ఎంత చక్కని సూరీడమ్మా!
- NVS PRASAD
- Jan 23
- 2 min read
రూ.40 లక్షలతో బ్యూటిఫికేషన్ పనులు
మారనున్న మిల్లు జంక్షన్ స్వరూపం
సుడా నిధులివ్వడానికి ముందుకొచ్చిన కొరికాన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘ఆరోగ్యం భాస్కర ఆదిత్యేత్’.. ఇది సూర్యభగవానుడిని పూజించడానికి ప్రధాన కారణం. ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణస్వామిని ప్రార్థిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడనేది ఈ వాక్యం సారాంశం. ప్రతిరోజు మన నెత్తిమీద కనిపించే సూర్యుడికి చేతులు జోడిరచి నమస్కరించడం వల్ల ఎంతోమంది ఆరోగ్యాలు కుదుటపడ్డాయని, మరీ ముఖ్యంగా చర్మవ్యాధులు ఉన్నవారికి నయమైందని వైద్యులే స్వయంగా చెప్పిన సందర్భాలు కోకొల్లలు.
సూర్యకిరణాలను ఒంటికి పట్టించకుండా ఆలయంలో విగ్రహాన్ని పూజలు చేసేవారికి ఏమేరకు ఆరోగ్యం ప్రసాదించాడో తెలియదుగానీ, ఈ ఏడాది తన జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం కార్పొరేషన్ రూపురేఖలను మార్చేస్తున్నాడు. తనను ప్రార్థిస్తే ఆరోగ్యమే కాదు.. అందాన్నీ ప్రసాదిస్తానని నిరూపిస్తున్నాడు అరసవల్లి ఆదిత్యుడు. ఈ ఏడాది రథసప్తమి వేడుకను మూడు రోజుల ఉత్సవంగా, మరీ ముఖ్యంగా రాష్ట్ర పండుగగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రభుత్వంతో ప్రకటింపజేసిన తర్వాత శ్రీకాకుళం కార్పొరేషన్కు మొదటిసారిగా కార్పొరేట్ లుక్ రాబోతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారినా ఎక్కడా ఆ వెలుగుజిలుగులు మనకు కనపడవు. అభివృద్ధి కోసం అసలు అడగక్కర్లేదు. కానీ ఈ రథసప్తమికి ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరుచేసింది. దీనికి తోడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు చాలవన్న ఎమ్మెల్యే అభ్యంతరానికి ఆయన అన్ని శాఖల నుంచి నిధులు సమకూర్చారు. ఇందులో భాగంగానే ఈసారి రథసప్తమి వేడుకలకు నగరం ఘనంగా ముస్తాబవుతోంది. మరీ ముఖ్యంగా పసగాడ సూర్యనారాయణ మిల్ జంక్షన్ నుంచి అరసవల్లి వైపు వెళ్లే మార్గం రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ జంక్షన్లో ఉన్న బాబూ జగ్జీవన్రావ్ విగ్రహానికి కొత్త ప్లాట్ఫామ్ను ఏర్పాటుచేసి దాన్ని కొంతమేరకు ముందుకు జరిపి చుట్టూ ఫౌంటెన్, గార్డెనింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కనుమ రోజు కోడిగుడ్డు ఆకారంలో ప్లాట్ఫామ్ నిర్మాణం కొంతమేరకు చేపట్టినా ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడుతుందని భావించి పెరిగిన 20 డిగ్రీల కోణాన్ని సరిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో విగ్రహం వద్దకు వెళ్లడానికి మెట్లు నిర్మిస్తున్నారు. అలాగే ఇందిరా విజ్ఞాన్భవన్ రోడ్డులో సూర్యనమస్కారాలు భంగిమలతో గ్లోసైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్కు ముందు అశోకచక్రం గ్లోసైన్ను పెద్దఎత్తున పెడుతున్నారు. ఇక సరిగ్గా జంక్షన్ నుంచి కళింగరోడ్డు వైపు వాల్ గార్డెనింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాకుండా కళింగ రోడ్డులో సెంటర్ లైటింగ్ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. వీటన్నింటినీ రూ.40 లక్షలకు పూర్తిచేస్తే, తమ వద్ద నిధులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ ముందుకు రావడంతో బ్యూటిఫికేషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సుడాలో ఇంజినీరింగ్ వ్యవస్థ లేకపోయినా, పబ్లిక్ హెల్త్లో అధికారులు సెలవు మీద ఉన్నా విశాఖపట్నం నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుగుణాకర్ను పిలిపించి ఈ జంక్షన్లో బ్యూటిఫికేషన్ పనులు చేస్తున్నారు.
Comments