top of page

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌..!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Apr 29
  • 2 min read


  • డీసీసీబీ చైర్మన్‌ అవుతారనే బాబ్జీ పేరు అవుట్‌

  • శివ్వాల నియామకాన్ని స్వాగతిస్తున్న అన్ని వర్గాలు

  • రెండు గ్రూపులకు రెండు పదవులు పంచిన అధిష్టానం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పాత, కొత్తతరం కలయికలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. జనసేన, టీడీపీల మిశ్రమంగా పదవులను పంచుతోంది. పార్టీ కోసం తొలినుంచి కష్టపడిన వారిని చంద్రబాబు కోటాలోను, కొత్త తరాన్ని, యువ నెత్తురును లోకేష్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల నియామకం. పది రోజుల క్రితం చౌదరి బాబ్జీ తనయుడు చౌదరి అవినాష్‌ బయోడేటా పంపాలని నారా లోకేష్‌ కార్యాలయం నుంచి కబురు వచ్చినప్పుడే బాబ్జీ దంపతుల్లో ఎవరికో ఒకరికి కాకుండా, ఈసారి అవినాష్‌కు జిల్లాస్థాయి పదవి ఇస్తారని తెలుగుదేశం శ్రేణులకు అర్థమైపోయింది. మొదట్లో కుల కార్పొరేషన్‌ పోస్టులు భర్తీ చేసినప్పుడు చౌదరి బాబ్జీకి ఒక డైరెక్టర్‌గా నియమించారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఆయన, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఆయన భార్య ధనలక్ష్మి పని చేస్తే, ఆయనకు డైరెక్టర్‌ పదవి ఇవ్వడం సరికాదంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడులు చంద్రబాబుకు విన్నవించుకున్నారు. చౌదరి బాబ్జీ ఫిట్‌గా కనిపిస్తున్నా వయసు రీత్యా భవిష్యత్‌ రాజకీయాల్లో ఈదడం కష్టమని భావించిన లోకేష్‌ కొత్త తరం తరఫున ఆయన కుమారుడికి డీసీఎంఎస్‌ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఇదే సమయంలో డీసీసీబీ చైర్మన్‌గా సరుబుజ్జిలి మండలం షళంత్రి గ్రామానికి చెందిన సీనియర్‌ టీడీపీ నాయకుడు శివ్వాల సూర్యనారాయణను నియమించారు. వాస్తవానికి డీసీసీబీ చైర్మన్‌ పదవి బాబ్జీ కుటుంబానికి రావాల్సి ఉంది. డీసీఎంఎస్‌ను శివ్వాల సూర్యనారాయణకు ఇస్తారని భావించారు. కానీ చౌదరి బాబ్జీ డీసీసీబీ చైర్మన్‌ అయితే, జిల్లాలో కాళింగ సామాజికవర్గంలో చీలిక వస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే భావించడం వల్ల బాబ్జీని వయసు రీత్యా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే బాబ్జీ కాకుండా ఆయన కుమారుడు అవినాష్‌ను తెర మీదకు తెచ్చారో, డీసీసీబీ చైర్మన్‌ పోస్టు ఆ వయసుకు పెద్దదైపోతుందని భావించి, డీసీఎంఎస్‌కు షిప్ట్‌ చేశారు. ప్రోటోకాల్‌ మేరకు డీసీసీబీ పోస్టు ఫోకస్డ్‌గా కనిపించినా డీసీఎంఎస్‌ చైర్మన్‌ కూడా అత్యంత బలమైన పోస్టే. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఈ సీటును వదులుకోడానికి వెలమ నేతలు ఇష్టపడలేదంటే అందులో మజా అర్థం చేసుకోవచ్చు. సోషల్‌ ఇంజినీరింగ్‌లో భాగంగా జగన్మోహన్‌రెడ్డి ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన దళిత మహిళకు డీసీఎంఎస్‌ చైర్మన్‌ పోస్టు ఇస్తే, ఆమె పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్లీ పాత కాపులే దీన్ని సొంతం చేసుకున్నారంటే.. డీసీఎంఎస్‌లో క్రీమ్‌ ఉన్నట్టే లెక్క. చివరి నిమిషంలో కుడి ఎడమగా మారిపోయి డీసీసీబీ రావాల్సినవారికి డీసీఎంఎస్‌, డీసీఎంఎస్‌ ఇవ్వాల్సినవారికి డీసీసీబీ ఇచ్చినా పొరపాటు లేదనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అవినాష్‌కు వయసు రీత్యా డీసీఎంఎస్‌ సరిపోతుందని చెబుతున్నా, బాబ్జీని పరిగణలోకి తీసుకుని ఉంటే డీసీసీబీ వచ్చివుండేది కదాని ఆయన సామాజికవర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. చౌదరి బాబ్జీ మొదట్నుంచి కింజరాపు కుటుంబానికి ఫాలోవర్‌గానే ఉన్నారు. జిల్లాలో ఇదే సామాజికవర్గానికి చెందిన కూన రవికుమార్‌ ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గ్రూపు రాజకీయాల్లో భాగంగా చౌదరి బాబ్జీ కింజరాపు కుటుంబంతోనే ప్రయాణం కొనసాగిస్తున్నారు. కూన రవికి కూడా కుదరనిది ఇక్కడే. అందుకే చౌదరి బాబ్జీ పేరును అధిష్టానం పరిశీలించాలంటే ఒకటికి పది సమీకరణాలు చూసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. చంద్రబాబు వద్ద కింజరాపు కుటుంబం మాట చెల్లుబాటవుతుంటే, లోకేష్‌ను కూన రవి ఫాలో అవుతున్నారు. ఇక తన నియోజకవర్గంలో శివ్వాల సూర్యనారాయణకు డీసీసీబీ చైర్మన్‌ పోస్టు ఇప్పించడం వెనుక కూన రవి బలంగా చక్రం తిప్పారు. డీసీసీబీ పోస్టులో తమవారుంటే అనేక పనులు చేయించుకోవచ్చని అచ్చెన్న వర్గం భావించినా, కూన రవి మాటే చెల్లుబాటు కావడానికి కారణం శివ్వాల సూర్యనారాయణ గ్రూపులకు అతీతమైన నాయకుడు. కూన రవి ఈ ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు ఎవరూ వ్యతిరేకించకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ పామూ చావకుండా, కర్రా విరగకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులిద్దరూ జిల్లాలో ఈ రెండు పోస్టులను రెండు గ్రూపులకు సమానంగా కట్టబెట్టారు. ఇక జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పోస్టు ఒకటే మిగిలింది. అది గ్రంథాలయ సంస్థ చైర్మన్‌. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పదవుల్లో ఇదొకటి. దీని కోసం టీడీపీ జిల్లా మహిళా మాజీ అధ్యక్షురాలు బగాది సుశీల భర్త బగాది వెంకటరమణ అడుగుతున్నారు. కానీ కాళింగుల కోటాలో చౌదరి అవినాష్‌కు డీసీఎంఎస్‌ ఇవ్వడం వల్ల జిల్లాలో యాదవ, మత్స్యకార వంటి కులాల వారికి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. డీసీసీబీ లేదా డీసీఎంఎస్‌లలో ఏదో ఒక పదవి తన నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ టీడీపీ నాయకుడు పీరుకట్ల విఠల్‌కు ఇవ్వాలంటూ పలాస ఎమ్మెల్యే కూడా చంద్రబాబును కోరారు. కానీ అప్పటికే ఆ నియోజకవర్గానికి రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి ఒకటి ఇవ్వడం వల్ల దీన్ని అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. గౌతు శిరీషకు కూడా చౌదరి బాబ్జీ కుటుంబం దగ్గరదే. శిరీష తండ్రి శివాజీకి కూడా బాబ్జీ కావాల్సిన వ్యక్తే. కాబట్టి ఆమె కూడా పీరుకట్ల కోసం పెద్దగా ఒత్తిడి తేలేదు. ఇక నామినేటెడ్‌ పోస్టులేవైనా ఉంటే తమకు కూడా కావాలని వెలమలు కోరడం మానుకోవాలని మంత్రులిద్దరూ పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఏవైనా పోస్టులు వస్తే, వాటిని మిగిలిన కులాలకు కేటాయించనున్నారు

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page