top of page

ఆహ్వానానికి వందనం.. అయినా రాలేకపోతున్నాం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 2
  • 1 min read


సీఎం చంద్రబాబుకు గుండ లక్ష్మీదేవి లేఖ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

‘మీ ఆహ్వానం అందుకున్నాం. మమ్మల్ని గుర్తించి పంపినందుకు ధన్యవాదాలు. కానీ ఆ ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నందుకు క్షంతవ్యులం’.. అంటూ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ఇదేమిటి.. ఎన్నికల్లో టికెట్‌ దక్కనప్పటినుంచీ గుండ కుటుంబం పార్టీ, అధినేత పట్ల అంటీముట్టనట్లుగా ఉంటున్నారు కదా.. మరి ఇప్పుడు గుండ లక్ష్మీదేవి నేరుగా చంద్రబాబుకే లేఖ రాయడం ఏమిటి? అది కూడా ఆయన ఆహ్వానిస్తే మన్నించకపోవడం ఏమిటి?? అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను దేనికి ఆహ్వానించారు?? ఇలా పలు ప్రశ్నలు ఇటు టీడీపీ కార్యకర్తలను, నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడం సహజం. కానీ అసలు విషయం ఏమిటంటే.. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభిస్తోంది. ఈ పనులకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శుక్రవారం అంకురార్పాణ చేయడంతోపాటు అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేసింది. ఈ కార్యక్రమాలకు పార్టీకి చెందిన నాయకులకు కూడా నిర్వాహకులు ఆహ్వానాలు పంపించారు. అందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణతోపాటు మాజీ ఎమ్మెల్యే అయిన గుండ లక్ష్మీదేవికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం అందుకున్న లక్ష్మీదేవి తమను గుర్తుంచుకుని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమానికి మాత్రం హాజరుకాలేకపోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. తన భర్త, మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణకు ఇటీవలే బ్రెయిన్‌ సర్జరీ జరిగి, అనారోగ్యంతో ఇంటిపట్టునే ఉంటున్నారని వివరించారు. ఈ సమయంలో ఆయన యోగక్షేమాలు చూసుకునేందుకు దగ్గరే ఉండాల్సి ఉన్నందున తామిద్దరం ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నామని విశదీకరించారు. ప్రతిష్టాత్మకమైన అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రాలేకపోవడం, తమను బాధిస్తున్నా తప్పడంలేదని ఆ లేఖలో గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page