ఆపరేషన్ సింధూరంతో మెరిసిన నారీశక్తి
- DV RAMANA
- May 8
- 2 min read

పహల్గాంలో సామాన్య టూరిస్టులపై ఉగ్రమూకలు సాగించిన ఊచకోతకు సమాధానంగా పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసి సుమారు వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ వివరాలను వెల్లడిరచేందుకు రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు ఏర్పాటుచేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఇద్దరు మహిళలు యావత్తు దేశం దృష్టిని ఆకర్షించారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన ఇటువంటి సమావేశాల్లో ఇంతకుముందెప్పుడూ మహిళా అధికారులు పాల్గొన్న దాఖలాల్లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా మీడియా సమావేశంలో పాల్గొన్న మహిళా అధికారులు ఎవరు? వారికి ఇప్పుడే ఎందుకు అంత ప్రాధాన్యమన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇది అనుకోకుండా ఆయాచితంగా జరిగిన ఘటన కాదని, దీని వెనుక ఎంతో ఆలోచన, నిబద్ధత ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్పై మెరుపు దాడులు నిర్వహించడానికి ప్రధాన కారణం పహల్గాంలో ఉగ్రవాదుల దాష్టీకమే. ఆనాటి ఘటనలో మతం పేరుతో 26 మందిని ఉగ్రవాదులు చంపేశారు. ఫలితంగా పలువురు మహిళలు భర్తలను కోల్పోయి నుదుట సింధూరం పెట్టుకునే భాగ్యానికి దూరమయ్యారు. నుదట సింధూరం ధరించడమన్నది భారతీయ మహిళల సంప్రదాయం. భర్త క్షేమాన్ని కోరుకోవడమే దీని ఉద్దేశం. ఇక పూర్వం రాజపుత్రులతో పాటు పలు రాజవంశాల మహిళలు భర్తలు యుద్ధానికి వెళ్లే సమయంలో వారి హారతి ఇచ్చి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించడంతో పాటు యుద్ధానికి వెళ్తున భర్తలతోనే తాము సౌభాగ్యవతులుగా ఉండాలన్న ఆశతో నదుట సింధూర పెట్టించుకునేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పహల్గాం దాడిలో సౌభాగ్యం కోల్పోయిన మహిళలకు ఉపశమనం కలిగించేలా ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. విజయవంతమైన ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు అందించే బాధ్యతను ఇద్దరు మహిళా శక్తులకు అప్పగించడం వెనుక నారీశక్తికి ప్రాధాన్యం ఇవ్వాలన్న దృక్పథం కనిపించింది. హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి దేశప్రజల దృష్టిని ఆకట్టుకున్న ఈ నారీమణుల్లో ఒకరు భారత ఆర్మీకి ప్రాతినిధ్యం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి కాగా.. మరొకరు భారత వాయుసేన ప్రతినిధి అయిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. గుజరాత్లోని వడోదరా ప్రాంతానికి చెందిన సోఫియా ఖురేషిది మొదటి నుంచి సైనిక కుటుంబమే. ఆమె తాత, తండ్రి కూడా సైన్యంలో సేవలందించారు. ఈమె భర్త తాజుద్దీన్ ఖురేషి కూడా సైన్యంలోనే పని చేస్తున్నారు. పీహెచ్డీ చేసిన అధ్యాపక వృత్తిలోకి వెళ్లకుండా 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి ప్రవేశించిన సోఫియా తొలుత లెఫ్టినెంట్ హోదాలో పని చేశారు. ప్రస్తుతం సిగ్నల్స్ కార్ప్స్లో కల్నల్ ర్యాంక్లో ఉన్నారు. 2016 మార్చిలో ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో సైనిక బృందాన్ని నడిపిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసాల్లో భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర 18 దేశాలు పాల్గొన్నాయి. 2006లో కాంగోలో ఐక్యరాజ్యసమితి తరఫున శాంతి పరిరక్షక మిషన్కు సైనిక పరిశీలకురాలిగా పనిచేశారు. మరో మహిళా శక్తి వ్యోమికా సింగ్ భారత వాయుసేనలో వింగ్ కమాండర్గా చేస్తున్నారు. సైనిక హెలికాప్టర్లు నడపడంలో దిట్ట. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవశాలి. చాలా రెస్క్యూ మిషన్స్కు నేతృత్వం వహించారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లలో అత్యవసర పరిస్థితులు, వరదలు వంటి విపత్తు సమయాల్లో సహాయ చర్యల్లో కీలకపాత్ర పోషించారు. ఆరో తరగతి నుంచి తనకు పైలెట్ అవ్వాలని ఆశ ఉండేదని వ్యోమికా చెప్పారు. ఇంజినీరింగ్ చదివేటప్పుడే అందుకు అవసరమైన ప్రిపరేషన్ చేసుకున్నారు. ఇంజినీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. సెకన్లలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్లాలి. తమ కుటుంబం నుంచి సాయుధ బలగాల్లో చేరిన మొదటి మహిళ వ్యోమిక. 2019 డిసెంబర్ 18వ తేదీన ఆమె ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ పొందారు. వ్యోమిక అంటే ఆకాశం అని అర్థం. అందుకు తగినట్లే ఆకాశమే హద్దుగా ఆమె సేవలు అందిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు వీర వనితల రంగ ప్రవేశంతో ఆపరేషన్ సింధూరం మరింత మెరిసింది.
Comments