కజికిస్తాన్ ఎంబీబీఎస్ చదువులో.. ఏజెన్సీ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు
- BAGADI NARAYANARAO
- Apr 9
- 1 min read
పోలీసుల అదుపులో నిందితుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

విదేశాల్లో ఎంబీబీఎస్ చదివించడానికి పంపించి.. ఫీజులు చెల్లించకుండా మోసం చేసిన వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలో ఏడుగురు విద్యార్ధులను కజికిస్థాన్లోని ఆస్థానా యూనివర్శిటీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఇప్పించిన నేపథ్యంలో ఏజెన్సీకి విద్యార్ధుల తల్లిదండ్రులు జమచేసిన మొత్తాన్ని యూనివర్శిటికీ చెల్లించకుండా మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని కరీంనగర్కు చెందిన గంగరాపు హరీష్ ఫ్లై ఎబ్రాడ్ సర్వీసెస్ ఏజెన్సీ ద్వారా జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్ధులను కజికిస్థాన్లోని ఆస్థానా యూనివర్శిటీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేయించారు. ఏడుగురు విద్యార్ధులు కజికిస్థాన్లో యూనివర్శిటీలో క్లాసులకు హాజరవుతున్నారు. ఒప్పందం ప్రకారం యూనివర్శిటీకి చెల్లించాల్సిన టెర్మ్ ఫీజులను హరీష్ తన ఏజెన్సీలకు జమ చేయిస్తున్నట్టు తెలిసింది. ఆ ఫీజులను ఏజెన్సీ ద్వారా యూనివర్శిటీకి చెల్లించకపోవడంతో ఏడుగురు విద్యార్థులను ఆస్థానా యూనివర్శిటీ ఇటీవల ఇంటికి పంపించేసింది. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఫ్లై ఎబ్రాడ్ సర్వీసెస్ ఏజెన్సీ నిర్వాహకుడు గంగరాపు హరీష్కు నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన స్పందించకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో కజికిస్థాన్కు పారిపోతున్న హరీష్ను ఢల్లీి ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని జిల్లా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని రెండో పట్టణ పోలీసులు న్యాయమూర్తిని బుధవారం కోరారు.
Comentários