కాలంతో పాటు మారిన నారదుడు
- Guest Writer
- Apr 23
- 3 min read

‘ప్రపంచంలో అత్యంత పతివ్రత ఎవరు?’ అని నారదుడు అడిగాడు. అనసూయ (అత్రి మహర్షి భార్య) కంటే గొప్ప పతివ్రత ఎవరూ లేరని ఆకాశవాణి పలకడంతో, స్వర్గలోకంలో గందరగోళం మొదలైంది. దాంతో ముగ్గురు ప్రధాన దేవుళ్లు (త్రిమూర్తులు) ముగ్గురు మునుల రూపంలో అనసూయ వద్దకు వెళ్లారు.
‘నేను మీకు ఎలా సేవ చేయగలను?’ అని అనసూయ అడిగింది. అనసూయకు సంతానం లేదని తెలిసిన ఆ దేవుళ్లు, ‘నీ శరీరంలోని పాలను మాకు ఇవ్వు’ అని కోరారు. కానీ ఆమె ఏమాత్రం బాధపడలేదు. ఆమె ఆ ముగ్గురు వ్యక్తులను తన పిల్లలుగా భావించి చూసింది. వెంటనే ఆమె స్తనాల నుంచి పాలు ప్రవహించాయి. ఆ ముగ్గురు దేవుళ్లు శిశువులుగా మారిపోయారు.
దీనితో విశ్వంలో గందరగోళం ఏర్పడింది. త్రిమూర్తుల భార్యలు అనసూయ వద్దకు వెళ్లి, తమ భర్తలను యథాస్థితికి తీసుకురావాలని వేడుకున్నారు. ఇది ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి చేసిన అల్లరి అని, అది వికటించిందని వారు ఒప్పుకున్నారు. చివరకు ఆ ముగ్గురు దేవుళ్లు తమ భార్యలతో కలిసి స్వర్గానికి వెళ్లిపోయారు. వారు ఆ పతివ్రత అనసూయను ఒక బిడ్డతో దీవించారు. వెళ్లే దారిలో, వారు నారదుడిని కలిశారు. ఆయన నవ్వుతూ, ‘నారాయణ, నారాయణ!’ అని జపిస్తూ వెళ్లిపోయాడు.
గాసిప్ నుంచి దైవత్వం వరకు
నారదుడు హిందూ పురాణాలలో కనిపించే చిలిపి, సంచార ముని. కథలో ఆయన ఉంటే ఏదో గొడవ జరుగుతుందని అర్థం. ఒక పాత్రగా ఆయన కీలక పాత్ర పోషిస్తారు. మనకు గాసిప్స్ అంటే ఉన్న ఇష్టం, మన బలహీనమైన అహం, పోటీతత్వం, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవాలనే ఆరాటం, ఉన్నదానితో తృప్తి చెందకపోవడం వంటి మానవ స్వభావాలను ఆయన ఎత్తి చూపుతారు.
‘నర’ అంటే మానవుడు. ‘నారాయణ’ అంటే మానవత్వపు పూర్తి సామర్థ్యం. నారదుడు ఈ రెండింటి మధ్య ఉంటాడు. ఇతరులతో పోల్చుకునే అలవాటును వదిలించుకోవడం ద్వారా, మానవులు ‘నర’ నుంచి ‘నారాయణ’ స్థితికి చేరుకునేలా ఆయన తోడ్పడతాడు. నారదుడు అందరికీ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన కోసం మనకు తెలిసింది చాలా తక్కువ.
క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన ‘ఛాందోగ్య ఉపనిషత్తు’లో జ్ఞాన స్వభావంపై ఇద్దరు బ్రాహ్మణ మునుల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ఆకలిని తీర్చే భౌతిక జ్ఞానానికి, సంతృప్తిని కలిగించే ఆధ్యాత్మిక జ్ఞానానికి మధ్య గల తేడాను గుర్తించమని సనత్కుమార మహర్షి నారదుడికి బోధిస్తారు. ఇక్కడ నారదుడు ఒక అన్వేషకుడిగా కనిపిస్తారు. ఆయనకు ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ, ఆ జ్ఞానానికి ఉన్న పరిమితులపై కూడా ఆయనకు అవగాహన ఉంది.
మనం ఎక్కువగా చూసే వీణను ధరించి సంచరించే నారదుడు, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 2వ శతాబ్దం మధ్య కాలంలో రూపొందించిన మహాభారతం, రామాయణాలలో కనిపిస్తారు. ఆయన పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు సలహాలిస్తూ, శ్రీమహావిష్ణువుతో సంభాషిస్తూ, కథలో కీలక మలుపుల సమయంలో కనిపిస్తారు - కొన్నిసార్లు సలహాదారుగా, మరికొన్నిసార్లు సమస్యలను సృష్టించే వ్యక్తిగా. పురాణాల ప్రకారం, వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకోవడం, తన సోదరులను సన్యాసులుగా మారమని ప్రోత్సహించడం వల్ల ఆయనకు శాపం తగిలిందని చెబుతారు. అలా నిరంతరం సంచరించడానికి శపించబడిన నారదుడు, గృహస్థుడైన విష్ణువుకు శాశ్వత కథకుడుగా మారారు.
క్రీస్తుశకం 3 నుండి 5వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన ‘నారద స్మృతి’, ఆయనను చట్టం, సామాజిక క్రమ ప్రపంచంలో ఒక భాగంగా చూపిస్తుంది. 5 నుంచి 8వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన ‘నారద భక్తి సూత్రాలు’, ఆయనను భక్తి సిద్ధాంతకర్తగా కొత్త కోణంలో ఆవిష్కరిస్తాయి. ఆయన ప్రభావం వైష్ణవ సంప్రదాయానికే పరిమితం కాలేదు. బౌద్ధ జాతక కథలలో, సారిపుత్తుడనే బౌద్ధ సన్యాసికి పూర్వజన్మగా నారదుడిని పేర్కొన్నారు. జైన సంప్రదాయాలు కూడా నారదులను వీరోచిత వ్యక్తులుగా వర్ణిస్తాయి.
వీణ చేతబట్టిన నారదుడు
శిల్పకళా రూపాలు పురాణ గాథలను అనుసరిస్తాయి. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలలో, గుప్త వంశ కాలం నాటి (క్రీస్తుశకం 5వ శతాబ్దం ప్రారంభం) నారదుడి శిల్పం లభించింది. ఇదే అత్యంత పురాతనమైన శిల్పం. విష్ణువు వరాహ అవతారంలో, ఆయన పక్కన వీణ ధరించి, గంధర్వుడైన తుంబురునితో కలిసి నారదుడు కనిపిస్తారు. క్రీస్తుశకం 6వ శతాబ్దం చివరి నాటికి, భువనేశ్వర్లోని శత్రుఘ్నేశ్వర ఆలయంలో అత్యంత ప్రాచీన శైవ ఆలయాలలో ఒకటి.. నారదుడు కథా చిత్రణలో భాగంగా కనిపిస్తారు.
క్రీస్తుశకం 5 నుంచి 12వ శతాబ్దాల మధ్య, దేవాలయ నిర్మాణ శైలి విస్తరిస్తున్న కొద్దీ, నారదుడు ఆలయ గోడలపై తన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి గుహలలో ఆయన ధ్యానముద్రలో కూర్చుని, తంబురను పట్టుకుని నిలబడి కనిపిస్తారు. చోళుల కాలానికి చెందిన చిదంబరం నటరాజ ఆలయంలో, శివుని తాండవానికి సాక్షిగా ఆయన నిలబడి ఉంటారు.
క్రీస్తుశకం 14 నుంచి 17వ శతాబ్దాల మధ్య, విజయనగర, నాయక రాజుల కాలంలో, భక్తి ఉద్యమం ఉధృతం కావడంతో ఆయన ప్రాధాన్యత మరింత పెరిగింది. లేపాక్షి వీరభద్రాలయంలోని స్తంభాలపై ఆయన కనిపిస్తారు, కొన్నిచోట్ల నృత్యం చేస్తున్నట్లు కూడా చిత్రీకరించారు. పార్థసారథి ఆలయంలో ఆయన వీణతో ప్రశాంతంగా నిలబడి ఉంటారు. అలా, సంచార మునిగా ఉన్న నారదుడు సంగీత భక్తికి ఆరాధ్యుడిగా మారారు.
క్రీస్తుశకం 17, 18వ శతాబ్దాల మధ్య తూర్పు భారతదేశంలో ఒక ఆసక్తికరమైన జానపద ఆవిష్కరణ కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లోని జయపూర్ దత్తపారా ఆలయం, ఉచ్కరాన్చార్ చలా ఆలయంలోని టెర్రకోట గోడలపై, నారదుడు రోకలి మీద స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. గ్రామీణ జీవితంలో ఈ రోకలి చుట్టూనే మహిళలు చేరి ముచ్చట్లు చెప్పుకుంటారు. దీని ద్వారా, విశ్వసందేశహరుడైన నారదుడిని గ్రామీణ జీవనశైలికి అనుగుణంగా మార్చి చూపించారు.
వెయ్యి సంవత్సరాలకు పైగా శిల్పకళలో, ధారావాహికత, అనుకరణ రెండూ కలిసి సాగాయి. వీణ, సన్యాసి వేషధారణ, సంచార భంగిమలు అలాగే కొనసాగాయి. అయినప్పటికీ, సందర్భాలు, వాహనాలు, హావభావాలు మారుతూ వచ్చాయి. గుప్త రాజుల కాలం నాటి శిల్పాల నుంచి చోళుల కాలం నాటి మండపాల వరకు, విజయనగర స్తంభాల నుంచి బెంగాల్ టెర్రకోట వరకు, నారదుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిరంతరం పరిణామం చెందాడు.
- దేవదత్ పట్నాయక్, ది హిందూ కోసం..






Comments