ఆహా.. ఈ సమ్మతి ఎంత మధురం!
- ADMIN
- Apr 20, 2024
- 2 min read
`చంద్రబాబు బర్త్డే సాక్షిగా ఏకమైన టీడీపీ వర్గాలు
`శంకర్తో చేయి కలిపి కేక్ తినిపించిన గుండ వర్గీయులు
`మార్పును ఆహ్వానిస్తేనే రాజకీయాల్లో రాణింపు
`దీన్ని గుర్తించడంతో నియోజకవర్గ టీడీపీకి కొత్త కళ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గొండు శంకర్ తింటున్న ఆ కేకు తీపిగానే ఉండి ఉంటుంది. కానీ దాన్ని తీపి అనేకంటే మధురం అనాలి. అదేంటి?.. తీపైనా, మధురమైనా ఒకటే కదా? అనొచ్చు. కాదు.. ఎప్పుడూ కాదు. తియ్యటి పదార్థానికి ప్రేమ కలిపితే అది మధురంగా మారుతుంది. నిన్నటి వరకు గొండు శంకర్ కోసం పని చేసేది లేదని లక్ష్మీదేవితోనే తమ పయనమంటూ చెప్పుకొచ్చిన ఆ వర్గం ఈరోజు చంద్రబాబు పుట్టినరోజు సాక్షిగా పార్టీ అభ్యర్థి గొండు శంకర్తో చేతులు కలిపారు. శంకర్ కూడా వారిని మొదటి వరుసలో నిలిపారు. ఇంతవరకు శంకర్కు అండదండలు అందించిన క్యాడర్ గౌరవంగా వెనుక వరుసలో నిల్చుంది. పట్టణ పార్టీ అధ్యక్షుడు ఒకవైపు, గుండ లక్ష్మీదేవికి టికెటివ్వకపోతే నాగావళి కృష్ణకు ఇవ్వండంటూ స్వయంగా అప్పలసూర్యనారాయణే చంద్రబాబు ముందు చెప్పుకొచ్చినా.. అదే ముద్దాడ కృష్ణమూర్తినాయుడు మరోవైపు నిలిచి శంకర్కు కేక్ తినిపిస్తుంటే.. ఆ కేకు మధురంగా కాక ఇంకెలా ఉంటుంది. పాత, కొత్త క్యాడర్ కలయికతో టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు పుట్టినరోజు వేడుక వేదిక కళకళలాడిరది.
‘రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.’ అని ఎవరన్నారో తెలియదు గానీ 1992లో జరిగిన ఒక విషయాన్ని ఎక్కడో చదివిన గుర్తు. బహుశా ఉండవిల్లి అరుణ్కుమార్ భార్య అరుణ ఎవరికో చెప్పినట్లు గుర్తు. 1992లో వైఎస్సార్ను సీఎం అభ్యర్థిగా అందరూ ఒప్పుకున్నారు.. ఒక్క నెల్లిమర్ల ఎమ్మెల్యే పెనుమత్స సాంబశివరాజు తప్ప. ఆయన్ను కూడా ఒప్పిస్తే నాకభ్యంతరం లేదు అని పీవీ నర్సింహారావు వైఎస్సార్కు చెప్పారట. అప్పుడు వైఎస్సార్, ఉండవల్లి, కేవీపీ, శత్రుచర్ల విజయరామరాజు కలిసి పెనుమత్స ఇంటికి వెళ్లి మాట్లాడితే ‘‘నువ్వు సీఎం ఏంటి? సీఎం అయి ఏం చేస్తావు?’ అని వెటకారంగా మాట్లాడారట. అప్పుడు అక్కడే ఉన్న ఉండవల్లి అరుణ్కుమార్ ‘రాబోయే రోజులు వైఎస్సార్వే. అప్పుడేమిటో చూసుకో’ అన్నారట. ఆ తర్వాత కాలం 12 ఏళ్లు గడిచింది. వైఎస్సార్ సీఎం అయ్యారు. పెనుమత్స సాంబశివరాజు మంత్రి కాలేదు. ఆ తర్వాత కాలం మరో ఐదేళ్లు గడిచింది. అదే పెనుమత్స జగన్ వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన కొడుకును జగన్ ఎమ్మెల్సీ చేశారు. వైఎస్ సీఎం అవుతారని అరుణ్కుమార్ ఊహించడం రాజకీయ పరిణితి. వైఎస్సార్ లాంటివారిని పార్టీ గుర్తించదని భావించడం పెనుమత్స లాంటి సీనియర్ల అనుభవ లేమి.
1996 ఎన్నికల్లో వైఎస్సార్ను ఓడిరచాలని మైసూరారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం కోసం పని చేశారు. 80 శాతం అవ్వాల్సిన పోలింగ్ను పోలీసుల సహకారంతో వైఎస్సార్కు పట్టున్న గ్రామాల్లో జనం బూత్లకు వెళ్లలేని పరిస్థితి సృష్టించారు. ఆ ఎన్నికల్లో వైఎస్ తక్కువ మెజారిటీతో గెలిచారు. 2004లో వైఎస్సార్ సీఎం అవుతారని తెలిసి ఆయనతో కేబినెట్లో ఉండనని తెలిసి అదే మైసూరారెడ్డి టీడీపీకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ జగన్తో నడిచారు. రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తాయి. నాయకులు కొత్తగా పుట్టుకొచ్చినప్పుడు జూనియర్, సీనియర్ అనే తేడాను మరిచి వ్యక్తిత్వం చూడగలిగితే ఎన్ని తరాలు రాజకీయం చేయగలడో, ఎంతమందికి అండగా ఉండగలడో అర్థమవుతుంది. కొత్త నీరు రావడం, పాత నీరు పోవడం ప్రకృతి సహజం.
Commentaires