ఇసుక దోపిడీలో ‘అదనపు’ అక్రమాలు
- BAGADI NARAYANARAO
- May 3
- 2 min read

లారీల్లో ఎక్కువ లోడు తెప్పించి డంపింగ్
వేబ్రిడ్జి ఆవరణలో నిల్వ చేసి.. ఆనక తరలింపు
ప్రభుత్వ భూముల్లో స్టాక్ చేసినందుకు వసూళ్లు
సొమ్ము దండుకుంటున్న టీడీపీ నేతలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సినీ పరిభాషలో ఒక మాట చెబుతుంటారు.. తెలిసిన కథైనా కొత్తగా చెప్పాలి, లేదంటే కొత్త కథ చెప్పాలి. ఈ రెండూ జరగనప్పుడు ప్రేక్షకుడిని మెప్పించలేమనేది సినీ పండితుల అభిప్రాయం. అది వాస్తవం కూడా. అదే రీతిలో మన జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కథను ఎంత కొత్తగా చెప్పినా తెలిసిన కథే. దీని గురించి పత్రికలు ఎంత ఘోషించినా స్పందన మాత్రం ఉండదు. ఎందుకంటే.. ఈ దందాలో తిలా పాపం.. తలా పిడికెడు. నిజాయితీ ఉన్న అధికారులు దాడులు నిర్వహించినా, చర్యలు మాత్రం లేకపోవడంతో ఎండలో మాడిపోయి ఇసుకలో నడవటమెందుకని ఆ పని మానుకున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్టు స్వయంగా పెద్ద నాయకులే ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మలచుకుంటే.. ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం తమకోసమే ప్రవేశపెట్టిందని భావిస్తున్న తెలుగు తమ్ముళ్లు ఎందుకు ఊరుకుంటారు?! వారూ అదే పని చేస్తున్నారు. ఇసుకను తవ్వుకుపోవడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుమును ఎగ్గొట్టడాన్ని ఇక్కడ తప్పు పట్టడంలేదు. ఎందుకంటే.. ప్రభుత్వానికే ఆ విషయం పట్టనప్పుడు పత్రికల్లో రాసి, ప్రశ్నించి సమయాన్ని వృథా చేసుకోవడం అనవసరం. కాకపోతే అనుమతుల మేరకు ఇసుక అమ్ముకోడానికి వెళితే తప్పులేదు. కానీ పర్యావరణానికి ముప్పు వచ్చేలా తవ్వేస్తున్నా అడిగే నాథుడు లేకపోవడమే బాధాకరం. ఇక్కడ ప్రస్తావిస్తున్న కథనం పాతదే. కాకపోతే భవిష్యత్ తరాలు బైరి ప్రాంతంలో ఉప్పునీటిని మాత్రమే తాగాల్సి వస్తుందన్న భయంతో రాస్తున్న కథనం.
కొసరు దోపిడీ
శ్రీకాకుళం రూరల్ మండలం బైరి వద్ద జాతీయ రహదారి పక్కనే ఇసుక డంపింగ్ చేసి రోజూ వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో తరలించుకుపోతూ జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి దందా సాగిస్తున్నారు. వీరికి అధికారులు పూర్తిగా సహకరిస్తూ వారితో కలిసి వాటాలు పంచుకుంటున్నారు. దీనిపై మొదట్లో హడావుడి చేసిన అధికారులు.. ఆ తర్వాత ఇసుక అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపారు. బైరి వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న నీలిమా వేబ్రిడ్జ్ ప్రాంగణంలో అనధికారికంగా ఏర్పాటుచేసిన ఇసుక డంపింగ్ పాయింట్ నుంచి రోజూ పదులు, వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నక్క జగదీష్ నడుపుతున్న వేబ్రిడ్జ్ వద్దకు బైరి ర్యాంపు నుంచి లారీల్లో సామర్ధ్యానికి మించి ఇసుకను తరలిస్తున్నారు. వేబ్రిడ్జ్ వద్దకు వచ్చే లారీల్లోని అదనపు ఇసుకను అక్కడ డంప్ చేస్తున్నారు. అలా స్టాక్ చేసిన ఇసుకను ట్రాక్టర్లతో తరలించి జగదీష్ దందా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న బైరి స్టాక్ పాయింట్కు వెళ్లే లారీల డ్రైవర్లతో వేబ్రిడ్జ్ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకుని సామర్ధ్యానికి మించి ఇసుకను లోడ్ చేయిస్తున్నారు. అక్కడి నుంచి వేబ్రిడ్జ్కు లారీలను రప్పించి అదనంగా లోడ్ చేసిన ఇసుకను తీసి కాటా వేసి పంపిస్తున్నారు. ఇలా ఒక్కో లారీలో సుమారు రెండు ట్రాక్టర్ల ఇసుకను అదనంగా తరలిస్తున్నారు. ఈ పని చేసినందుకు లారీ డ్రైవర్లకు భోజనం, దారి ఖర్చులకు డబ్బులు ఇస్తూ వేబ్రిడ్జ్ నిర్వాహకులు కొత్తరకం ఇసుక దందా నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేబ్రిడ్జ్ నుంచి ట్రాక్టర్లలో దర్జాగా ఇసుక తరలించి అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా పార్టీ నాయకుల పేరు చెప్పి నిర్వహించడం కొసమెరుపు.
ప్రభుత్వ భూముల్లో నేతల దర్జా
బైరి, కరజాడ గ్రామాల పరిధిలో వంశధార కరకట్టల నిర్మాణానికి 2013లో ప్రభుత్వం భూమి సేకరించి రైతులకు పరిహారం చెల్లించింది. ఆ భూములను స్థానిక టీడీపీ నాయకులు తమ అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఇసుక అక్రమంగా తవ్వి నది ఒడ్డున నిల్వ చేసి రాత్రి వేళల్లో లారీల ద్వారా విశాఖకు తరలిస్తున్నారు. కరకట్ట భూములు ప్రభుత్వం స్వాధీనంలో ఉండగా అక్కడ ఇసుకను అక్కడ స్టాక్ చేస్తున్నందుకు స్థానిక టీడీపీ నాయకులు ట్రాక్టర్ల యజమానుల నుంచి అద్దె పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వడం, తరలించడం, స్టాక్ వేయడం అంతా అక్రమమే కాబట్టి అధికార పార్టీ నాయకులు అద్దె పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నా ఇసుక అక్రమంగా తరలిస్తున్నవారు అభ్యంతరం తెలపడం లేదు. ఇసుకతో పాటు గత నెల రోజులుగా నది కరకట్ట వద్ద ఉన్న మట్టిని బైరి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న రైస్మిల్లు కోసం అక్రమంగా తరలించుకుపోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నవారిలో టీడీపీ నాయకులే కీలకంగా ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. బైరిలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతికి మించి ఇసుక తవ్వేశారని గ్రామస్తులు చెబుతున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మూడు మీటర్ల మేర ఇసుక మేట వేసి మధ్యలో ఇసుకను తవ్వేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారని ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి చుట్టూ వేసిన ఇసుక మేటను చూపించి అనుమతులకు లోబడే తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీని వల్ల వనరులు దోపిడీకి గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments