ఇస్తే ఖాళీ చెక్కులు.. కేసులతో చిక్కులు!
- NVS PRASAD
- May 8
- 3 min read
చక్రవడ్డీ, బారువడ్డీలను తలదన్నే రమ్మీ వడ్డీలు
చెల్లించకపోతే వారిచ్చిన ఖాళీ కాగితాలే కోర్టు కేసులు
శ్రీకాకుళం కోర్టు కాంప్లెక్స్లోనే సుమారు 38 నమోదు
భైరి శ్రీను బాధితులకూ తీవ్ర బెదిరింపులు
టీచరు, కోర్టు ఉద్యోగి కూడా వీరి వల్ల నష్టపోయినవారే

శ్రీకాకుళంలో ఫైనాన్స్(వడ్డీ) వ్యాపారి అంటే బరాటం రమణమూర్తి అలియాస్ రమ్మీయేనన్నంతగా బ్రాండ్ పాతుకుపోయింది. చుట్టుపక్కలవారి అవసరాలకు అప్పివ్వడం వల్ల వచ్చిన పేరు కాదిది. ఈతకాయంత అప్పిచ్చి తాటికాయంత ఆస్తి రాయించుకున్నందుకు కొన్నేళ్లుగా మూటగట్టుకున్న ఖ్యాతి ఇది. రూ.3 వడ్డీ అని బయటకు చెప్పినా.. మనోడు వేసే వడ్డీలు అవతలివారి నడ్డివిరిచేలా ఉంటాయి. సాధారణంగా ఫైనాన్స్ వ్యాపారంలో వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీలు చెలామణీలో ఉంటాయి. కానీ ఈయన వద్ద అప్పు తీసుకుంటే వీటన్నింతోపాటు రమ్మీ వడ్డీ కూడా ఉంటుంది. అన్నీ కలిపితే దేనికీ లెక్క పట్టుకోవడం తలపండిన ఆడిటర్లకు కూడా సాధ్యంకాదు. ఇక అప్పటికే ఖాళీ తెల్లకాగితం మీద సంతకం చేసి, ఆస్తిపత్రాలకు అగ్రిమెంట్లు రాసివ్వడం వల్ల చేసేదిలేక ఆయన అడిగినంత రుణగ్రహీతలు కట్టుకోవాల్సిందే. లేదంటే ఆస్తులు ధారాదత్తం చేసేసి ఊళ్లో మొహం చెల్లక పరారవుతారు. ఈ రెండూ కాకుండా రమ్మీతో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటే.. కోర్టు చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిందే. చివరకు ఎక్కడో ఒకచోట సెటిల్ చేసుకోవాలి కాబట్టి రమ్మీ అడిగినంత ఇచ్చి దండం పెట్టేయాలి. అంతిమంగా అప్పు తీసుకున్నవాడు అసలెంత? వడ్డీ ఎంత? అనేది మర్చిపోయి అరణ్యవాసానికి వెళ్లిపోవాలి.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తీసుకున్న రుణానికి వడ్డీ కట్టడంలో ఎవరైనా కాస్త వెనుకబడ్డారని తెలిసిన వెంటనే తన దగ్గర ఉన్న రౌడీల ద్వారా రమ్మీ బెదిరింపులకు పాల్పడతాడు. ఆ తర్వాత అసలు, వడ్డీ తీరిపోయినా రుణగ్రహీతలు సంతకం పెట్టిన కాగితాలు తిరిగి ఇవ్వడం ఇష్టంలేక ఓ కొత్త పద్దు తయారు చేస్తాడట. దాని మీద కోర్టుకెళ్లి వేధింపులకు దిగడంతో చచ్చినట్టు సొమ్ము కడుతున్నారు. 2011 నుంచి జిల్లా కోర్టు కాంప్లెక్స్లో బరాటం రమణమూర్తి, ఆయన బినామీలు, ఆయన చీకటి పార్టనర్లు కలిసి 38 కేసులు వేశారంటే.. రమ్మీ సిండికేట్ అప్పులిచ్చినవారిని ఎంత పీడిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు ఎన్ని కేసులున్నాయో, ప్రస్తుతం ఉన్నవాటిలో ఎన్ని కోర్టు బయట రాజీ చేసుకున్నారో తెలియదు కానీ ఇలా తన వద్ద ఉన్న దొంగపత్రాలతో కోర్టును ఆశ్రయించడం ద్వారా రమ్మీ అనేకమంది ఆస్తులను సొంతం చేసుకున్నాడు. సీసీ నెంబరు 100198/2011 రాచూరి రమణబాబు వర్సెస్ బరాటం రమణమూర్తి దగ్గర్నుంచి 2025 ఏప్రిల్లో సీసీ నెంబరు 249/2025 కొడుకుల రాజగోపాల్ వర్సెస్ బరాటం రమణమూర్తి వరకు ర్యాండమ్గా కేసులను వెతికితేనే 38 వరకు ‘సత్యం’ దృష్టికి వచ్చాయి.
బినామీలతో తప్పుడు కేసులు
వీటిలో బంటుపల్లి లక్ష్మణరావు, బాబు పేరుతో రమ్మీ వేసిన కేసులు కూడా ఉన్నాయి. వీరిద్దరూ రమ్మీకి వ్యాపార భాగస్వాములు కాకపోయినా ఒకే కోర్టు కాంప్లెక్స్ పరిధిలో ఇన్ని కేసులు ఉన్నాయంటే న్యాయమూర్తి వద్ద ఇంప్రెషన్ పోతుందని ఖాళీ కాగితాలు, ప్రాంశరీ నోట్లను పట్టుకొని బాబు, బంటుపల్లి లక్ష్మణరావు వద్ద అప్పులు తీసుకున్నట్టు కోర్టులో కేసులు వేసేది రమ్మీనే. ఇందుకోసం వీరిని రమ్మీ పోషిస్తుంటాడు. తన వద్ద ఫైనాన్స్ తీసుకున్నవారి మీద తనకు బదులుగా కోర్టులో కేసులు వేసినందుకు ఆమధ్య వీరిద్దరిలో ఒకరికి రమ్మీ కియా కారు కొనిచ్చి మెహర్బానీ చేశాడు. ఆ తర్వాత ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఇచ్చిన కారును వెనక్కు తీసుకుని గెంటేశాడు. ఇక ఫైనాన్స్ వ్యాపారంలో రమ్మీకి తిరుగులేదని, రూపాయి పెడితే వంద రూపాయలు వస్తుందన్న టాక్ మార్కెట్లో వ్యాపించడంతో ఈయన ఇంటిపేరే ఉన్న బరాటం ఆదినారాయణ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం రమ్మీతో చేతులు కలిపి చీకటి పార్టనర్గా మెసులుతున్నాడని ఆరోపణలున్నాయి. బరాటం రమణమూర్తి అంటే ఎలా గుర్తుపట్టరో బరాటం ఆదినారాయణనన్నా కూడా నగరంలో ఎవరూ గుర్తుపట్టరు. భైరి శ్రీను అంటే ఇట్టే పట్టేస్తారు. భైరి ఆయన ఇంటిపేరు కాదు.. అక్కడి నుంచి రావడం వల్ల ఆయన్ను అలా పిలవడం పరిపాటి అయిపోయింది. స్థానిక జేకేసీ (సిటీకేబుల్) కార్యాలయం కిందన చిన్న ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకొని బతకడానికి శ్రీకాకుళం వచ్చిన భైరి శ్రీను ఇప్పుడు చేయని వ్యాపారం లేదు. ప్రస్తుతం ఆ షాపును రెండుగా విస్తరించి తన దగ్గరి బంధువులకు అప్పజెప్పి ఈయన పూర్తిగా రమ్మీ కనుసన్నల్లో అక్రమ దందాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వైన్స్ వ్యాపారంలో సంపాదిస్తున్న భైరి శ్రీను రమ్మీతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశాడు. ఆ తర్వాత బిల్డర్ అవతారమెత్తి నిబంధనలకు విరుద్ధంగా అనేక అపార్ట్మెంట్లు కట్టారని ఆమధ్య పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి.
ఈయనకు ఇచ్చే చెక్కులు ఆయన చేతికి
ఈ కథనం చదివిన తర్వాత తనకు, రమ్మీకి అసలు సంబంధమే లేదని భైరి శ్రీను చెప్పడం సహజం. ఎందుకంటే.. ఈయనకు రమ్మీతో ఉన్న సంబంధం అఫీషియల్గా ఎక్కడా కనిపించదు కాబట్టి దబాయించినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ వీరిద్దరికీ సంబంధం ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దాం.
ఆరంగి ఆదిలక్ష్మి అనే ఓ ఉపాధ్యాయురాలిపై సీసీ నెంబరు 838/2024తో రమ్మీ స్థానిక కోర్టులో ఓ చెక్బౌన్స్ కేసు వేశాడు. వాస్తవానికి రమ్మీ, ఆదిలక్ష్మి మధ్య ఎటువంటి నగదు లావాదేవీలు జరగలేదు. ఆ మాటకొస్తే రమ్మీ ఎవరో కూడా ఆమెకు తెలియదు. భైరి శ్రీను భోగాపురం ఎయిర్పోర్టుకు దగ్గర్లో తనకో లేఅవుట్ ఉందని, అందులో ఓ ప్లాట్ అమ్ముతున్నారంటే ఆమె కొనుగోలు చేశారు. దానికి రూ.7 లక్షలు తక్కువ అయ్యాయి. తాను జీపీఎఫ్కు దరఖాస్తు చేసుకున్నానని, అది రాగానే ఆ రూ.7 లక్షలు చెల్లిస్తానంటూ స్థలం అమ్మిన భైరి శ్రీను దగ్గరే అప్పు తీసుకున్నారు. అందుకు గ్యారెంటీగా ఆమె ఒక ఖాళీ చెక్కును ఆయనకు ఇచ్చారు. గత ప్రభుత్వం జీపీఎఫ్ లోన్లు పెట్టుకుంటే సకాలంలో ఇవ్వని విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆమె భైరి శ్రీనుకు వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఇద్దరు స్లీపింగ్ పార్టనర్లు ఏమనుకున్నారో తెలియదు కానీ, ఓ శుభోదయాన ఆదిలక్ష్మిని భయపెట్టి ఇంటిముందు రచ్చ చేస్తామని, ఉద్యోగం పీకించేస్తామని వార్నింగ్ ఇచ్చారట. అయితే అసలు ఇచ్చేస్తానంటూ ఆమె గడువు అడిగేసరికి.. ఆమె ఇచ్చిన ఖాళీ చెక్కులో వారికి తోచినంత రాసుకొని శ్రీకాకుళం కోర్టులో దావా వేశారు. మీరు ఫలానా రమ్మీకి బకాయి ఉన్నారంటూ కోర్టు నోటీసు వచ్చేసరికి ఈ రమ్మీకి తానెప్పుడు బాకీ పడ్డానంటూ ఆమె లబోదిబోమన్నారట. ఆరా తీస్తే భైరి శ్రీనుకు ఇచ్చిన చెక్కు రమ్మీ ద్వారా కోర్టుకు వెళ్లిందని అర్థమైంది.
ఇక కోర్టులో సూపరింటెండెంట్గా పని చేస్తున్న కొడుకుల రాజగోపాల్ ధర్మానికి పోయి కేసు వరకు తెచ్చుకున్నారు. తెలిసిన వ్యక్తికి ష్యూరిటీగా ఉన్నందుకు రాజగోపాల్పై సీసీ నెంబరు 248, 249/2025 పేరిట రమ్మీ రెండు కేసులు వేశాడు. అసలు తాను ష్యూరిటీగా ఉన్న మొత్తంలో ఎంత కట్టారు? అందులో ఎంత వడ్డీ, ఎంత అసలు ఇవేవీ రాజగోపాల్ దృష్టిలో పెట్టకుండానే ష్యూరిటీ ఉన్నందుకు, ఖాళీ కాగితాలు ఉన్నందుకు రమ్మీ కేసులు వేసేశాడు. ఓఎస్ నెంబరు 257/2020 పేరిట కేసు నమోదైన గార వెంకటరమణ కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముండేవారు. ఏ కారణంతోనో రమ్మీ వద్ద అప్పు చేశారు. ఆ తర్వాత ఆయన తన ఎంఐజీ ఇంటిని అమ్మేసి రమ్మీకి ఓ దండం పెట్టేసి, ఇప్పుడు నగరంలో కనపడకుండాపోయారు.
బాధితులే సాక్షులట!
రమ్మీ వేసిన కోర్టు కేసుల్లో కనిపించే విచిత్రమేమిటంటే.. తనకు బకాయి ఉన్నారంటూ రమ్మీ సృష్టిస్తున్న కాగితాల్లో సాక్షి సంతకం చేస్తున్నవారు కూడా ఆయన బాధితులే. దుంపల నర్సింహ అప్పారావు అనే వ్యక్తి రమ్మీ కోర్టుకు సమర్పించిన కొన్ని కాగితాల్లో సాక్షిగా ఉన్నారు. విచిత్రమేమిటంటే.. ఇదే నర్సింహ అప్పారావు మీద సీసీ నెంబరు 670/2022, సీసీ నెంబరు 263/2023 పేరిట కేసులున్నాయి. అయితే నర్సింహ అప్పారావు ఎందుకు విట్నెస్గా ఉన్నారంటే.. రమ్మీని ప్రసన్నం చేసుకుంటే తన వడ్డీ తగ్గుతుందన్న బాధ ఆయనది. స్థూలంగా ఇదీ ఈ రోజుకు రమ్మీ, శ్రీనుల చీకటి కోణాల కథ.
Comentários