top of page

‘గోకులం’లో గుంటనక్కలు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Dec 26, 2024
  • 3 min read
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు పక్కదారి

  • కోళ్ల పెంపకం, గొర్రెలు, అజోలా కిట్‌ పంపిణీ చేయకుండానే రికార్డుల్లో నమోదు

  • 2023 చివరి వరకు ఉన్న అధికారుల వ్యవహారంపై ఫిర్యాదు

  • పశుమత్స్యదర్శిని పుస్తకం పేరిట వసూళ్లు

  • రాజుకుంటున్న పశు సంవర్ధక శాఖ కుంభకోణం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా పశుసంవర్ధక శాఖలో ఒక పద్ధతి ప్రకారం గత పదేళ్లుగా ఆర్ధిక అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటిని అప్పటి ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తిపడడంతో జిల్లా శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడ్డారు. అజోలా కిట్స్‌, చూలు పశువులు, గొర్రెల పంపిణీ, పెరటి కోళ్ల పెంపకం, పాతపట్నంలో తలసరి ఆదాయం పెంచడం కోసం పశుసంవర్ధక శాఖ ద్వారా ఆవులు, గొర్రెలు, మేకల యూనిట్లు కొనుగోలు, గోకులం పేరుతో పశువుల షెడ్లు, పశుగ్రాసం పెంపకం, విత్తనాలు, మందుల పంపిణీ, పశుగ్రాసం పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధులను పక్కదారి పట్టించారు. దీనిపై 2023 డిసెంబర్‌ 12న జిల్లాలోని పలువరు పశు సంవర్థక శాఖ అధికారులు పేర్లను ప్రస్తావిస్తూ లోకాయుక్తకు దళిత సంఘాల ప్రతినిధి సిహెచ్‌ రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. దీనిపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఈ వివాదం ప్రస్తుతం నడుస్తుంది. దీనికి కొనసాగింపుగా గ్రామాల్లో సచివాలయం వ్యవస్థ సేవలు ప్రారంభమైన తర్వాత పశుమత్స్యదర్శని మ్యూగజైన్‌ పేరుతో రూ.5కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. ఇది ఉద్దేశ పూర్వకంగా పశుసంవర్ధక శాఖ అధికారులు, గత ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రి పేషీతో కలిసి ఈ దందాను రాష్ట్ర వ్యాప్తంగా సాగించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌, అదనపు డైరెక్టర్‌, జేడీ, డీడీ శ్రీకాకుళం, పలాస, నరసన్నపేట, పొందూరు, ఆమదాలవలస, పాతపట్నం, నందిగాం ఏడీలు చందాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ, డీజీ ఏసీబీ విజయవాడకి ఎచ్చెర్ల నుంచి ఒక ఫిర్యాదు అందింది.

మాసపత్రిక పేరుతో చందాలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న యానిమల్‌ హజ్బెండ్రీ అసిస్టెంట్‌ (ఏహెచ్‌ఏ)కు పశుమత్స్యదర్శిని సుచిత్ర మాసపత్రిక పుస్తకానికి చందాలు వసూలుచేయాలని టార్గెట్‌ పెట్టారు. పశుసంవర్ధక శాఖలో ఎటువంటి సమాచారమైనా రైతులకు వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా అందజేయవచ్చు. అధికారులు కావాలనే ఒక పధకం ప్రకారం పశుమత్స్యదర్శిని పేరుతో ఒక మాస పత్రికను తీసుకువచ్చారు. పాడి పశువులు, మత్స్య సంపదకు సంబంధించిన సమాచారం రైతులకు అందించాలని అనుకుంటే ప్రభుత్వం ఈ మాస పత్రికను ప్రభుత్వం ఉచితంగా రైతులకు అందించవచ్చు. అయితే దీని ధరను రూ.20గా నిర్ధారించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఒక సచివాలయం పరిధిలో ఉన్న ఏహెచ్‌ఏకు ప్రతి నెల ఆరు పుస్తకాలు టార్గెట్‌ ఇచ్చి ఒక రైతు నుంచి రెండేళ్ల చందా (పోస్టల్‌ ఛార్జీలతో కలుపుకొని) రూ.500 వసూలు చేయాలని హుకుం జారీచేశారు. రెండేళ్లు చందాలు ఇవ్వని రైతులపై ఒత్తిడి పెంచి ఏహెచ్‌ఏలతో చందాలు వసూలు చేయించారు. మాసపత్రికకు చందా ఇవ్వని రైతుల పశువులకు వైద్యం అందించకుండా పశువైద్య అధికారులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారు. రెండేళ్ల చందా చెల్లించని రైతులకు గ్రామాల్లో ఏహెచ్‌ఏ సేవలను అందించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి చందాలు రాబట్టకపోతే ఏహెచ్‌ఏ జీతాల్లో కోత పెడతామని హెచ్చరించి మరీ వసూలుచేశారు. టార్గెట్‌ రీచ్‌ కాని ఏహెచ్‌ఏలకు వేతనాలు నిలిపేస్తామని చెప్పి టార్గెట్‌ ప్రకారం ఒక్కొక్కరి నుంచి ఆరు పుస్తకాలకు రెండేళ్ల చందాగా రూ.3వేలు వసూలు చేశారు.

రూ. 4.65 కోట్లు వసూలు

తీరా చందాలు చెల్లించినా మాస పత్రికలను అందించకుండా తాత్సారం చేశారు. ముద్రించిన కొన్నింటిని మాత్రం జిల్లా జేడీ, డీడీ కార్యాలయాలకు తీసుకువచ్చి మమ అనిపించారు. పశుమత్స్యదర్శిని మాసపత్రిక పేరుతో శాఖ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు అనుమానం వచ్చిన ఏహెచ్‌ఏలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు ఎచ్చెర్ల సచివాలయాలు పరిధిలో ఏహెచ్‌ఏల వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలిసింది. పశుసంవర్ధక శాఖలో టార్గెట్‌ ఇచ్చినవారి వివరాలు, వసూలుచేసిన మొత్తంపై పూర్తి సమాచారం సేకరించినట్టు తెలిసింది. అధికారుల ఆదేశాలతో బలవంతపు వసూళ్లు చేసి ఐడీబీఐ బ్యాంకులో జమ చేసిన మొత్తాన్ని దేనికోసం ఖర్చు చేశారని సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది మే 20న విశాఖపట్నం అదనపు సంచాలకుల కార్యాలయం నుంచి సమాచారం సేకరించారు. ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పశుమత్స్యదర్శిని పేరుతో రూ.4.65కోట్లు రెండేళ్ల కోసం రైతుల నుంచి చందాలు వసూలుచేశారు. దీనికి ప్రభుత్వం కార్పస్‌ ఫండ్‌గా రూ.15 లక్షలు, పశుమత్స్యదర్శిని మాసపత్రికలో ప్రకటనల కోసం రూ. 16.50 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తం రూ. 4.95 కోట్లలో రూ. 2.87 కోట్లు మాసపత్రిక కోసం ఖర్చు చేసినట్టు చూపించారు. బ్యాంకులో ఫిక్సిడ్‌ డిపాజిట్‌గా రూ.1.40కోట్లు చేసినట్టు పేర్కొన్నారు. సేవింగ్‌ అకౌంట్‌లో రూ.69.49 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నట్టు చూపించారు.

మూడు నెలల్లోనే ఖాతా ఖాళీ

రైతుల నుంచి వసూలుచేసిన చందాలు, ప్రభుత్వ ప్రకటనలు, కార్పస్‌ ఫంగ్‌గా పేరుతో విశాఖపట్నంలోని ఐడీబీఐ బ్యాంకులో జమ చేసిన రూ.4.95 కోట్లలో సుమారు రూ.3 కోట్లు ప్రింటర్స్‌, వివిధ సంస్థల పేర్లతో 3 నెలల్లోనే విత్‌డ్రా చేసి అవినీతికి పాల్పడినట్టు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అధికారులంతా పశుమత్స్యదర్శిని మాస పత్రిక పేరుతో వసూలుచేసిన చందాలు మొత్తాన్ని పంచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చందాలు వసూలు చేసిన రెండేళ్ల వరకు అంటే 2021 మే నుంచి చందాలు వసూలుచేయడం ప్రారంభించారు. 2021 జూలై 27న రూ.1.40 కోట్లు ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌తో ఐడీబీఐ బ్యాంకులో విశాఖపట్నం అడిషనల్‌ డైరెక్టర్‌ పేరుతో ఒక ఖాతాను తెరిచి లావాదేవీలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఖాతాలో కేవలం రూ.69 లక్షలు మాత్రమే మిగిలింది. రెండేళ్ల కోసం రూ.500 చొప్పున బలవంతపు చందాలు వసూలు చేసినా పశుమత్స్యదర్శిని మాసపత్రిక మాత్రం చందాదారులకు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలోనూ శాఖ ఉన్నతాధికారుల పాత్ర ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైనా ఏసీబీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి దుర్వినియోగం అయిన నిధులను బాధ్యులైన పశుసంవర్థక శాఖ అధికారుల నుంచి రికవరీ చేయాలని బాధితులు కోరుతున్నారు.

Komentāri


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page