top of page

ఐసీడీఎస్‌ సీడీపీవోపై ఆరోపణలు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jan 11
  • 1 min read
  • న్యూ ఇయిర్‌ పేరుతో అక్రమ వసూళ్లు..!

  • ప్రాజెక్ట్‌ మీటింగ్‌కు డుమ్మా


పాతపట్నం ప్రాజెక్టు సీడీపీవో బాధ్యాతారాహిత్యంపై విమర్శలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నూతన సంవత్సర కానుకల పేరుతో సూపర్‌వైజర్ల ద్వారా అంగన్వాడీల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరం పేరుతో సుమారు రూ.లక్ష వసూలుచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వసూళ్లకు సహకరించిన అంగన్వాడీలను వేధిస్తున్నట్టు గుసగుసలు ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమావేశాల పేరుతో ఐసీడీఎస్‌ సిబ్బందిని పిలిపించి గంటల తరబడి వేచి ఉంచడం ఇక్కడ షరా మామూలేనని విమర్శలున్నాయి. కార్యాలయానికి రాకుండా ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని విమర్శలున్నాయి. శుక్రవారం ప్రాజెక్టు పరిధిలో జరిగిన సంఘటనే నిదర్శనం. ప్రాజెక్టు పరిధిలో పాతపట్నం మండల కేంద్రంలో మెళియాపుట్టి, పాతపట్నం మండలాలకు సంబంధించి అంగన్వాడీ సూపర్‌వైజర్లకు, టీచర్లకు స్థానిక బీసీ కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రాజెక్ట్‌ మీటింగ్‌కు రావాలని సమాచారం ఇచ్చి డుమ్మాకొట్టారు. ప్రాజెక్టు పరిధిలో ఎనిమిది సెక్టార్లు ఉండగా, కేవలం ఇద్దరు సూపర్‌వైజర్లు మాత్రమే ఉన్నారు. ప్రాజెక్ట్‌ పరిధిలోని 208 కేంద్రాలు నుంచి అంగన్వాడీలు హాజరయ్యారు. సీడీపీవో మాత్రం సొంత పనులు చూసుకొని, పండగ మార్కెట్‌ చేసుకొని తీరుబాటుగా సాయంత్రం 4.30 గంటలకు సమావేశ మందిరానికి వచ్చి వెళ్లిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు సీడీపీవో సమావేశానికి రాకపోవడంతో అప్పటి వరకు వేచివున్న అంగన్వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు సమావేశానికి రావాలని చెప్పి సాయంత్రం 4 గంటల వరకు సీడీపీవో రాకకోసం మధ్యాహ్నం భోజనాలు చేయకుండా పడిగాపులు కాశారు. పాతపట్నంలోనే నివాసం ఉంటున్న సీడీపీవో అదే ప్రాంతంలో ఉన్న సమావేశమందిరానికి రావడానికి సుమారు 8 గంటలు సమయం తీసుకున్నారు. అంగన్వాడీ సిబ్బంది ఫోన్‌ చేసినా స్పందించలేదని తెలిసింది. సమావేశానికి ఎంత సమయానికి వస్తున్నారని సూపర్‌వైజర్‌ ఫోన్‌ చేసిన ప్రతిసారి దగ్గర్లోనే ఉన్నానని, వచ్చేస్తున్నారని సమాధానం చెప్పి సాయంత్రం 4.30 గంటల వరకు రాకుండా ఇంటిపట్టునే ఉండిపోయారు. సీడీపీవో సమావేశానికి వచ్చిన సమయానికి కేవలం 20 మంది మాత్రమే మిగిలారు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారంతా వెళ్లిపోయారు. సమయానికి సమావేవానికి రాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ వల్ల ఆలస్యం అయిందని చెప్పి సీడీపీవో తప్పించుకొనే ప్రయత్నం చేశారు. వాస్తవంగా శుక్రవారం ఐసీడీఎస్‌కు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్‌ జరగలేదని ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇదీ పాతపట్నం ప్రాజెక్టు పరిధిలోని సీడీపీవో వ్యవహారం.

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page