ఉల్లాసంగా.. ఉత్సాహంగా
- NVS PRASAD
- Jan 3
- 2 min read
జేబులు నింపుకొనే పనులు
రూ. 50 లక్షలు పోసినా మారని పార్క్ పరిస్థితి
కార్గిల్ పార్క్ గతం కంటే అధ్వాన్నం
ఇంజినీరింగ్ అధికారుల కల్పతరువుగా తూతూ పనులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలో వివిధ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఉల్లాసం, ఉత్సాహం కలిగిస్తున్నామని చెప్పుకుంటున్న మున్సిపల్ యంత్రాంగం.. ఆ ఉల్లాసం, ఉత్సాహం ఎవరికి అని జనాలు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా నాలుగు సెంట్ల స్థలంలో ఇంటీరియర్ కాకుండా మూడంతస్తుల భవనం కట్టాలంటే ఎంత హైరేంజ్ మెటీరియల్ వాడినా రూ.40 లక్షలకు మించి ఖర్చుకాదు. కానీ ఒక పార్కులో మట్టిని నింపడానికి, అర మూరడు గోడ ఎత్తు చేయడానికి అక్షరాలా రూ.50 లక్షలు మున్సిపాలిటీ ఖర్చు చేసిందంటే ఎవడబ్బ సొత్తని హౌసింగ్బోర్డు కాలనీవాసులు నిలదీస్తున్నారు.
శత్రుమూకలు కార్గిల్లో చొరబడి మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ధీటుగా ఎదుర్కొని అశువులు బాసిన సైనికుల స్మృతిగా విజయ్దివస్ జరుపుకొంటున్నాం. సరిగ్గా కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత, విజయం మన ముంగిట వాలిన తర్వాత దానికి గుర్తుగా నిర్మించుకున్న కార్గిల్ పార్క్ మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు కల్పతరువుగా మారింది. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయేది ఈ పార్కు కోసమే.
పక్కనే ఉన్న ఫొటోలు చూస్తే కొత్త హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న కార్గిల్ పార్క్ అని ఆ ప్రాంతవాసులు గుర్తుపట్టేస్తారు. విజయ్దివస్ సందర్భంగా ఈ పార్క్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరైన రాజకీయ నాయకులు దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రసంగిస్తారు. ఆ ఒక్క ముక్క చాలు ఇంజినీరింగ్ అధికారుల జేబుల్లో కాసులు కళకళలాడటానికి. వాస్తవానికి హౌసింగ్బోర్డు కాలనీవాసులకు కార్గిల్ పార్కు ఉపయోగకారిగా ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోడానికి, పెద్దలు నడవడానికి, వృద్ధులు కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ అప్పుడెప్పుడో పాత ప్రభుత్వంలో పార్కును అభివృద్ధి చేస్తామన్న ఒక్క మాటను పట్టుకొని ఇంజినీరింగ్ అధికారులు విడత విడతలుగా ఈ పేరుతో సొమ్ములు లాగేస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 2022`23లో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఉన్నాయని గ్రహించిన ఇంజినీరింగ్ అధికారులు రూ.12 లక్షలు ఎస్టిమేషన్తో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఇక్కడ అడుగు మేరకు మట్టి వేసి, దాంట్లో కొత్త మొక్కలు నాటాలి. విచిత్రమేమిటంటే.. కార్గిల్ పార్కులో గతంలో పాతిన మొక్కలు అప్పటికి వృక్షాలై కాలనీవాసులకు సేద తీర్చేవి. కొత్త పనులు చేస్తేగాని సొమ్ములు రావని గ్రహించిన ఇంజినీరింగ్ అధికారులు మొక్కలు నాటడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ పనులు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. వర్క్ రికార్డ్ చేసిన ఇంజినీరింగ్ అధికారులు రూ.10 లక్షల మేరకు పనులు జరిగాయని రాసుకొని బిల్లులు చెల్లించేశారు. అక్కడితో ఆగారా అంటే.. అదీ లేదు. తమీమ్ అన్సారియా కార్పొరేషన్ కమిషనర్గా కొద్ది రోజులు పని చేసిన సమయంలో మళ్లీ ఇదే కార్గిల్ పార్క్కు వాకింగ్ ట్రాక్, లైబ్రరీ రూమ్ పునర్నిర్మాణం, ఓపెన్ జిమ్ తరలింపు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఇంజినీరింగ్ అధికారులు మరో ప్రతిపాదన పెట్టారు. వాస్తవానికి లైబ్రరీ రూమ్ బాగానే ఉంది. వాకింగ్ ట్రాకూ ఉంది. కాబట్టి ఇవేం పాడుపనులని స్థానికులు ప్రశ్నించకుండా చుట్టూ ఉన్న కాంపౌండ్వాల్ను కొంతమేరకు పెంచాలని సుడా నిధుల నుంచి రూ.40 లక్షలు మంజూరు చేస్తూ అన్సారియా తర్వాత ఇన్ఛార్జి కమిషనర్గా వచ్చిన చల్లా ఓబులేసు మరొకరికి దీన్ని కాంట్రాక్ట్కు ఇచ్చారు. ఇందులో భాగంగా అంతకు ముందు మొక్కల కోసం అడుగు మేరకు వేసిన మట్టి మీద మళ్లీ పూర్తిస్థాయిలో మట్టి వేయాలని సూచించారు. అయితే మున్సిపల్ రికార్డుల ప్రకారం ఈ రూ.40 లక్షల పని కూడా పూర్తయిపోయింది. కానీ ఇప్పుడు కార్గిల్ పార్క్ లోపలికి వెళితే.. రూ.50 లక్షలు జనం సొమ్ము ఖర్చుపెట్టి ఏం చేశారో తెలుసుకోవాలంటే పక్కనున్న ఫొటో చూస్తే అర్థమైపోతుంది.
Comments