top of page

ఎమ్మెల్సీ బరిలో టీడీపీ లేనట్టేనా?

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Aug 10, 2024
  • 2 min read
  • మంగళవారంతో నామినేషన్లకు ముగింపు

  • అరకు, పాడేరు ఓటర్లతో వైకాపా క్యాంప్‌

  • చక్రం తిప్పుతున్న స్వరూప్‌, శ్రీకాంత్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నట్లే కనిపిస్తుంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలన్నీ ఆ పార్టీపరం కావడంతో ప్రస్తుతం ఓట్ల బలం తమకు లేదని గ్రహించిన ఆ పార్టీ బరిలో కూటమి తరఫున అభ్యర్థిని నిలిపేందుకు జంకుతోంది. అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల ప్రతినిధులను తమవైపు తిప్పుకునేందుకు సమయం లేకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ఉంది. ఈ విషయం అన్యాపదేశంగా ఈనాడు కూడా శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కొనసాగుతున్న సందిగ్ధత అనే శీర్షికన కథనం ప్రచురించింది. ఈనాడు కథనం మేరకు ఎన్నికల్లో పోటీలో ఉండాలా, లేదా అన్నదానిపై ఆరుగురితో కమిటీని నియమించారని, వారు ఇచ్చిన రిపోర్టును బట్టి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. కానీ క్షేత్రస్థాయి గణాంకాలను పరిశీలిస్తే, టీడీపీ బరిలో నిలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే.. మంగళవారంతో నామినేషన్లకు గడువు ముగిసిపోతుంది. శనివారం, ఆదివారం నామినేషన్లకు సెలవు కావడంతో, సోమ, మంగళవారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కేవలం ఒక్కరోజులో అభ్యర్థిని నిర్ణయించి బరిలో నిలవడం కుదిరే పని కాకపోవచ్చు. అన్నింటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్సీ ఓటరు లెక్క సరిచూసుకున్నప్పుడు టీడీపీ గెలిచే అవకాశాలు కనిపించడంలేదు. పాడేరు, అరకులో ఉన్న ఓటర్లు చేజారిపోకుండా బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వం ప్రకటించిన రోజే ఈ రెండు నియోజకవర్గాల బాధ్యతను జిల్లాకు చెందిన వైకాపా నాయకులు మామిడి శ్రీకాంత్‌, మెంటాడ స్వరూప్‌లకు అప్పగించారు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో వైకాపా నాయకులను నప్పించి, మెప్పించి రెండు రోజుల క్రితం తాడేపల్లి తీసుకువెళ్లి వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడిరచారు. అయితే గడిచిన ఐదేళ్లలో తమకు ప్రాధాన్యత దక్కని విషయం, చేసిన పనులకు బిల్లులు రాకపోవడం వంటి అంశాలు లేవనెత్తడంతో వీరిని మళ్లీ వారి ప్రాంతాలకు పంపిస్తే టీడీపీ కచ్చితంగా హైజాక్‌ చేస్తుందని స్వరూప్‌ బొత్స సత్యనారాయణకు చెప్పడంతో ప్రస్తుతం 131 మందితో బెంగళూరులో వైకాపా క్యాంప్‌ నడుపుతోంది. తాజాగా ఆదివాసీ దినోత్సవం కూడా బెంగళూరు రిసార్ట్‌లోనే జరిపారు. సాధారణంగా బలంగా ఒక నిర్ణయం తీసుకోలేని వాతావరణంలోనే చంద్రబాబునాయుడు కమిటీలంటుంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కూడా కమిటీ వేశారంటే, దానర్ధం పోటీలో ఉండరనే. గణాంకాలు చూసుకున్నా (ఎక్స్‌ అఫీషియో సభ్యులతో సహా) 838 మంది ఓటర్లలో 235 నుంచి 240 లోపు ఓటర్లు మాత్రమే టీడీపీకి ఉన్నారు. మొత్తం ఓటర్లలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జెడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 28 మంది నర్సీపట్నం కౌన్సిలర్లు, 25 మంది యలమంచిలి కౌన్సిలర్లు ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇందులో కీలకం అరుకు, పాడేరు ప్రాంతాలకు చెందిన ఓటర్లే. వీరిని బెంగళూరుకు తరలించి క్యాంప్‌ నడుపుతున్నారు. పోలింగ్‌ రోజున తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో భీమిలీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమ ఓటర్లను చీల్చకుండా బొత్స సత్యనారాయణ నేరుగా పర్యవేక్షిస్తుండగా, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు క్యాంప్‌ రాజకీయాలు నడుపుతున్నారు. ప్రస్తుతం వైకాపా ఓటర్లెవరూ టీడీపీకి అందుబాటులో లేరు. దీంతో బరిలో నిలిచినా ప్రయోజనం ఉండదని టీడీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు సమీక్షలో కొందరు సీనియర్లు చెప్పుకొచ్చారు.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page