ఇదీ శంకర సేవ..!
- DV RAMANA
- Apr 28
- 2 min read
ప్రజాప్రతినిధిత్వానికి కొత్త అర్థం
జాబ్మేళా విజయవంతానికి స్వయంగా ఎమ్మెల్యే కృషి
కేంద్ర, రాష్ట్ర మంత్రుల సహకారంతో కంపెనీలకు ఆహ్వానం
పార్టీ నేతల ద్వారా నిరుద్యోగులకు మోటివేషన్

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్మేళాలో వందలమంది ఉద్యోగావకాశాలు పొందారు. అందులో వింతేముంది? జాబ్మేళాలు జరగడం, ఉద్యోగాలు లభించడం ఇప్పుడేం కొత్త కాదు కదా! అన్ని మీడియా గ్రూపుల్లోనూ వచ్చేసిన వార్తే కదా.. అని చప్పరించేయకండి. ఇది విజయవంతమైన తీరు గురించి తెలుసుకుంటే ఓహో.. ఇంతుందా! అని ఆశ్చర్యపోకమానరు.
ఈ కాలంలో ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇచ్చిన హామీలనే అమలు చేయడంలో విఫలమవుతుంటారు. తమ వైఫల్యాలను కూడా ప్రభుత్వంపైకే నెట్టేసి.. తాము మాత్రం అధికార హోదా అనుభవిస్తుంటారు. అందులోనూ నిరుద్యోగం వంటి సమస్యల విషయంలో అయితే తమకు సంబంధమే లేనట్లు వ్యవహరిస్తారు. కానీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తాను ఆ తరహా ఎమ్మెల్యేను కానని చేతలతో నిరూపించారు. తన నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన జాబ్మేళాను విజయవంతం చేసేందుకు తానే కర్త కర్మ క్రియ అన్నట్లు వ్యవహరించారు.
విషయం ఏమిటంటే..
అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలుగుదేశం కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వరంగంలో ఉద్యోగ నియామకాలు చేస్తూనే.. మరోవైపు ప్రైవేట్ రంగంలోనూ విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా పారిశ్రామిక సంస్థల ద్వారా జాబ్మేళాలు నిర్వహిస్తోంది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వీటిని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ క్రమంలో నియోజకవర్గ కేంద్రమైన శ్రీకాకుళంలో ఆదివారం మెగా జాబ్మేళా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాళాల(డిగ్రీ)లో జరిగిన ఈ మేళాలో 20 సంస్థలు పాల్గొనగా 3264 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. వారిలో 762 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇదంతా పైకి కనిపించే తతంగమే. అన్నిచోట్లా జరిగేదే.
తెరవెనుక యత్నాలు
ప్రభుత్వపరంగా జాబ్మేళా నిర్వహిస్తున్నారంటే దాని పూర్తి బాధ్యత అధికారులదే. సంస్థలను ఆహ్వానించడం, నిరుద్యోగులకు సమాచారం అందించడం, అవసరమైన ఏర్పాట్లు చేయడం.. అన్నీ అధికారులే చేయాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వంటివారు జాబ్మేళాల ప్రారంభ కార్యక్రమానికి హాజరై ప్రసంగాలు దంచేసి పలాయనం చిత్తగిస్తుంటారు. కానీ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాబ్మేళాకు అన్నీ తానై విజయవంతం చేశారు. జాబ్మేళా తేదీని ప్రకటించినప్పటి నుంచీ తీవ్రంగా శ్రమించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుల సహకారంతో ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించి మేళాలో పాల్గొనేలా చేశారు. మరోవైపు ఈ సమాచారం నిరుద్యోగులకు చేరవేసి, వారు జాబ్మేళాలో పాల్గొనేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్కు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. దాన్ని నగరంలోని అన్ని డివిజన్ల టీడీపీ ఇన్ఛార్జీలకు ఇచ్చి ఆయా డివిజన్ల పరిధిలోని నిరుద్యోగులచేత రిజిస్ట్రేషన్లు చేయించి జాబ్మేళాకు హాజరయ్యేలా కృషి చేశారు. మేళాలో పాల్గొన్నవారికి తాగునీరు వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. ప్రచారానికే పరిమితం కాకుండా తానే ఒక నిర్వాహకుడిలా అన్ని ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజమైన ప్రజాప్రతినిధినని నిరూపించుకున్నారు.

Comments