top of page

ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంపిందెవరు?

  • Writer: DUPPALA RAVIKUMAR
    DUPPALA RAVIKUMAR
  • Oct 4, 2024
  • 3 min read
  • వీడిన తమిళనాడు బిఎస్పీ అధ్యక్షుడి మర్డర్‌ మిస్టరీ

  • పాత పగలు, రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు.. ఒక హత్య, మూడు కారణాలు

  • స్వచ్ఛందంగా లొంగిపోతున్న నిందితులు!


(దుప్పల రవికుమార్‌)

తమిళనాడు బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ జులై 5న హత్యకు గురయ్యారు. తాను కొత్తగా కడుతోన్న ఇంటివద్ద ఆయనపై ఆరుగురు యువకులు చేసిన దాడిలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రెండు గంటలలో అన్నానగర్‌లోని కె4 పోలీస్‌ స్టేషన్‌లో 8 మంది యువకులు తామే ఈ హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయారు. కాని ప్రజల నుంచి, పౌరసంఘాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల తమిళనాడు ప్రభుత్వం ఈ కేసులో లోతుగా విచారణ జరపమని పోలీసులను ఆదేశించింది. అయితే కేసును పరిశోధిస్తున్న కొద్దీ తెలుస్తోన్న కొత్త విషయాలు పోలీసులను విస్మయానికి గురిచేస్తున్నాయి. చాలా శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ 45 సంవత్సరాలకే శత్రువులను పెంచుకుంటూ పోయారు. పాత కక్షలు, రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు చుట్టుముట్టి అతడిని తుదముట్టించేలా చేసాయి. 90 రోజుల పాటు తాము చేసిన దర్యాప్తు మేరకు ఒక 5వేల పేజీల ఛార్జిషీటును తమిళనాడు పోలీసులు అక్టోబరు 3న అందజేసారు. నిందితులుగా నాగేంద్రన్‌ ఎ1గాను, ‘సాంబో’ సెంథిల్‌ ఎ2గాను, అశ్వథామన్‌ ఎ3గాను పేర్కొంటూ, మరో 28 మందిని ఇందులో చేర్చారు. వీరిలో ఒకడు పోలీసు ఎదురుకాల్పులలో చనిపోయాడు. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు పాతపగలే సాకుగా చూపితే, పోలీసులు మాత్రం మూడు గ్యాంగులు మూడు వేర్వేరు కారణాలతో హత్యకు ప్లాన్‌ చేసారని చెప్తున్నారు.

మొదటి ప్రేరణ: పగ

జులై 5, 2024 సమయం: సాయంత్రం 7.15. ఆర్మ్‌స్ట్రాంగ్‌ కొత్త ఇంటి పని పర్యవేక్షిస్తుండగా ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా వచ్చిన ఆగంతకులు 40 సెకండ్లలో ఆయన నేలకొరిగిపోయేట్టు దాడి చేసారు. చెన్నై పోలీసులు విడుదల చేసిన సిసిటివి ఫుటేజ్‌ వారందరినీ స్పష్టంగా చూపించింది. ప్రధాన నిందితుడిగా పొన్నయి బాలు తేలాడు. అతడు ఏడాది కిందట పట్టినంబాక్కంలో హత్య గావించబడ్డ ఆర్కాట్‌ సురేష్‌ సోదరుడు. సురేష్‌ మీద రెండు మర్డర్‌ కేసులతో పాటు 30 క్రిమినల్‌ కేసులతో రౌడీ షీట్‌ ఉంది. ఈ సురేష్‌ హత్యలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ పాత్ర ఉందనే అనుమానంతోనే ఈ హత్య చేసినట్టు లొంగిపోయిన వ్యక్తులు చెప్పారు. కాని, సురేష్‌ హత్యలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ పాత్ర లేనట్టు పోలీసులు తేల్చారు. పొన్నయి బాలుతో పాటు, సురేష్‌ బావమరిది అడ్వొకేట్‌ అరుల్‌, తిరువెంకటం, రాము, సెల్వరాజ్‌, మనివన్నన్‌, తిరుమలై, సంతోష్‌లు లొంగిపోయారు. తిరువెంగడం ఒక్కడే తెలుగు చెట్టియార్‌ కులానికి చెందినవాడు, మిగిలిన వారంతా కురవార్‌ కులానికి చెందిన ఎస్టీలు. సాధారణంగా ఇలాంటి కేసులలో నిందితులు కోర్టుముందు లొంగిపోతారు. ఇందుకు భిన్నంగా పోలీసుల ఎదుట లొంగిపోవడంతో పాటు వీరందరూ ఇచ్చిన స్టేట్‌మెంట్లు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. ఒకే విషయాన్ని అందరూ తిప్పితిప్పి చెప్పడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. తమ నాయకుడు పొన్నయి బాలు అని అందరూ చెప్పారు.

అయితే పోలీసుల విచారణలో తేలిందేమంటే పొన్నయి బాలుకు అంత సీన్‌ లేదని. హత్యను చాకచాక్యంగా చేసే తెలివితేటలు గాని, అందరినీ కలగలిపేంత డబ్బుగానీ అతడి వద్ద లేవని తేల్చారు. అప్పుడు కదిపిన డొంకకు తగిలిన తీగ అడ్వకేట్‌ అరుల్‌. ఈ హత్యకు పథకం, ప్రణాళిక రచించింది, నిధులు సమకూర్చింది ఈ అరుల్‌. పోలీసు విచారణలో తనకు ఆర్థిక సాయం హరిహరన్‌ అందించాడని వెల్లడిరచాడు. తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జికె వాసన్‌ అనుచరుడు ఈ హరిహరన్‌. ఇతను బయటపెట్టిన పేరు ‘సాంబో’ సెంథిల్‌.

రెండవ ప్రేరణ: రియల్‌ ఎస్టేట్‌ పగలు

చెన్నై ఉత్తర భాగమంతా రాజకీయంగా ఆర్మ్‌స్ట్రాంగ్‌కు మంచి పలుకుబడి ఉంది. రాజకీయ పలుకుబడితో పాటు రియల్‌ ఎస్టేట్‌ పెత్తనం కూడా చెన్నైతో పాటు ఉత్తర తమిళనాడు అంతా ఆర్మ్‌స్ట్రాంగ్‌ విస్తరించాడు. ఈ క్రమంలో ‘సాంబో’ సెంథిల్‌ ఒక కొరకరాని కొయ్యగా మారాడు. తూత్తుకూడిలో ప్రాబల్యమైన నాదర్‌ కులానికి చెందిన సెంథిల్‌, రియల్‌ ఎస్టేట్‌ దందాలోకి రాకముందు న్యాయవాది. కాని మూడు దశాబ్దాల కిందట రౌడీయిజంలోకి ప్రవేశించాడు. గడిచిన రెండు దశాబ్దాలుగా అతడిని చూసినవారు లేరు. అండర్‌గ్రౌండ్‌ నుంచే గత ఇరవై ఏళ్లుగా దందాలు చేస్తున్నాడు. మూడు మర్డర్‌ కేసులు ఫైలయ్యాయి. పోలీసులు ఇంతవరకూ పట్టుకోలేకపోయారు.

మూడో ప్రేరణ: రాజకీయాలు

జులై 20న జరిగిన ఒక స్మారక సభలో మాట్లాడుతూ ప్రముఖ సినీ దర్శకుడు పా. రంజిత్‌, ‘ఆర్మ్‌స్ట్రాంగ్‌ అన్న అనుమతి లేకుండా చెన్నయిలో చీమ కూడా ఎవరినీ కుట్టదు’ అని విలపించాడు. అంత పలుకుబడి కొద్దికాలంలోనే ఆర్మ్‌స్ట్రాంగ్‌ సంపాదించడం విశేషమే. ఉత్తర చెన్నయిలో రాజకీయ ఆధిపత్యం సాధించాలంటే, ఇక్కడి దళితులను సమీకరించాలి. ఆ పని ఆర్మ్‌స్ట్రాంగ్‌ చేయగలిగాడు. అందుకే అతడిని నిర్మూలించడం ద్వారా ఆ స్థానంలోకి రావాలనుకున్నవారే ఈ హత్య చేసివుండాలి అని బిఎస్‌పి రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆరోపించింది. ఈ హత్య అటు డిఎంకె ప్రభుత్వాన్ని, ఇటు పోలీసులను ముప్పతిప్పలు పెడుతుందని ఊహించలేదు. గ్యాంగ్‌వార్‌ ఖాతాలో ఈ హత్య పడేద్దామనుకున్న వారికి, ప్రజల నుంచి, ఇతర పార్టీల నుంచి ఇంత మద్దతు వస్తుందని ఊహించలేకపోయారని వారు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు దీనిని ఖండిరచారు. పొన్నయి బాలు, అరుల్‌ల విచారణ తర్వాత పోలీసులు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎన్‌. అశ్వథామన్‌ను అరెస్టు చేసారు. రోయపురంలో షెడ్యూల్డ్‌ కులానికి చెందిన నాగేంద్రన్‌ కుమారుడు ఈ అశ్వథామన్‌. ఎఐఎడిఎంకె శాసనసభ సభ్యుడు స్టాన్లీ షన్ముగం హత్య కేసులో గత ఇరవై ఏడేళ్లుగా జైలులోనే ఉన్నాడు నాగేంద్రన్‌. జైలు నుంచే ఆపరేట్‌ చేస్తున్న నాగేంద్రన్‌ గత ఏడాది డిసెంబరులో పెరోల్‌ మీద బయటకు వచ్చినపుడు ఈ హత్యకు స్కెచ్‌ వేసాడని పోలీసుల ఆరోపణ. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులతో సమావేశాలకు సంబంధించిన సాక్ష్యాలు తమకు దొరికాయని పోలీసులు చెప్తున్నారు. తన కొడుకు అశ్వథామన్‌ను ఎంపిగా చూడాలని నాగేంద్రన్‌ కోరిక. అది నెరవేరకుండా అశ్వను అనేక కేసులలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇరికించాడని అతడిపై కోపం పెంచుకున్నాడని పోలీసుల వాదన.

దీనిని కట్టుకథగా తమిళనాడు బిఎస్‌పి శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. వారు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, శ్రీపెరంబదూర్‌ శాసనసభ్యుడు సెల్వపెరున్‌తాగైపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ పోలీసులు అతడిని ప్రశ్నించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అయితే వీరి వాదనలకు సంబంధించిన అనుమానాలే తప్ప సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులను ప్రశ్నించలేకపోతున్నారు. అయితే ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అభిమానించే ప్రజాసంఘాలు, పోలీసులు తమ ఛార్జిషీటులో ఇలా లెక్కకుమించి నిందితులను చేర్చడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page