top of page

కలెక్టరు పోస్టుకు మచ్చగా మిగలనున్న పూజ!

  • Writer: ADMIN
    ADMIN
  • Jul 15, 2024
  • 3 min read
  • సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్‌ ప్రవర్తన

  • తుపాకీతో బెదిరిస్తూ వీడియోలో దొరికిన వైనం

  • ప్రొబేషనరీ పీరియడ్‌లోనే సకల సౌకర్యాల కోసం డిమాండ్‌

(దుప్పల రవికుమార్‌)

ప్రస్తుతానికి దేశంలోనే దాదాపు అతి పెద్ద ఉద్యోగం జిల్లా కలెక్టరు కావడంగా ఉద్యోగార్ధులు పరిగణిస్తారు. యుపిఎస్‌సి పరీక్షలలో టాప్‌ ర్యాంకర్లందరి కలల పంటగా ఐఏఎస్‌ను పరిగణిస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఏడాదిపాటు కఠినమైన శిక్షణ ఇస్తారు. అవసరమైన పరిపాలన సంబంధమైన శిక్షణతో పాటు దేశభక్తి, జాతీయ భావాలను నూరిపోస్తారు. ఆవేశపడకుండా ఉండడం, సంయమనంతో వ్యవహరించడం, ప్రజా సమస్యలను సర్వసాక్షి కోణంలో చూడగలగడం, సహానుభూతి వంటి విషయాలను ఉగ్గుపాలతో నేర్పిస్తారు. ఉద్యోగంలో చేరిన పదేళ్ల వరకూ జాతీయ అకాడెమీలో పొందిన శిక్షణ చాలా బలంగా పని చేస్తుందని చెప్తారు. ప్రభావశీలమైన శిక్షణ వల్ల రూల్‌ బుక్కులో నిబంధనలను అక్షరాలా తుచ తప్పకుండా పాటిస్తారని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గరని చెప్తారు. దీనికి భిన్నంగా ఉన్న అధికారులు అప్పుడప్పుడు వార్తల్లోకెక్కుతారు. అలా గడిచిన కొన్ని రోజులుగా యువ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ పూజా మనోరమ దిలిప్‌ ఖేడ్కర్‌ వార్తల్లో కెక్కుతున్నారు. కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరించడానికి ఆమడ దూరంలో ఉన్నప్పుడు ఆమె బుద్ధి తప్పుదోవ పట్టి వివాదాస్పదమైంది. ఏకంగా భారత ప్రభుత్వం ఈమెపై చర్య తీసుకోవడానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ వేసింది.

ఆవిడ కెరియర్‌ అంతా వివాదాస్పదమేనని ఇప్పుడు బయటకు వస్తోన్న ఆమె జీవిత గాథలోని శకలాలు తెలియజెప్తున్నాయి. యుపిఎస్‌సి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాయకముందు ఆమె వైద్యవిద్యను అభ్యసించారు. పుణెలో ఎంబిబిఎస్‌ పూర్తి చేసి, తర్వాత ఎండోక్రైనాలజీలో ఎంఎస్‌ చేశారు. 2022లో యుపిఎస్‌సిలో 821 ర్యాంకు సంపాదించారు. వాస్తవానికి ఆ ర్యాంకుకు ఐఏఎస్‌ క్యాడర్‌ రాకూడదు. మరెలా ఆ క్యాటగిరీ పొందిందంటే తనకు వికలాంగుర కోటా ఉందని క్లెయిమ్‌ చేసింది. తనకు దృష్టిదోషం ఉందని, కొంత మానసిక వైకల్యం కూడా ఉందని ఆమె దరఖాస్తులో నమోదు చేసింది. నిజానికి ఇలాంటి వైద్యపరమైన లోపాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను న్యూఢల్లీిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నుంచి మాత్రమే అభ్యర్థులు పొంది వాటిని యుపిఎస్‌సికి సమర్పించాలి. కరోనా ఉధృతంగా ఉందన్న నెపం చూపించి, కొంతకాలం తనకు సమయం కావాలని పూజా ప్రత్యేక అనుమతి తీసుకుంది. ఆ కొంతకాలం ఇప్పటి వరకూ రాలేదు. తర్వాతి ఏడాదిలో పుణెలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి తెచ్చిన ధృవీకరణ పత్రం సమర్పించింది. దానిని యుపిఎస్‌సి తిరస్కరించింది. కనీసం ఎయిమ్స్‌లో ఎంఆర్‌ఐ తీసుకోమని పూజను కోరింది. ఇంతవరకూ అది కూడా జరగలేదు. కాని, ఇంతలో మహారాష్ట్ర బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా ముస్సోరిలోని శిక్షణ కాలం ముగిసింది. పుణె జిల్లా కలెక్టరేట్‌లో అసిస్టెంట్‌ కలెక్టరుగా ప్రోబేషన్‌ పీరియడ్‌లో విధుల్లో చేరమని పూజా పోస్టింగ్‌ ఆర్డర్స్‌ అందుకున్నారు.

ఓబిసి కేటగిరీకి తోడు వికలాంగుల కోటా

నిజానికి వికలాంగుర కోటా మాత్రమే కాక, సామాజిక వర్గ రిజర్వేషన్‌ కూడా తనకు యుపిఎస్‌సి అనువర్తించింది. ఆమె ఓబిసి (నాన్‌ క్రీమీ లేయర్‌) కోటాకు చేసుకున్న దరఖాస్తును యుపిఎస్‌సి అంగీకరించడం విడ్డూరం. ఎందుకంటే నాన్‌ క్రీమీ లేయర్లో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలకు మించకూడదు. ఈ సంగతి 2024లో బయటపడిరది. అదికూడా ఆమె తండ్రి లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయడం వల్ల. పూజ తండ్రి దిలీప్‌ ఖేడ్కర్‌ అహ్మద్‌నగర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి వంచిత్‌ బహుజన్‌ అగాధి పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో ఆయన తన ఆస్తుల కింద 40 కోట్ల రూపాయలను, తన భార్య మనోరమ ఖేడ్కర్‌ 18 కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తులు కలిగి ఉన్నట్టు ప్రకటించారు. ఈ విధంగా రెండు తప్పుడు కారణాలతో రిజర్వేషన్లను వినియోగించుకోవడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం కూడా సీరియస్‌గా తీసుకుంది. పూజ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను పరిశీలించి నివేదికను అందజేయవలసిందిగా ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసింది. భారత ప్రభుత్వానికి అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ఈ ఏకసభ్య కమిషన్‌లో నియమించి రెండు వారాలలో నివేదికను అందజేయవలసిందిగా కోరింది. ఈ రెండు తప్పులతో పాటు పూజ ఖేడ్కర్‌ మరిన్ని దుందుడుకు చర్యలకు పాల్పడినట్టు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా తెలుస్తోంది.

ఆమె తండ్రి ఒక ప్రైవేట్‌ ఆస్తి వ్యవహారం విషయంలో స్థానిక తహసీల్దార్‌ను బెదిరించారని, అక్కడితో ఆగకుండా ఏకంగా పూజ ఆ స్థలం వద్ద గుమికూడిన వ్యక్తులకు తుపాకి చూపించి బెదిరించిన ఫోటోలు కూడా పత్రికల్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో స్థానిక పోలీసులు తండ్రీ కూతుర్లపై కేసు నమోదు చేసారు. ప్రొబేషనరీ పీరియడ్‌లో అసిస్టెంట్‌ కలెక్టరుగా పుణె జిల్లా కలెక్టరు కార్యాలయంలో చేరాల్సిందిగా ఆమె జాయినింగ్‌ ఆర్డరు అందుకున్నారు. ఆమె నేరుగా కలెక్టరు కార్యాలయంలో సిబ్బందితో వాట్సప్‌ చాట్‌ చేసింది. ఆ చాట్‌ కూడా సంచలనం సృష్టించింది. తనకు కలక్టరు ఆఫీసులో ఒక ప్రత్యేక క్యాబిన్‌ కేటాయించాలని, దానికి అనుబంధంగా వాష్‌రూం ఉండాలని, వెంటనే రెసిడెన్షియల్‌ క్వార్టరుతో పాటు ఒక కారును కూడా ఇవ్వాలని, ఒక ప్యూన్‌ను ప్రత్యేకంగా ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేసింది. నిజానికి ప్రొబేషనరీ పీరియడ్‌లో అధికారులకు ఆ వసతులు ప్రభుత్వం సమకూర్చదు. తనకు ప్రత్యేక సదుపాయాలు కేటాయించినంత వరకూ డ్యూటీలో జాయినవ్వనని బీష్మించుకు కూర్చుంది. తనకు సాదాసీదాగా కేటాయించిన రూంలో విధులు నిర్వహించేది లేదని చెప్పి, సెలవులో ఉన్న అడిషనల్‌ కలెక్టరు గదిలో కూర్చోవడాన్ని అక్కడి కలెక్టరు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టరు డాక్టర్‌ సుహాస్‌ దివాసె ముఖ్య కార్యదర్శి సుజాత సౌనిక్‌కు, జనరల్‌ అడ్మిన్‌ శాఖను చూస్తున్న అదనపు ముఖ్య కార్యదర్శి నితిన్‌ గద్రేకు ఈమె విచిత్ర ప్రవర్తనపై నివేదికను పంపించారు.

లెక్కకు మించిన పోలీసు కేసులు

అహ్మద్‌నగర్‌లో పఠార్ధి మండలంలో భాల్గావ్‌ గ్రామానికి సర్పంచ్‌ ఆమె తల్లి మనోరమ ఖేడ్కర్‌. మనోరమ తల్లి తండ్రి అంటే పూజ ముత్తాత జగన్నాథ్‌ బుధావంత్‌ కూడా ఐఏఎస్‌ అధికారే. అక్కడ గ్రామంలో అరెస్టయిన ఒక చిరుదొంగను విడిచి పెట్టాల్సిందిగా నవీ ముంబయి డెప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ వివేక్‌ పన్సారేను ప్రత్యేకంగా ఆమె కోరినట్లు కూడా పుకార్లున్నాయి. సాధారణంగా సొంత ఊరిలో పని చేసినప్పుడు అలాంటి పిఫారసులు చేయాల్సి రావడం సహజమే అనుకున్నప్పటికీ మిగిలిన వార్తలేవీ పూజను రక్షించగలిగేట్టు లేవు. ఇంకా విచిత్రంగా ఆమె వాడుతున్న ఆడి కారును ముంబయి పోలీసులు గత వారం సీజ్‌ చేశారు. దానికి కారణం, ఆమె తన కారుకు ఎర్రబుగ్గ తగిలించి రోడ్లపై తిరుగుతుండడమే. దీనిని సిటీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఆ కారును సీజ్‌ చేసి, ఆమెపై మరో కేసును నమోదు చేసారు. ఈ సమయంలో బయటపడిన మరో విశేషమేమిటంటే ఆమె కారు మీద ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన చలాన్లు ఉన్నాయి. అవి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 21 చలాన్లు నమోదవ్వడం చూసి పోలీసులు షాకయ్యారు. అందులో సగం ఓవర్‌ స్పీడువే ఉన్నాయి.

ఇందులో ఏ ఒక్క కేసులో ఆమెను దోషిగా నిర్ధారించినా ఆమెకు ఇచ్చిన ఐఏఎస్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఐఏఎస్‌ అధికారుల ట్రైబ్యునల్‌ను ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఆ నేరాలకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. జైలు నుంచి విడుదలయ్యాక వైద్యవృత్తి కొనసాగించే అవకాశం ఆమెకు ఉందో లేదో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పరిశీలిస్తుంది. అక్కడ సానుకూలంగా నివేదిక రాకపోతే జీవిత పర్యంతం సాధారణ పౌరురాలిగా గడపాల్సి ఉంటుంది. అటు కలెక్టరు ఉద్యోగం పోయి, ఇటు వైద్యం చేయడానికి అవకాశం లేక రెంటికీ చెడ్డ రేవడిగా ఆమె పరిస్థితి మిగులుతుంది. ఏకసభ్య కమిషన్‌ నివేదిక కొంతవరకు దీని మీద స్పష్టత నీయగలదు.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page