top of page

‘ఆసరా’ ఆమ్యామ్యా వాస్తవమే!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 8, 2024
  • 2 min read
  • అధికారులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సంఘ సభ్యులు

  • గతంలోనూ సీసీపై ఫిర్యాదులు

  • బాధితులనే బలిచేసిన వైకాపా

  • ‘సత్యం’ కథనంతో కదలిక

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం క్లస్టర్‌లో మహిళా స్వయంశక్తి సంఘాల సీసీ ఉషారాణి చేతివాటం చూపించి ప్రభుత్వ ఖజానా నుంచి అదనంగా రూ.3.20 లక్షలు జమ చేయించుకున్న అంశంపై సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’లో వచ్చిన కథనంపై డీఆర్‌డీఏ అధికారులు స్పందించారు. సోమవారం డీపీఎంతో పాటు ఏపీఎంల బృందం గోవిందపురం క్లష్టర్‌ పరిధిలో రెయ్యపాడు గ్రామంలోని కొత్తమ్మతల్లి గ్రూపులో ఉన్న 11 మంది సభ్యుల నుంచి వ్యక్తిగతంగా వివరణ తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సీసీ ఉషారాణి అవినీతికి పాల్పడినట్టు గుర్తించినట్టు తెలిసింది. సీసీ లాగిన్‌ నుంచి నేరుగా వైఎస్సార్‌ ఆసరా పథకం లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ములు జమ చేశారు. బ్యాంకు స్టేట్‌మెంట్‌ ప్రకారం రూ.1,10,807 రుణం ఉంది. అయితే దీన్ని మూడురెట్లు పెంచి రూ.4,33,209గా చూపించి అప్‌లోడ్‌ చేసిన విషయం బయటపడకుండా సీసీ ఉషారాణి జాగ్రత్తపడ్డారు. సీసీ లాగిన్‌లో అప్‌లోడ్‌ చేసిన వివరాలే ఫైనల్‌ అని నిర్ధారించి ఏపీఎం దాన్ని బ్యాంకులకు పంపించారు. నాలుగు విడతల్లోనూ అదే ప్రక్రియ కొనసాగింది. వాస్తవానికి ఈ వ్యవహారమంతా సంఘం సభ్యులు తీర్మానం ద్వారా చేయాలి. సోమవారం నాటి అధికారుల పరిశీలనలో తీర్మానాలు చేసిన దాఖలాలు కనిపించలేదని తెలిసింది. తీర్మానాలు చేసినట్టు సంఘం సభ్యులతో సంతకాలు చేయించిన సీసీ ఉషారాణి వాటిని మాయం చేసినట్టు సమాచారం. అధికారుల విచారణలో ఇదే అంశాన్ని సంఘం సభ్యులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. జమ చేసిన మొత్తంలో రూ.2 లక్షలు సీసీ ఉషారాణి సంఘం సభ్యుల నుంచి రికవరీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని విచారణకు వచ్చిన అధికారుల ముందు సంఘం సభ్యులు లిఖిత పూర్వకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు తెలిసింది.

సీఎఫ్‌ల వేతనాల్లోనూ..

గోవిందపురం క్లష్టర్‌ పరిధిలో సీసీగా విధులు నిర్వహిస్తున్న ఉషారాణి సీఎఫ్‌ల వేతనాలను కాజేసినట్టు ఆరోపణలున్నాయి. సీఎఫ్‌ వేతనాన్ని సీసీ ఉషారాణి ఆమె ఖాతాలో జమ చేయించుకున్నట్టు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమెపై గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీఎంను ఆదేశించారు. బాధితురాలికి వేతనం జమ కాలేదని, సీసీ ఖాతాలో జమైందని ఏపీఎం నిర్ధారించినా ఆ నివేదిక ఇవ్వకుండా అప్పటి అధికార పార్టీ నాయకులతో ఒత్తిడి చేయించి అడ్డుకొనే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దీనికి ఏపీఎం అభ్యంతరం వ్యక్తం చేయడంతో సదరు అధికారిని ఎన్నికలకు మూడు నెలల ముందు రాజకీయ బదిలీ చేశారు. సీసీపై ఫిర్యాదు చేసినందుకు బాధిత సీఎఫ్‌ను తొలగించాలని ఏపీఎం మీద ఒత్తిడి తెచ్చారు. సంఘాల తీర్మానం లేకుండా తొలగించడం సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో మిన్నకుండిపోయారు. అప్పటి అధికార పార్టీ నాయకుల జోక్యంతో ఈ వ్యవహారం మరుగున పడిపోయింది.

రైతు సంఘాలు

వైకాపా హయాంలో రైతుభరోసా కేంద్రాల పరిధిలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై అందించేందుకు రైతు సంఘాలు ఏర్పాటుచేసే బాధ్యతను సీసీలకే ప్రభుత్వం అప్పగించింది. రైతు సంఘాలను ఏర్పాటుచేసే క్రమంలో ఒక్కో సంఘం నుంచి రూ.5 వేలు వసూలుచేసినట్టు సీసీ ఉపారాణిపై ఆరోపణలున్నాయి. గోవిందపురం క్లస్టర్‌ పరిధిలో 10 సంఘాలు ఏర్పాటు చేయించి, వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలుచేసినట్టు విమర్శలు ఉన్నాయి. పొదుపు సంఘాల ఖాతాల్లో వైఎస్సార్‌ ఆసరా నగదు జమలో అక్రమాలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం బయటపడిరదని గ్రామంలో చర్చ సాగుతుంది. వైకాపా హయాంలో ఉషారాణి ఆ పార్టీ నాయకుల అండతో అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం, వైకాపా మద్దతు ఉండడంతో టీడీపీ నాయకులు ఆమెను ప్రస్తుత బదిలీల్లో సారవకోట మండలానికి ట్రాన్స్‌ఫర్‌ చేశారని చర్చ సాగుతుంది.



 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page