top of page

చేసేది చీటింగ్‌.. రాజకీయ ఫైటింగ్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Aug 19, 2024
  • 3 min read
  • తప్పుడు దివ్యాంగ పెన్షన్ల వివాదంలో రాజకీయం

  • స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో వ్యతిరేకించాడన్న కక్ష

  • అంతకుముందు కాపాడారు.. ఇప్పుడు ఫిర్యాదు చేశారు

  • పోటాపోటీగా జిల్లాయంత్రాంగానికి ఫిర్యాదుల పరంపర

  • సుదీర్ఘంగా సాగుతున్న ఇబ్రహీంబాద్‌ వ్యవహారం

తప్పుడు దివ్యాంగ పత్రాలతో ప్రభుత్వాన్ని చీట్‌ చేసి పెన్షన్లు, ఇతర ప్రయోజనాలు అందుకుంటున్నవారి సంఖ్య జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా జలుమూరు మండలం సైరిగాంలో ఏకంగా 33 మంది తప్పుడు సదరం ధ్రువపత్రాలతో దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారని గుర్తించిన అధికారులు వైకల్య నిర్ధారణ పరీక్షలకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లో చాలాకాలం నుంచి నలుగుతున్న నకిలీ పింఛన్ల వివాదం ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారింది. తప్పుడు సదరం పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన టీడీపీ నేతలు స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో అతను తమకు వ్యతిరేకంగా చెయ్యి ఎత్తాడన్న అక్కసుతో పెన్షన్‌కు అనర్హుడంటూ తాజాగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెన్షన్ల పేరుతో జరుగుతున్న చీటింగ్‌లోనూ రాజకీయ ఆధిపత్యం కోసం వెంపర్లాడటం విడ్డూరం.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లో వైకల్యం లేకుండానే పింఛన్లు పొందుతున్న వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది. ఈ పంచాయతీలో 11 మంది బోగస్‌ దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారంటూ మొదట ఒక వర్గం ఫిర్యాదు చేయగా, ఇప్పుడు ప్రత్యర్ధివర్గం తొమ్మిది మంది అనర్హులంటూ ఈ నెల 22న గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఇంకోవర్గం మరో ముగ్గురిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఫిర్యాదు చేసిన రెండు వర్గాలు ఇచ్చిన జాబితాల్లోనూ సువ్వారి వెంకటరమణ అనే వ్యక్తి పేరు ఉంది. మొదట అందిన ఫిర్యాదు ఆధారంగా జూలై 10న రణస్థలంలో నిర్వహించిన వైకల్య నిర్ధారణ పరీక్షలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిలో సువ్వారి వెంకటరమణ ఒక్కరే హాజరయ్యారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు తదుపరి పరీక్షలకు రిమ్స్‌కు రావల్సి ఉంటుందని సూచించి పంపేశారు. మిగతా పది మంది గ్రామానికి చెందిన కూటమి నాయకుల సహాయంతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును కలిశారు. ఆ సందర్భంగానే సువ్వారి వెంకటరమణకు పింఛను నిలిచిపోకుండా చూడాలని నాయకులు కోరారు. అయితే ఇటీవల జరిగిన స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో సువ్వారి వెంకటరమణ కూటమికి వ్యతిరేకంగా చేతులు ఎత్తడంతో పరిస్థితి మారిపోయింది. అంతవరకు వెంకటరమణను వెనకేసుకొచ్చిన కూటమి నాయకులు తాజాగా అతనితో సహా తొమ్మిదిమందిని బోగస్‌ దివ్యాంగులుగా పేర్కొంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గమ్మత్తు ఏటంటే లక్ష్మణకుమార్‌ అనే వ్యక్తి ద్వారా జలుమూరు మండలం కరకవలస గ్రామానికి చెందిన ఎస్‌వీ రమణ అనే పేరుతో కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో సమర్పించారు. ఈ ఫిర్యాదులో తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడంపై ఆగ్రహించిన మరో వర్గం వేరే ముగ్గురిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోంది.

ఎంపీడీవో రాజకీయం

రెండేళ్ల క్రితం 2022లో గ్రామంలో బోగస్‌ దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేశారంటూ ఇబ్రహీంబాద్‌ ఉపసర్పంచ్‌ ప్రతినిధి ప్రకాశరావు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పంచాయతీలో సామాజిక పింఛన్లు అందుకుంటున్న వారిలో 301 మందిలో 44 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 12 మందిపై ఫిర్యాదు అందగా, రిమ్స్‌లో సదరం ధ్రువీకరణ పొందిన దిలీప్‌ మినహా మిగతా 11 మంది దివ్యాంగుల పేరుతో అప్పనంగా పింఛను పొందుతున్నట్టు గుర్తించారు. వారు సమర్పించిన ధ్రువపత్రాలు తప్పుడువని వైద్యాధికారులు నిర్ధారించినా మండల అభివృద్ధి అధికారి మాత్రం వారిని రక్షించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు. ఇప్పటికి ఐదుసార్లు ఫిర్యాదులు అందినా ఎంపీడీవో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉందంటూ ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేసేస్తున్నారు. పింఛన్లు నిలిపివేయకుండా ప్రతి నెల మొదటి వారంలో నోటీసులు ఇచ్చి ఆ నెల 20 తర్వాత విచారణకు హాజరుకావాలని కోరుతున్నారు. దీంతో ప్రతి నెల ఒకటిన పింఛను ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతోంది. 21వ తేదీ దాటిన తర్వాత పింఛను నిలిపివేయడానికి గానీ, కొత్తగా పేర్లు చేర్చడానికి అవకాశం ఉండదు. ప్రతి నెలా 21లోగానే సచివాలయాలవారీగా లబ్ధిదారుల జాబితాలను డీఆర్‌డీఏ ద్వారా సెర్ఫ్‌ సీఈవోకు పంపించేస్తారు. అందువల్ల 21వ తేదీ తర్వాత ఈ ప్రక్రియలో ఎవరూ చెయ్యి పెట్టలేరు. దీన్ని ఆసరా చేసుకొని ఎంపీడీవో టెక్నికల్‌గా నకిలీ దివ్యాంగులకు పింఛన్లు నిలిచిపోకుండా చూస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి అనుగుణంగానే నోటీసులు ఇవ్వడం, జాబితా తయారు చేయడానికి ఒకరోజు ముందు డీఆర్‌డీఏ అధికారులతో సంప్రదింపులు జరపడం చేస్తున్నారు.

కాలహరణంపై కలెక్టర్‌ ఆగ్రహం

ఇబ్రహీంబాద్‌లో దివ్యాంగుల పేరుతో పింఛన్లు అందుకుంటున్న 11 మందిపై ఆరోసారి గత నెల 22న ఫిర్యాదు అందగా, వారికి వైద్య పరీక్షలు చేసి సదరం పత్రాలు పరిశీలించాలంటూ ఈ నెల ఎనిమిదో తేదీన రిమ్స్‌ అధికారులకు ఎంపీడీవో లేఖ రాశారు. దీనిపై స్పందించిన రిమ్స్‌ వైద్యులు ఈ నెల 28న పరీక్షలకు హాజరు కావాలంటూ 11 మందికి నోటీసులు ఇచ్చారు. ఇన్ని రోజులు నాన్చడానికి కారణం సెప్టెంబర్‌లో 11 మందికి పింఛను ఇవ్వాలన్న ఆలోచన చేయడమేనని ఫిర్యాదుదారుడు ప్రకాశరావు ఆరోపిస్తున్నారు. అధికారుల బాధ్యతారాహిత్యంపైనా ఈ నెల 12న కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ రిమ్స్‌ అధికారులకు చీవాట్లు పెట్టడంతో ఈ నెల 28న నిర్వహించాల్సిన ధ్రువపత్రాల పరిశీలనను వారం ముందుకు జరిపి 20వ తేదీకి మార్చి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ సీరియస్‌గా ఉండడం, గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కారణంగా మరో 9 మందిపై కూడా ఫిర్యాదు రావడంతో వారిని కూడా ఈ నెల 20న నిజనిర్ధారణకు హజరుకావాలని గ్రామ కార్యదర్శి ద్వారా నోటీసులు అందించారు.

పోటీ ఫిర్యాదులతో పెరుగుతున్న అనర్హులు

గతనెల 22న ఎస్‌వీ రమణ పేరుతో లక్ష్మణకుమార్‌ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో మొదలవలస రమణ, చింతాడ వాసుదేవరావు, సనపల వెంకటగజవరదారావు, కిల్లి పెంటమ్మ, సువ్వారి వెంకటరమణ, చింతాడ అప్పలనాయుడు, సీపాన శ్రీరామ్మూర్తి, కంచరాపు తేజేశ్వరరావు, పైడి రామారావులను నకిలీ లబ్ధిదారులుగా పేర్కొన్నారు. వీరిలో సువ్వారి వెంకటరమణ, మొదటి ఫిర్యాదులో ఉన్న 11 మంది జాబితాలోనూ ఉన్నాడు. వీరితో పాటు మరో ముగ్గురు సీపాన కృష్ణమూర్తి, సూర రామారావు, సీపాన నాగరాజు దివ్యాంగులుగా సదరం సర్టిఫికెట్‌ పుట్టించి పింఛను పొందుతున్నట్టు గ్రామంలో చర్చ జరుగుతోంది. వీరిపైనా ఫిర్యాదు చేయడానికి ప్రత్యర్ధి వర్గం సిద్ధమవుతోంది. దీంతో మొత్తం 44 మంది దివ్యాంగ పెన్షనర్లలో 22 మంది బోగస్‌ లబ్ధిదారులేనని అర్థమవుతోంది. వీరితో పాటు వృద్ధాప్య, ఒంటరి మహిళా పింఛన్లు అందుకుంటున్నవారిలోనూ ఆధార్‌ కార్డులో వయసు, రేషన్‌ కార్డుల్లో కుటుంబ వివరాలు మార్చి పింఛన్లు పొందుతున్న వారు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యలు పరీక్షించి నివేదిక ఇచ్చిన తర్వాత మండల అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page