అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబాడాం గ్రామంలో శుక్రవారం ఉదయం అట్టాడ మురళి (26) అనే యువకుడు చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి సమీపంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు చెప్పిన సమాచారం మేరకు మురళీ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించి ఇరు కుటుంబాలకు తెలియకుండా దూరంగా వెళ్లి 2022లో పెళ్లి చేసుకున్నాడు. యువతి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడంతో ఇద్దరు రెండు నెలల పాటు గ్రామానికి దూరంగా ఉన్నారు. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత మురళీ ఇంటి నుంచి యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్లిపోయారు. అప్పటి నుంచి వీరి మధ్య వైరం నడుస్తుంది. అక్టోబర్్లో యువతి తిరిగి భర్త మురళీ వద్దకు వచ్చేసింది. అత్తవారింటికి వచ్చిన తర్వాత మళ్లీ యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి రాలేదు. మురళీ ఎలక్ట్రీషియన్గా, ప్లంబర్గా పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. మురళీ తల్లిదండ్రులు చిన్నకారు రైతులు. యువతి తల్లిదండ్రులు ఆర్థికంగా స్థితిమంతులు. దీంతో ఈ ప్రేమ వివాహాన్ని మొదటి నుంచి యువతి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నట్టు గ్రామంలో చర్చ సాగుతుంది. ఈ సందర్భంలోనే మురళి ఇంటికి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందడంపై గ్రామంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మురళీ ఆత్మహత్య చేసుకునే మనస్థత్వం కాదని చెబుతున్నారు. యువకుడి మృతిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల ఆ గ్రామానికి చెందిన బడ్డ నాగరాజును హత్య చేసేందుకు బీహార్ నుంచి సుపారీ గ్యాంగ్ వచ్చి పోలీసులకు చిక్కడం, గ్రామానికి చెందినవారి ప్రమేయం ఉన్నట్టు కొందరిని అదుపులోకి తీసుకోవడం ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఇప్పుడు గ్రామానికి చెందిన యువకుడు చెట్టుకు వేలాడుతూ మృతి చెందడంపై గ్రామంలో ఏమి జరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుని తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్య చేసి చెట్టుకు వేలాడదీశారని ఆరోపిస్తున్నారు.
Comments