింగ్ ఈవెంటుకు 500 మంది గెస్టులతో ఖరీదైన ఓడ ఏర్పాటు నుంచి, వాళ్లు ధరించిన దుస్తులే కొన్ని దేశాల జిడిపిని మించిపోవడం నుంచి, 80 కోట్లు వెచ్చించి విదేశాల నుంచి పాటలు పాడేవారిని తేవడం, వారికి తిరుగు బహుమతుల కింద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం నుంచి అన్నీ విచిత్రాలే. దాదాపుగా పిచ్చి పరాకాష్టకు చేరిందని ఈ పెళ్లి చూసిన వారు చెప్పగలుగుతున్నారు.
కుడి ఎడమల దగా! చదువుల దగా!
విదేశాల నుంచి వచ్చే అతిథులను చూసి అందరూ నోరు తెరుచుకుని చూడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పాప్ స్టార్స్, కొన్ని దేశాల మాజీ ప్రధానులు, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ లాంటి కార్పొరేట్ నేతలు ఈ పెళ్లికి వచ్చినపుడు మనం వారికిచ్చిన మర్యాద చూస్తే సగటు భారతీయుడికి సిగ్గు కలగకమానదు. ఆయన డబ్బులిచ్చి తెప్పించుకున్న అతిథులను చూడడానికి కూడా మన జనం ఎగబడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. మనకున్న వైవిధ్యమైన కళాకారులను పట్టించుకోకుండా వదిలేసి, రిహాన్నా, జస్టిన్ బీబర్ల వెంటపడడం దేన్ని సూచిస్తుందో తెలియడం లేదు. ఈ మొత్తం మిరుమిట్లు గొలిపే వాతావరణం మనకు విస్పష్టంగా చెప్పేది ఏమంటే ఇది కేవలం ఒక పెళ్లి మాత్రమే కాదు, ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా. బయటకు కనిపించే విషయం ఏమటింటే ముఖేష్ అంబానీకి గల రాజకీయ ప్రాముఖ్యం గురించి ఈ దేశంలో ఇకపై ఎవరికీ ఎలాంటి శషభిషలూ ఉండనవసరం లేదు. నిజానికి ఈ దేశంలో అసలు పవర్ ఎవరి చేతుల్లో ఉందో కూడా అందరికీ స్పష్టమైంది. ప్రభుత్వ అధినేతలు ఎవరైనా, అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా వ్యాపారం చేసేవారిదే అసలు హవా అని అందరికీ బోధపడిరది. డబ్బులు సరిగ్గా ఇవ్వగలిగితే రజనీకాంత్ లేదు, అమితాబ్ బచ్చన్ లేదు.. ఎవరైనా గంతులేస్తారని, తైతక్కలాడతారని మరొకసారి నిరూపణ అయిన సందర్భమిది.
ఈ పెళ్లిలో ఆసియాకెల్లా ధనవంతుడైన అంబానీ చుక్కల మధ్య చంద్రుడిలా వెలిగిపోయాడు. అక్కడకు వచ్చిన ప్రతిఒక్కరూ ఏదో విధంగా ఆయన వ్యాపార విస్తరణకు సహాయపడినవారే. ఆ పెళ్లిని సోషల్ మీడియాలో చూసినవారూ, పత్రికల్లో చదివినవారూ ఆయన వ్యాపారంలో వినియోగదారులే. ఆయన సంపాదించిన కోట్లాది రూపాయలకు ఒక్కో పైసా ఇచ్చినవారే. పైగా ఇప్పుడు మనందరికీ తెలిసిపోయిన మరో రహస్యం ఏమంటే ప్రస్తుతం ప్రసారం అవుతున్న టీవీ చానెళ్లలో 90 శాతం చానెళ్లు ఆయనవి, లేదంటే ఆయన స్నేహితులవే. అక్కడ వార్తలు చెప్పే యాంకర్లయినా, వార్తలు రాసే సంపాదకులైనా ఆయన మనసులో భావాలను తెలుసుకుని తమ చానెళ్లలో ప్రసారం చేయాల్సిందే. ఈ పెళ్లికి వచ్చిన అతిథులందరికీ అంబానీ బాస్ అయితే, మన దేశ ప్రధానికి కూడా ఆయనే బాస్. మన తెలుగు జర్నలిస్టు పి.సాయినాథ్, ఈ పెళ్లికి వచ్చిన అతిథులను ‘నీరో చుట్టాలు’ అని పిలిచాడు. అంబానీ ఈ పెళ్లి ద్వారా వ్యక్తపరిచిన వలసవాద మనస్తత్వాన్ని అరికట్టవలసిన మన ప్రధాని ప్రస్తుతం వేరే పనిలో బిజీగా ఉన్నారు. అది మిలటరీ యూనిఫాం మార్చడం, ఇండియన్ పీనల్ కోడ్ను తిరిగి రాయడం, రాజ్పథ్ పేరు చెరిపేయడంలో బిజీగా ఉన్నారు.
ఈ మొత్తం తమాషాను దూరం పెట్టింది గాంధీ కుటుంబమే. అంబానీ స్వయంగా వెళ్లి పిలిచినా, గాంధీ కుటుంబంలో ఎవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. రాహుల్ ఈ పెళ్లికి వెళ్లకపోవడం అహంకారంగానో, తిరస్కరణగానో మనం చూడకూడదు. ఆయన నైతిక దృఢత్వానికి, రాజకీయంగా స్థిరమైన ఎదుగుదలకు నిదర్శనంగానే చూడాలి. ఇది కేవలం పెళ్లి కాదు. ఒక పొలిటికల్ స్టేట్మెంట్. ప్రభుత్వ కళ్లేలను నియంత్రిస్తున్న ఒక బడా వ్యాపారవేత్త చూపిస్తోన్న దేహదార్డ్యాన్ని ఈ దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కళ్లప్పగించి చూస్తున్న వేళ, రాహుల్ ఇంత పరిణతి ప్రదర్శించడం నిజంగా అబ్బురపరిచే విషయమే! పదేపదే తన ప్రసంగాలలో రాహుల్ చెప్తూ వస్తున్నదిదే: ‘‘రాజకీయాలు, భారీ పెట్టుబడుల మధ్యనున్న అక్రమ సంబంధం వల్లనే ఈ దేశపు సంపద అంతా కేవలం పది శాతం ధనవంతుల దగ్గర పోగుపడుతోంది. దానివల్ల దేశం మీద గుత్తాధిపత్యం వారికే చెందుతోంది. ఈ అక్రమ సంబంధాన్ని తెగ్గొడితే తప్ప నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం’’. ఈ పెళ్లికి వెళ్లకుండా ఉండడం ద్వారా ఒక కొత్తతరపు రాజకీయ నాయకుడిగా మనల్ని గర్వపడేట్టు రాహుల్ చేశాడు.
పచ్చి అవకాశవాద ముఠా మన రాజకీయ నాయకులు
ఆ మేరకు ఇండియా బ్లాక్లో ఉన్న మిగిలిన రాజకీయ పార్టీల నేతలు ఎవ్వరూ ఈ మేరకు రాజకీయ మేధో నిజాయితీ ప్రదర్శించలేకపోయారు. వారంతా రాహుల్ గాంధీ కంటే వయసులో పెద్దవారు. రాజకీయంగా సీనియర్లు. అయినా రాహుల్ చూపించిన పరిణతి చూపించలేక పోయారు. దీనిని రాహుల్ గమనిస్తే చాలు. ఈ దేశంలో రాజకీయ నాయకులందరూ నటులే! వాళ్ల మాటల్లో సమసమాజం ఒట్టి నటన. సామాన్య మానవుడి గురించి వాళ్ల తాపత్రయం వట్టి డాంబికం. నిరుపేదల పట్ల వారు కార్చేవి మొసలి కన్నీరు. అదంతా వట్టి ముసుగు. వాళ్లకు డబ్బున్న వారంటేనే మమకారం. వారు చూపించే రిచ్నెస్, అక్కడ తళుకులీనే మెరుపులంటేనే వారికి మక్కువ. వారంతా పచ్చి అవకాశవాదులు. అధికారం తప్ప మరేమీ వారికి పట్టదు. అది సాధించడం కోసం ఎంతకైనా దిగజారతారు. దేనికైనా తెగిస్తారు. అధికారం పరమావధి. అలాంటివారితో నిరంతర లేదా దీర్ఘకాలిక పొత్తు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రమాదకరం.
ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. మండి జిల్లాకు ప్రొబేషన్ కలెక్టరుగా అవయ్ శుక్లా శిక్షణ నిమిత్తం వెళ్లారు. అక్కడ స్థానికంగా ఉండే క్లబ్కు అధికారులు, వ్యాపారులు, ఇతర పెద్దలు వస్తుంటారు. ఈయన కూడా పరిచయాలు పెరుగుతాయని కొన్ని సాయంత్రాలు క్లబ్కు వెళ్లి వస్తుండేవారు. ఆ క్లబ్కు ప్రెసిడెంట్గా పోలీస్ కమిషనర్ సి.డి. పార్షీరా ఉండేవారు. కానీ ఆయన ఎప్పుడూ క్లబ్కు వచ్చేవారు కాదు. ఒకసారి అవయ్ కమిషనర్ను ఇదే ప్రశ్న అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా గొప్పది. ‘‘మన కెరియర్లో అవునని చెప్పాల్సిన సందర్భాల కంటే కాదని చెప్పాల్సిన సందర్భాలే ఎక్కువ. ముందురోజు డ్రిరక్ తాగి మరుసటి రోజు వారు అడిగిందానికి కాదనలేం. అందుకే అక్కడకు నేను రానండి’’ అని చెప్పారట. రాహుల్ గాంధీ మాత్రమే కాదు, మనం కూడా పట్టించుకోవలసిన చాలా ముఖ్యమైన సంగతి ఇది.
Comments