చిత్తశుద్ధి లేని దేశభక్తి!
- DV RAMANA
- May 1
- 2 min read

ఒక్కో సినిమాలో ఒక్కో వేషం వేసినట్లు.. సనాతన అవతారం ఎత్తి దేభక్తుడినని బిల్డప్పులిచ్చినా విషయ పరిజ్ఞానం కొరవడి అన్నీ తప్పులే దొర్లుతాయి. ఏనాడైనా సైనికుల గురించి మాట్లాడారా? వారి బలిదానాలకు సంతాపాలు తెలిపితే వారి త్యాగాల గురించి కాసింతైన అవగాహన ఏర్పడేది. కానీ ఆయనగారు డిప్యూటీ సీఎం కాకముందు దేశం గురించీ మన సైనికుల త్యాగాల గురించి ఒక్క ప్రకటన కూడా వచ్చేది కాదంటే అతిశయోక్తి కాదు. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు అమాయక టూరిస్టులను ఊచకోత కోసిన పహల్గాం ఘటన మొదటిదేం కాదు. ఇటీవలి కాలంలోనే చూస్తే.. ఉరి, పఠాన్కోట్లలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కానీ అప్పుడెప్పుడూ ఈ నాయకుడు స్పందించిన పాపాన పోలేదు. ఉగ్రదాడిలో కల్నల్ ఎంఎన్ రాయ్ మరణిస్తే.. ఆయన కుమార్తె అల్కా రాయ్ తండ్రి మృతదేహానికి సెల్యూట్ చేసిన ఘటన మొత్తం దేశాన్ని కదిలించినా ఈయన మాత్రం కిమ్మనలేదు. కల్నల్ సంతోష్బాబు, కల్నల్ సంతోష్ మహడిక్ ప్రాణాలర్పించినపుడూ మూగనోము వీడలేదు. 2019లో పుల్వామా దాడి జరిగినపుడు యుధ్ధం జరుగుతుందని ముందే తెలుసునన్నాడు. ఏం వార్నింగ్ వచ్చిందో ఏమో మర్నాడే మాట మార్చేశాడు. భార్యాపిల్లలను సురక్షితంగా సింగపూర్లో పెట్టి ఇక్కడ రాజకీయాలు, సనాతనవాదాలు చేయడం ఏం నిబద్ధతో చెప్పాలి. పవనాలు సారూ.. భారత్-పాక్ యుద్ధాలు మూడు కాదు.. నాలుగు (1948, 1965, 1971, 1999) అన్న విషయం కూడా తెలియదా! బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి లొంగి పోయిన పాక్ సైనికుల సంఖ్య 70 వేలు కాదు.. 93 వేలు. ఆ మాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా రక్తం చిందించటానికి సిద్ధం అంటున్నావు.. ఎవరు చిందిస్తారు రక్తం? సినిమాల్లో నకిలీ రక్తం పారించడం, డూపులతో ఫైట్లు, టేకుల మీద టేకులు తీసుకునే మీరు మన సైనికుల కాలిగోటికి కూడా సరిపోరు. పైగా మొన్నటిదాకా మీ ఆడియో ఫంక్షన్లు.. మీ సినిమాల సక్సెస్మీట్లు.. మీ పుట్టినరోజు కేకుల కటింగులు తప్ప ఏమీ తెలియని మీ పిల్ల సైనిక్స్ అకస్మాత్తుగా దేశభక్తి ప్రవచనాలు వల్లించడం, ప్రస్తుత పాక్ పిచ్చి చేష్టలకు నాటి కాంగ్రెస్ పాలకుల నిర్వాకాలే కారణమని విమర్శిం చడమే పెద్ద కామెడీ. వారిలో కొంతమందికి అన్నప్రాసన కాకముందే పాకిస్తాన్ను రెండు ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్. ఇంకొంతమందికి నడక రాకముందే 93వేల మంది పాకిస్తానీ సైనికులను మోకాళ్ల మీద కూర్చోబెట్టిన పార్టీ కాంగ్రెస్. నాటి అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ సూచనలను తృణీక రించి మరీ పాకిస్తాన్ భరతం పట్టిన ఘనతర నాయకురాలు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ. మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్. కానీ ఈనాటి తరంలో పుట్టిన పలు పార్టీలకు, వాటి నాయకులకు దేశ చరిత్ర మీద అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కనీసం వారు స్కూల్లో చరిత్ర పాఠాలు చదువుకున్నారో లేదో కూడా అర్థం కాదు. కనీస అవగాహన లేకుండా ఒళ్లంతా అకారణ ద్వేషం నింపుకొని అర్ధం పర్థం లేని విధంగా అవాకులు చవాకులు మాట్లాడే జట్టును చూస్తే జుగుప్స కలుగుతుంది. పహల్గాం దాడి జరగ్గానే ఏదో ఒకటి చెప్పాలి కదా అన్న యావలో ఆవేశం తప్ప ఆలోచన లేకుండా, భవిష్యత్తు పరిణామాలు ఆలోచించకుండా నోటికొచ్చినట్లు వాగేస్తుంటారు. అణ్వస్త్రాలు వేయాలని ఒకడు, సింధూ జలాల్ని ఆపేయాలని ఒకడు, యుద్ధ విమానాలను మోహరించాలని ఒకడు, నన్ను యుద్దానికి పంపించండి అంటూ ఒకడు, ఇప్పటికే రాకెట్లు ఫలానా చోటికి చేరాయని ఒకడు, ఇదే అదనుగా పీవోకేను పునరాక్రమించాలని ఒకడు.. సూచనలు చేసే స్తున్నారు. ఇలాంటివారికి చదువురాదని అర్థం. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన రెండు దేశాలు యుద్ధానికి దిగితే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని, వినాశనానికి దారితీస్తుందని గ్రహించలేకపో తున్నారు. పోలవరానికే దిక్కులేనిచోట సింధూ జలాలను ఇప్పటికిప్పుడు తరలించడం సాధ్యం కాదని, అసలు న్యూక్లియర్ బాంబుకు, హైడ్రోజన్ బాంబుకూ తేడా తెలియని వారు, ఇండియా చుట్టు కొలతలు తెలియనివారు, సొంత బతుకుని దిద్దుకోలేనివారూ ఒక దేశానికి వ్యతిరేకంగా యుద్ధ నినాదం చేయడం ఉన్మాదమే. ఆధునిక యుగంలో యుద్ధం ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచ పతనానికీ కారమవుతుందన్న విషయం రష్యా`ఉక్రెయిన్, ఇజ్రాయెల్`పాలస్తీనా యుద్ధాలను చూశాక కూడా అర్థం చేసుకోలేని వారి మాటలు అనర్థదాయకమే!
Comments