ఈ వరదకు ప్రకాశం బ్యారేజి తట్టుకుంటుందా?
- ADMIN
- Sep 3, 2024
- 2 min read
ద్రవం ఉన్నచోట ఉపద్రవం తప్పదు
ఉప్పున్న చోట ఉప్పెన తప్పదు

ప్రాజెక్టులు డిజైన్ చేసేటప్పుడు గతంలో వచ్చిన వరద లెక్కలు చూస్తారు. మన దగ్గర దాదాపు 150 సంవత్సరాల్లో వచ్చిన వరద లెక్కలు ఉన్నాయి. గరిష్ట వరద వచ్చినపుడు ఎంతమేర ముంపు వచ్చింది, ఏ ప్రాంతాలు మునిగిపోయాయి.. ఇలాంటి లెక్కల ఆధారంగానే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. ఎన్ని నీళ్లు నిల్వ చేయొచ్చనేది ముఖ్యమే కానీ భారీ వరద వచ్చినప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జి చెయ్యాలన్న లెక్క ఆధారంగా స్పిల్ వే లెంగ్త్, గేట్ల సంఖ్య నిర్ణయిస్తారు.
1852లో సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడు ఆమోదించిన డిజైన్ ప్రకారం కెప్టెన్ చార్లెస్ ఆర్ ఇప్పుడు బ్యారేజి ఉన్న స్థలంలో ఆనకట్టను నిర్మించారు. 1903లో 11,90,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ వరదకు ఆనకట్ట తట్టుకొని నిలిబడిరది. 1952 సెప్టెంబరు 14న వచ్చిన వరదలకు ఆనకట్టకు గండి పడి ఎనిమిది మంది చనిపోయారు. ఆనకట్టను పరిశీలించటానికి పంటి (ఒక రకమైన బోట్) మీద వెళ్లిన ఇంజనీర్ వేపా కృష్ణమూర్తి పంటి మునగడంతో చనిపోయారు. ఆనకట్ట స్థానంలో బ్యారేజి కట్టాలని భావించినా రాష్ట్ర విభజన వల్ల అది ఆలస్యమైంది.
ఆంధ్రరాష్టం ఏర్పడిన తర్వాత 1954 ఫిబ్రవరి 13న నాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు బ్యారేజీకి శంకుస్థాపన చేశారు. బ్యారేజి నిర్మాణానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. 1957 డిసెంబరు 24న నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి బ్యారేజీని ప్రారంభోత్సవం చేశారు. ప్రకాశం పంతులు 1957 మే 20న చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థం బ్యారేజీకి ప్రకాశం బ్యారేజి అని పేరు పెట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావటంతో ప్రకాశం బ్యారేజికి వరద తాకిడి తగ్గింది. 1998లో తొలిసారి 9,47,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తర్వాత 2009లో 11,10,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ రోజు అంటే 2024 సెప్టెంబరు 2న మధ్యాహ్నం 2 గంటలకు 11,43,200 క్యూసెక్కుల వరద రికార్డ్ అయ్యింది. బ్యారేజి దెబ్బతింటుందా? విజయవాడలో కొన్ని ప్రాంతాలు మునిగిపోవటం, రైల్ వే బ్రిడ్జికి రెండు అడుగుల కింది వరకు నీళ్లు ప్రవహిస్తుండడంతో బ్యారేజి నిలబడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? దీనికి తోడు మూడు బోట్లు కొట్టుకొని వచ్చి పిల్లర్లను బలంగా ఢీకొట్టడంతో కొంత డ్యామేజీ జరగటం వలన కూడా బ్యారేజి భద్రత మీద భయం నెలకొంది.
బ్యారేజి స్టోరేజ్ కెపాసిటి మూడు టీఎంసీలు కాగా డిశ్చార్జి కెపాసిటీ 11,90,000 క్యూసెక్కులు. కానీ దీనికన్నా అదనంగా అంటే బ్యారేజి మీద ఓవర్ ఫ్లో అయినా కూడా బ్యారేజీకి ఏమి కాదు. డిజైన్ చేసేటప్పుడే ఓవర్ ఫ్లోను కూడా పరిగణిస్తారు. వరద మరో ఐదు ఆరు అడుగులు పెరిగినా బ్యారేజీకి ఏమి కాదు. మరో విధంగా చెప్పాలంటే వరద మరో లక్ష - లక్షన్నర క్యూసెక్కులు పెరిగినా బ్యారేజి సేఫ్. ఈ రాత్రికి ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఖమ్మంలో కూడా గత రెండు రోజులతో పోల్చుకుంటే వర్షం తగ్గింది. ప్రకాశం బ్యారేజీకి పులిచింతల దిగువన ఖమ్మం వైపు నుంచి మున్నేరు ద్వారా భారీ వరద వస్తుంటుంది. తక్కువ దూరం కావటం పాలేరు, వైరా, లంక సాగర్, మున్నేరులు ఉదృతంగా ప్రవహించడంతో ప్రకాశం బ్యారేజీకి రాత్రికి రాత్రి రెండు మూడు లక్షల క్యూసెక్కుల వరద చేరుతుంటుంది. కృష్ణానది వరదను అంచనా వేసినట్లు మున్నేరు వరదను అంచనా వేయలేరు. నిన్నటితో పోల్చుకుంటే మున్నేరు వరద కూడా తగ్గింది. ఈ రోజు 1,80,000 క్యూసెక్కుల వరద ఉంది. విజయవాడ ముంపునకు కారణం కృష్ణా నీళ్లా? విజయవాడ సింగ్నగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీనికి కారణం బుడమేరు వాగు నీళ్లు. బుడమేరు మీద వెలగలేరు వద్ద ఉన్న లాకులను తెరవటంతో ఆ నీరు పొంగిపొర్లి టౌన్ లోకి వచ్చింది. గతంలో అయితే కృష్ణాకు ఆ వరద వస్తే కృష్ణలంక లాంటి ప్రాంతాలు ముంపునకు గురైయ్యేవి కానీ గత ప్రభుత్వ హయాంలో రీటైనింగ్ వాల్ నిర్మించటం వలన ఈసారి కృష్ణలంక ముంపునకు గురికాలేదు. విజయవాడను ముంపు భారి నుంచి రక్షించాలంటే బుడమేరు ఆక్రమణలు తొలగించి ఆధునీకరణ చెయ్యాలి. బుడమేరు డైవర్షన్ స్కీంను 100 శాతం పూర్తి చెయ్యాలి.
దివిసీమకు ముప్పుఈ వరద వలన దివిసీమ ముఖ్యంగా నాగాయలంక, కోడూరు ప్రాంతాలు భారీ ముంపునకు గురవుతున్నాయి. ఈ రాత్రి గడిస్తే దివి సీమకు గండం తప్పినట్లే.
` శివరాచర్ల ఫేస్బుక్ వాల్ నుంచి
Comments