కార్గిల్ పార్క్లో ఏమేరకు తినేశారు?
- NVS PRASAD
- Jan 7
- 1 min read
‘సత్యం’ కథనంపై ఆరా తీయాలన్న కలెక్టర్
క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్థానిక కొత్త హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న కార్గిల్ పార్క్లో రూ.50 లక్షలు ఖర్చు పెట్టి చేపట్టిన ఆధునీకరణ పనులు బూడిదలో పోసిన పన్నీరైపోయిందని, ఇద్దరు కాంట్రాక్టర్లు రెండు విడతలుగా పనులు చేసినా ఇక్కడ నీరు నిల్వ ఉండిపోతుందని ‘సత్యం’ జనవరి 3న ప్రచురించిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా జేబులు నింపుకొనే పనులు’ కథనంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తీవ్రంగా స్పందించారు. మరోవైపు ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఉన్నఫలంగా పార్కు పరిస్థితిని, పనుల తీరును పరిశీలించాలని సూచించారు. దీంతో కమిషనర్ దుర్గాప్రసాద్ ఈ నెల 4న కార్గిల్ పార్కులో ఇప్పటి వరకు పనులు జరిగాయని ఇంజినీరింగ్ అధికారులు చూపించిన వాటిని పరిశీలించారు. గతంలో కార్గిల్ పార్క్లో ఉన్నవి ఏమిటి? ఇప్పుడు ఆధునీకరించినవి ఏమిటి? అన్నదానిపై డీఈ కమలాకర్ను అడిగి తెలుసుకున్నారు. రూ.50 లక్షల పనుల్లో ఎంతమేరకు పూర్తయ్యాయి? ఏమేరకు బిల్లులు చెల్లింపు అయింది? ఇంకా ఏయే పనులు పెండిరగ్లో ఉన్నాయి? అన్న వివరాలు సమగ్రంగా నమోదుచేసి తన టేబుల్పై ఉంచాలని సూచించారు. పార్కులో మట్టిని ఫిల్ చేసే పనులు పూర్తిస్థాయిలో లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు భోగట్టా. ‘సత్యం’లో వచ్చిన కథనంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరడంతో సంబంధిత డీఈ, ఈ పనులను పరిశీలిస్తున్న ఏఈల నుంచి ఎంబుక్ను తెప్పించి కమిషనర్ నివేదిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పార్క్కు కేటాయించిన నిధులతో పనులు పూర్తయిపోయాయని నమ్మించే ప్రయత్నం చేయడంతో ‘సత్యం’ ఆధారాలతో సహా ఓ కథనాన్ని ప్రచురించడం, అందులో పార్క్లో నీరు నిల్వ ఉన్న ఫొటోలు కనిపిస్తుండటంతో మట్టిని పూర్తిస్థాయిలో నింపే ప్రక్రియకు కమిషనర్ రంగం సిద్ధం చేశారని తెలుస్తుంది.
Comments