ఆ నెయ్యి కావాలంటే నిబంధనలు వర్తిస్తాయి..!
- ADMIN
- Sep 21, 2024
- 3 min read
స్వచ్ఛమైన నెయ్యి.. ఓ అందమైన అబద్ధం
టీటీడీ కంటే ఎక్కువ ధరకు మనం కొంటున్న నెయ్యి పరిస్థితీ ఇదే
గతంలో సరఫరా చేసిన సంస్థలనూ అనుమానించాల్సిందే
టీటీడీ సొంతంగా తయారుచేసుకోపోవడమే అనర్ధాలకు మూలం

టీటీడీ వివాదం... అగ్నికి ఆర్ఘ్యం తోడవడమంటే ఇదే. ఆర్ఘ్యం అంటే నెయ్యి. హోమాలు, యాగాలు చేసినప్పుడు నిప్పును రాజేయడానికి ఈ నెయ్యిని వాడుతారు. దాంతో వర్షాలు కురుస్తాయా? దేవుళ్లు కరుణిస్తారా? అనే విషయం కాసేపు పక్కన పెడితే ఇప్పుడు అదే నెయ్యి దేశంలో హిందువుల మనోభావాలను మంటలా రగిలిస్తోంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీని ఆ మంటల్లో దహించేస్తుంది. దేశవ్యాప్తంగా టీటీడీ వాడుతున్న నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందన్న ప్రకటన హిందువులను కుదిపేస్తోంది. అసలు ఈ నెయ్యి కథా కమామీషు ఏంటనే దానిపై ‘సత్యం’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
మన నెయ్యి ఎంత స్వచ్ఛం..
మనం ఇంట్లో చేసుకునే సత్యనారాయణ స్వామి వ్రతాలకు, పూజలకు, దీపారాధనకు వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదని, ఎందుకంటే అది బ్రాండెడ్ అనే అపోహలో మనం ఉన్నాం. ఇంటిలో తయారుచేసుకునే నెయ్యి అయితే మరింత శ్రేష్ఠమనే భావన కూడా మనకు ఉంది. కానీ ఇవన్నీ జంతువైన ఆవు లేదా గేదె నుంచి వస్తున్న పాలతో తయారైనవి కాబట్టి ఫ్యాట్ ఉండటం సాధారణమని గుర్తించాలి. మన నగరంలో అయితే మురపాక ఆవునెయ్యి అంటూ ఫేమస్. కార్తీక మాసం ఇక్కడ స్టీల్ క్యారియర్లతో క్యూ కట్టడం పాత జనరేషన్కు తెలుసు. ఇది కాకుండా పాడి ఉన్నచోట కూడా నెయ్యి దొరుకుతుంది. దీనికి కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ప్యూర్ ఫీు స్వీట్స్ అని మనం లొట్టలేసుకుని తింటున్న నెయ్యి ఎంత స్వచ్ఛమో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నెయ్యి..
తిరుమల లడ్డూ..
టీటీడీ.. చంద్రబాబు..
వైఎస్ జగన్..
ఈ ఐదు పదాలే కొద్ది గంటలుగా దేశంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. పత్రికలు కూడా ఈ టీటీడీ నెయ్యి వివాదంపైనే వార్తల కోసం ఏకంగా పేజీలనే కేటాయించాయి. విమర్శలు, వివరణలతో ఏ చానెల్ చూసినా నెయ్యిపైనే డిబేట్లు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అమ్ముడయ్యే ఓ నెయ్యి హాట్ టాపిక్గా మారింది. అదే ఎమరాల్డ్ మిఠాయి షాపు విక్రయించే ‘స్వచ్ఛమైన ఆవునెయ్యి’. ఇక్కడ ఈ నెయ్యిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ కథనం ఇవ్వడంలేదు. అసలు స్వచ్ఛమైన నెయ్యి అని, దాన్ని తయారుచేసే విధానం ఇది అని తెలియజెప్పడమే ఈ కథనం సారాంశం. ఎందుకంటే.. ఈ నెయ్యి తయారీదారుడే టీటీడీలో స్వామివారికి సేంద్రీయ ప్రసాదాన్ని ఇస్తున్నారు. అలాగే తిరుపతి వెంకన్నకు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బియ్యంతో నైవేధ్యం అందిస్తున్నారు. అందుకే ఆయన తయారుచేసిన నెయ్యిని ప్రస్తావిస్తున్నాం. అలా అని ఆయన వ్యాపారాల మీద, నెయ్యి మీద ఆరోపణలు లేవని కాదు. కానీ నెయ్యి ఎలా ఉండాలో చెప్పడమే ఈ కథనం ఉద్దేశం.
ఏమిటి ఈ ఎమరాల్డ్ నెయ్యి..
ఎమరాల్డ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు సేంద్రియ ఉత్పత్తులు.. అటు మిఠాయిలు విక్రయించే ఓ వ్యాపార సంస్థ. అక్కడే ఆవుపాలు, నెయ్యిని కూడా విక్రయిస్తారు. ఆవుపాలను పరిమితమైన వేళల్లో ఎన్ని కావాలంటే అన్ని అమ్ముతారు. కానీ నెయ్యి విషయానికొస్తే బోలెడు ఆంక్షలు. వాటికి అంగీకరిస్తేనే విక్రయిస్తారు. ఎంత పెద్ద రికమండేషన్ను కూడా పట్టంచుకోరు ఆ అమ్మకందారులు.
మనిషికి 100 గ్రాములు మాత్రమే విక్రయిస్తారు. ముందుగా గాజు లేదా స్టీల్ పాత్రను మీ ఫోన్ నెంబర్ లేబుల్ను అతికించి షాపు వారికి అందజేయాలి. అందజేసిన 10 నుంచి 20 రోజుల్లో మీకే ఫోన్ చేసి నెయ్యి తీసుకెళ్లమని నిర్వాహకులే సమాచారమిస్తారు. చిన్నపిల్లలు, గర్భిణులు, ఆయుర్వేదిక్ మందులు వాడకంలో నెయ్యి అవసరమైన వారికి మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చేందుకు వెసులుబాటు ఉంది.
తయారీ ఇలా..
30 నుంచి 40 లీటర్ల పాలతో ఒక్క కిలో నెయ్యి తయారవుతుందని తయారీదారులు చెబుతున్నారు. ఎమరాల్డ్లో తయారుచేసే నెయ్యి ప్రాతఃకాల వేళ తయారుచేస్తారు. సంప్రదాయ విధానంలో అంటే మన పూర్వీకులు ఇళ్లలో తయారు చేసేలా పాలను మరిగించి పెరుగు తోడు వేసి ఇరిడి కర్రతో తయారుచేసిన కవ్వంతో వెన్నతీసి.. మరిగించి నెయ్యిని తయారు చేస్తామని, అలాగైతేనే సంపూర్ణ పోషకాలు ఉంటాయనేది తయారుదారుల మాట.
కిలో ధర రూ.4200పై మాటే..

ఇన్ని ఆంక్షలు.. నిబంధనలు ఉన్న ఎమరాల్డ్ నెయ్యి ధర ఎంతో తెలుసా.. కిలో అక్షరాలా రూ.4,200 మాత్రమే. ఎందుకంటే వాళ్ల స్టోర్లో ప్రతిరోజూ ఉదయం విక్రయించే దేశీ ఆవు పాల ధర లీటర్ రూ.120. ఒక కిలో నెయ్యి తయారీకి అవసరమయ్యే పాలు 30 లీటర్లు.
రూ.320కి దేశీ ఆవునెయ్యి సాధ్యమా..
తిరుమల వెంకన్న లడ్డూలో వినియోగించే నెయ్యిపై వివాదం చెలరేగిన నేపథ్యంలో నెయ్యి స్వచ్ఛత కోసం మాట్లాడుకుంటే టీటీడీ వినియోగిస్తున్న నెయ్యి ఖరీదు రూ.320. అదీ దేశీఆవు నెయ్యి అని చెబుతున్నారు. మరి సంప్రదాయ విధానంలో తయారుచేసిన ఎమరాల్డ్ లాంటి నెయ్యిని నికార్సుగా వినియోగించి వెంకన్న లడ్డూలను తయారు చేయాలంటే ఒక్కో లడ్డూ ధరా వేలల్లో ఏడుకొండలు ఎక్కి కూర్చుంటుంది. టాటా కంపెనీలు, అదానీ గ్రూప్ల నెట్వర్త్ కంటే కొన్ని కోట్లు ఎక్కువగా ఉన్న తిరుపతి వెంకన్న ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా చౌకగా ఆవునెయ్యిని ఇచ్చే సంస్థల కోసం టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టడంలోనే మొదటి లోపం ఉంది. టీటీడీ నేతృత్వంలో గోశాలలు ఉన్నాయి. వీటిని దేశవ్యాప్తంగా సక్రమంగా నిర్వహించి ఎక్కడికక్కడ నెయ్యి తయారీ కేంద్రాలను నిర్వహించుకుని ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. తిరుమల తిరుపతిని ప్రభుత్వం ఆదాయవనరుగా చూడటం వల్లే ఒక రోడ్డు వేయడానికి, ఒక కాలువ నిర్మించడానికి టెండర్లు పిలిచినట్లు స్వామివారి ప్రసాదానికి కూడా టెండర్లు పెట్టడం ఘోరం. వ్యాపార సంస్థలు ఏవైనా లాభాపేక్షకే పని చేస్తాయి. అక్కడ దేవుడైనా, దయ్యమైనా ఒకటే. పాపభీతి ఉంటేనే ఇలా ఉంటే, పాపభీతి లేని వ్యాపార సంస్థల పరిస్థితి వేరేగా చెప్పక్కర్లేదు. ఆపదమొక్కులవాడని, అనాధ శరణాగత రక్షకుడని ఏడుకొండలకు చేరుకోవడం కోసం మనం ఇక్కడ నానా తిప్పలూ పడతాం. ఒక్కసారి కొండెక్కితే అక్కడి సిబ్బంది చేతివాటాలు, దోపిడీలు ఎలా ఉంటాయో వెంకన్న భక్తులకు తెలియంది కాదు. సాక్షాత్తు స్వామి సన్నిధిలోనే పరిస్థితి ఇలా ఉంటే, స్వయంగా స్వామి నోట్లో పెట్టని ప్రసాదం కోసం సరఫరా చేసే దినుసుల విషయంలో వ్యాపార సంస్థలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. రూ.320 తీసుకొని కేజీ నెయ్యి సరఫరా చేసిన కర్ణాటక సంస్థే కాదు, అంతకు ముందు ప్రభుత్వాల్లో సరఫరా అయిన నెయ్యిని తీసుకున్నా బహుశా ఇదే రిపోర్టు వచ్చివుండేదేమో. ఇంతకీ ఈ రూ.4,200కి కిలో నెయ్యి అమ్ముతున్న ఎమరాల్డ్ సంస్థ యజమాని పేరు చెప్పలేదు కదూ.. ఆయనే మేకపోతుల విజయరామ్. ప్రకృతి వ్యవసాయ ప్రచారకుడు. సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానాన్ని రెండు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న వ్యక్తి. ఈ పేరుతో సోషల్ మీడియాలో కొడితే ఆయన ఇంటర్వ్యూ లేని మీడియా లేదు.
Comments