top of page

కోమట్లు... ఎన్నికల కుంపట్లు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Apr 19
  • 3 min read
  • సానా షన్ముఖరావు వైపు రాష్ట్ర అధ్యక్షుడు మొగ్గు

  • హరిగోపాల్‌కు ఇవ్వాలని నగర నాయకులు పట్టు

  • అమీతుమీ తేల్చడానికి 20న సిద్ధం

  • శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమైన ప్రముఖులు

  • వలస నాయకులకు బెర్త్‌ లేదని తేల్చేసిన సమావేశం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అందులోనూ పూర్తిగా నామినేటెడ్‌ పదవులు భర్తీ కాకపోవడంతో కులసంఘాలకు ప్రాతినిధ్యం వహించేవారికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్న ఆలోచనతో ఆ పదవులకు పోటీ పెరిగింది. 2024 ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన తెలుగుతమ్ముళ్లతో పాటు, ఎన్నికలకు ముందు వైకాపాను వీడి టీడీపీలోకి వచ్చినవారు, పరోక్షంగా కూటమి అభ్యర్థి గెలుపునకు సహకరించినవారు.. ఇలా వరుసగా పదవుల కోసం క్యూ కడుతున్నారు. జిల్లాలో కళింగకోమట్ల జనాభా మైనార్టీ సామాజికవర్గాలన్నిటికంటే ఎక్కువగా ఉండటం వల్ల ఈ కులసంఘం అధ్యక్ష పదవికి ఎన్నడూ లేనివిధంగా తీవ్ర పోటీ నెలకొంది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అప్పుడు ఉన్న మంత్రుల అభీష్టం మేరకు రాష్ట్ర, జిల్లా, జాతీయ అధ్యక్షులు, నగర అధ్యక్షులు, కార్యవర్గం ఏర్పాటయ్యేది. కానీ తొలిసారిగా జిల్లా కళింగకోమటి అధ్యక్ష పదవి కోసం నువ్వా, నేనా అన్న రీతిలో యుద్ధం జరుగుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర కళింగకోమటి సంఘం అధ్యక్షుడిగా కోటబొమ్మాళికి చెందిన బోయిన గోవిందరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కులంలో జరిగిన కొన్ని కుమ్ములాటల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బోయిన ప్రకటించారు. కానీ కళింగకోమటి పెద్దలంతా ఆయన్ను ఒప్పించి, మెప్పించి మళ్లీ ఆయనే కొనసాగేలా వ్యవహరించారు. ఇందుకు కారణం.. రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడి అండదండలు బోయిన గోవిందరాజులుకు ఉండటమే. అయితే ఇప్పుడు అదే బోయిన గోవిందరాజులు జిల్లా అధ్యక్షుడ్ని ఆయన అభీష్టం మేరకు నియమించే విధానం మాత్రం జిల్లాలో చాలామంది కళింగకోమటి నేతలు సరికాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఈ సంఘంలో కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లా కళింగకోమటి సంఘం అధ్యక్షుడిగా ఉన్న తంగుడు జోగారావు వైకాపా ఫాలోవర్‌. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. దీనికితోడు ఆయన పదవీకాలం కూడా ముగిసింది. దీంతో కూటమికి చెందిన తెలుగుదేశం నేతను జిల్లా అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇందుకోసం ఏకాభిప్రాయం సాధించాలని బోయిన గోవిందరాజులు ఈ నెల 15న నగరంలో ఉన్న 15 మంది కళింగకోమటి నేతలతో పాటు జిల్లాలో వారి సామాజికవర్గం బలంగా ఉన్న మిగిలిన ప్రాంతాల నుంచి కూడా మరికొంతమందిని కోటబొమ్మాళి పిలిచారు. ఇందులో అభిప్రాయాలు సేకరించిన తర్వాత సోంపేటకు చెందిన సానా షన్ముఖరావును జిల్లా అధ్యక్షుడిగా నియమించాలన్న తన అభిలాషను బోయిన గోవిందరాజులు బయటపెట్టారు.

నగరం నుంచి 15 మందికి పిలుపొస్తే.. ఆరుగురు మాత్రమే వెళ్లారు. దీంతో బోయిన గోవిందరాజులు సానా షన్ముఖరావు పేరును ప్రతిపాదిస్తే, ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చినవారికి ఎలా ఇస్తారన్న అభ్యంతరం లేవనెత్తడంతో పలాసకు చెందిన మల్లా కృష్ణారావు పేరు తెర మీదకు వచ్చింది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు కోటబొమ్మాళిలో ఉండి, జిల్లా అధ్యక్షుడు సోంపేటలోనో, పలాసలోనో ఉంటే జిల్లా అధికారులు కేంద్రీకృతమైవున్న నగరంలో కళింగకోమట్లకు దూరాభారం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో మల్లా కృష్ణారావు బోయిన గోవిందరాజులు ఎలా చెప్తే అలా ముందుకెళ్లడానికి సిద్ధమంటూ ప్రకటించారు. శ్రీకాకుళం నగరానికే జిల్లా అధ్యక్ష పదవి ఉండాలన్న ప్రతిపాదన రావడంతో కోరాడ హరిగోపాల్‌ పేరు తెర మీదకు వచ్చింది. అయితే సానా షన్ముఖరావుకు ఇవ్వాలన్న బలమైన అభిప్రాయంతో బోయిన గోవిందరాజులు ఉండటం వల్ల రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కోరాడ హరిగోపాల్‌ను పంపిస్తే బాగుంటుందన్న నరసన్నపేట టౌన్‌ ప్రెసిడెంట్‌ ప్రతిపాదనను గోవిందరాజులు తిరస్కరించారు. దీంతో సానా షన్ముఖరావు అధ్యక్షుడిగా ఉండాలా, మల్లా కృష్ణారావుకు ఇస్తారా, లేదూ తనకే ఇస్తారా? తేల్చుకోవాల్సింది ఇక్కడ కాదని, నగరంలో కళింగవైశ్య కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించి ఈ నెల 20న తన అభిప్రాయం చెబుతానంటూ తనతో వచ్చిన అంధవరపు సంతోష్‌, చైతన్య ప్రభుతో పాటు మిగిలిన తన మనుషులతో హరిగోపాల్‌ వెనక్కు వచ్చేశారు. ఈమేరకు శుక్రవారం రాత్రి స్థానిక కళింగవైశ్య కల్యాణ మండపంలో నగరానికి చెందిన దాదాపు 100 మంది కళింగవైశ్య ప్రముఖులు సమావేశమయ్యారు. ఇందులో 87 మంది కోరాడ హరిగోపాల్‌కే జిల్లా బాధ్యతలు అప్పగించాలని తీర్మానించారు. వాడిగా, వేడిగా రాత్రి 11 గంటల వరకు అయిన ఈ సమావేశంలో హరిగోపాల్‌కు అనుకూలంగా, ప్రతికూలంగా పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి. ఏది ఏమైనా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు ఒక కులం తరఫున నిరాహార దీక్షకు కూర్చున్నది హరిగోపాల్‌ మాత్రమేనని, 2014 నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తిని కాదని వలస నాయకులకు ఈ పదవి ఇవ్వడానికి లేదని తీర్మానించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు స్వయంగా ధర్మాన ప్రసాదరావే కళింగవైశ్య కల్యాణ మండపానికి వచ్చి కోరాడ హరిగోపాల్‌ మార్కెట్‌కు, కులానికి నాయకత్వం వహిస్తే ఎబ్బెట్టుగా ఉంటుందని, ఎందుకంటే.. తాను మార్కెట్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నానని, అటువంటప్పుడు పక్క పార్టీలో ఉన్న హరిగోపాల్‌ను ప్రోత్సహిస్తూ పనులు చేయడం కష్టమవుతుందని ప్రకటించారని, అందులో భాగంగానే రాష్ట్ర సంఘానికి కోణార్క్‌ శ్రీనును, జిల్లా సంఘానికి తంగుడు జోగారావును, నగర సంఘానికి ఊణ్ణ నాగరాజును

నియమించుకున్నారని కొందరు గుర్తుచేశారు. ఇప్పుడు పార్టీ నేతలే వచ్చి కోరాడ హరిగోపాల్‌ పేరు ప్రకటించాల్సిన చోట భిన్నాభిప్రాయాలు సరికాదని చైతన్యప్రభు తీవ్రస్థాయిలో వ్యతిరేకుల మీద విరుచుకుపడ్డారు. అలాగే వరం తనయులు అంధవరపు సంతోష్‌, ప్రసాద్‌లతో పాటు చాలామంది హరిగోపాల్‌కే మద్దతు ప్రకటించారు. ఈ నెల 20న జిల్లా వ్యాప్తంగా కళింగకోమట్ల సమావేశం నిర్వహించి హరిగోపాల్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించాలని, లేదూ అంటే ఎన్నికలు రచ్చరంబోలా అయిపోతుందనే వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. హరిగోపాల్‌కు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం ఇష్టం లేదన్న విషయం తెలుసుకున్న కళింగకోమట్లు నగరానికే ఈ పదవి ఉండాలన్న మెలిక పెట్టారు. నగరంలో హరిగోపాల్‌ తప్ప మరొకరు పోటీలో లేకుండా తీర్మానించారు. గతంలో వైకాపా నియమించిన పెద్దమార్కెట్‌ కమిటీలో ఉన్నవారు సైతం ఈసారి హరిగోపాల్‌కే మద్దతు తెలపడం కొసమెరుపు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page