జిల్లాలో 708 లే అవుట్లలో 33వేల ఇళ్ల నిర్మాణాలు
వాటిలో సగానికిపైగా ఇప్పటికీ ఖాళీగా ఉన్న దుస్థితి
కనీస సౌకర్యాలు సమకూర్చకపోవడమే కారణం
ఊళ్లకు దూరంగా ఉండటంతో వాటిలో చేరేందుకు అనాసక్తి
దళారుల ద్వారా ఇళ్లను అమ్మేసుకుంటున్నట్లు ఆరోపణలు

‘మేం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు’.. అని గత ముఖ్యమంత్రి వైఎస్జగన్ సహా వైకాపా ప్రజాప్రతినిధులు, నేతలు ఆ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఊదరగొట్టారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం, అక్కచెల్లెళ్ల కళ్లల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగని విధంగా ఒకేసారి ముప్పై లక్షలకుపైగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని స్వయంగా వైఎస్ జగన్ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకొంటూ వచ్చారు. ఎన్నికల్లోనూ అదే ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు వాటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం కట్టినవి ఊళ్లు కాదు.. సమస్యల లోగిళ్లు అని ఇళ్లు మంజూరైన లబ్ధిదారులే పెదవి విరిచారంటే జగనన్న కాలనీల పరిస్థితి ఏమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సవాలక్ష సమస్యలతో ఇప్పటికీ చాలా కాలనీలు లబ్ధిదారులకు అందుబాటులోకి రాలేదు. తాగునీరు, కరెంటు, రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస వసతులు కల్పించకపోవడం వల్ల వీటిలో చేరేందుకు లబ్ధిదారులు ముందుకు రావడంలేదు. ఫలితంగా సగానికిపైగా కాలనీలు నివాసయోగ్యంగా లేక ఖాళీగా ఉండిపోయాయి. ఊరికి దూరంగా కట్టిన ఈ ఇళ్లలో చేరేందుకు లబ్ధిదారులు విముఖత చూపుతుండటం కూడా ఈ దుస్థితికి మరో ముఖ్య కారణంగా కనిపిస్తోంది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
నవరత్నాలు పేరుతో అనేక సంక్షేమ పథకాలనే తన అజెండాగా ప్రకటించిన వైకాపా 2019 ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటినుంచీ నవరత్నాల స్కీములో పేర్కొన్న సంక్షేమ పథకాల అమలుకే ప్రాధాన్యమిచ్చింది. అందులో భాగంగా ‘నవరత్నాలు`అందరికీ ఇళ్లు’ పేరుతో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పథకానికి 2021లో శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టింది. రెండు దశల్లో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లులేని పేదల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైనవారిని గుర్తించి జాబితాలు రూపొందించారు. ఆ మేరకు ఎక్కడ ఎంతమందికి ఇళ్లు ఇవ్వాలో గుర్తించి ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి లే అవుట్లు అభివృద్ధి చేశారు. పట్టణ, నగర ప్రాంతాల లబ్ధిదారులకు ఒకటింపావు సెంటు, గ్రామీణ లబ్ధిదారులకు సెంటు చొప్పున స్థలాలు కేటాయించి లే అవుట్లు వేశారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వ సబ్సిడీ రూ.1.80 లక్షలు ఇవ్వగా, నిర్మాణానికి అయ్యే మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు ఇప్పించే ఏర్పాటు చేసింది. ఆ మేరకు కేటాయించిన ప్లాట్లలో లబ్ధిదారులను పెట్టి జియోట్యాగ్ కూడా చేయించి, దస్తావేజులు కూడా ఇచ్చారు. లబ్ధిదారుడి వెసులుబాటును బట్టి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడం లేదా లబ్ధిదారులే సొంతంగా నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాలో 790 లే అవుట్లలో 33,285 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 708 లే అవుట్లలోనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే వీటిలోనూ చాలావరకు అసంపూర్తిగానే ఉన్నాయి. 8846 ఇళ్లు మాత్రమే ఇప్పటివరకు పూర్తి అయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కనీస సౌకర్యాలు మృగ్యం
జగనన్న కాలనీల్లో చాలావాటిలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనా పూర్తి అయిన వాటి సంఖ్య చాలా తక్కువ. కాలనీల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదు. జనావాసాలకు దూరంగా కొండలు, గుట్టల సమీపంలో లే అవుట్లు వేయడం వల్ల తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలన్నింటినీ కొత్తగా కల్పించాల్సిన పరిస్థితి. కానీ అధికారులు ఆ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా కాలనీల్లో చిన్నపాటి వర్షాలకే నీటితో నిండిపోయి, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఎక్కడో దూరప్రాంతాల నుంచి విద్యుత్ లైన్లు పొడిగించి కాలనీలకు కరెంటు ఇవ్వడం అనేక సమస్యలతో కూడుకున్నది కావడంతో చాలా కాలనీల్లో మెయిన్ లైన్లు వేయడంలోనే జాప్యం జరుగుతోంది. అవి పూర్తి అయితే తప్ప ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉండదు. అలాగే రోడ్లు, కాలువల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
`లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో 114 ఇళ్లతో కాలనీ ఏర్పాటు చేయగా ఇప్పటికీ అక్కడ 40 ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. వర్షం పడితే కాలనీ చెరువులా మారిపోతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.
`నరసన్నపేట మండలం ఉర్లాంలో పంట పొలాలకు వెళ్లే గోర్జి మార్గంలో ఆక్రమణలు తొలగించి లే అవుట్ వేశారు. అక్కడ 55 మందికి ఇళ్లు మంజూరు కాగా 45 మంది నిర్మాణాలు పూర్తి చేసి నివాసం ఉంటున్నారు. అయితే రహదారిని అభివృద్ధి చేయకపోవడం, మురుగు కాలువలు నిర్మించకపోవడంతో వర్షాలు పడినప్పుడు నానా అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
`శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలసలో 200 ఇళ్లతో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో 15 కుటుంబాలే నివాసం ఉంటున్నాయి. ఈ కాలనీకి కూడా కాలువలు, రోడ్లు లేవు.
`శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలస జగనన్న కాలనీలో 1780 మందికి ఇళ్లు కేటాయించగా కేవలం వంద కుటుంబాలే నివాసం ఉంటున్నాయి. మరో వంద కుటుంబాలు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలకు సిద్ధమైనా వర్షాలకు కాలనీ అంతా జలమయం కావడంతో వెనుకంజ వేశారు.
దూరాభారంతో అమ్మకాలు
లబ్ధిదారులను మరో కీలక సమస్య ఇబ్బంది పెడుతోంది. జిల్లాలోని మెజారిటీ కాలనీలను కొండలు, గుట్టలు, లోతట్టు ప్రాంతాల్లో కాలనీ లే అవుట్లు వేశారు. దాదాపు అవన్నీ జనావాసాలకు, ఊళ్లకు దూరంగా ఉన్నాయి. అదే సమయంలో ఇళ్లు మంజూరైన వారిలో అధికశాతం పేదవర్గాలకు చెందినవారే. ఊళ్లలో చిన్నాచితకా పనులు చేసుకుని పొట్టపోసుకునేవారే. ఇప్పుడు వారందరూ ఊరికి దూరంగా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలోకి వెళితే ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. ఉపాధి కోసం రోజూ ఆ కాలనీల నుంచి ఊళ్లలోకి రావాలంటే దూరాభారం, ఖర్చులతో కూడుకున్నది కావడంతో ఉపాధి వదులుకుని ఆ ఇళ్లలో చేరేందుకు చాలామంది లబ్ధిదారులు ఇష్టపడటం లేదు. అదే సమయంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించి యూనిట్ కాస్ట్ ఏమాత్రం సరిపోవడంలేదు. అలాగే సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించడం కూడా భారమేనని లబ్ధిదారులు భావిస్తున్నారు. దాంతో చాలామంది జగనన్న ఇళ్లను అమ్మేసుకుంటున్నారు. సగం నిర్మించి వదిలేసిన ఇళ్లను, తమకు కేటాయించిన స్థలాలను రూ.రెండు లక్షల నుంచి రూ. పది లక్షల వరకు బేరం పెట్టి అమ్మేస్తున్నారు. శ్రీకాకుళం నగరానికి సమీపంలో ఉన్న ఎచ్చెర్ల మండలం కుశాలపురం పారిశ్రామికవాడ వెనుక 80 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయగా అక్కడ చాలామంది మధ్యవర్తుల ద్వారా వాటిని విక్రయించేస్తున్నారు. కాగా అర్హతలు లేకపోయినా పరపతితో, బోగస్ పత్రాలతో ఇళ్లు పొందినవారిలో ఎక్కువమంది వాటిని అమ్మేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కుశాలపురంలోనే కాకుండా జిల్లాలోని దాదాపు అన్ని కాలనీల్లోనూ విక్రయాలు కొనసాగుతున్నాయి. దళారులు ఇదే పనిలో నిమగ్నమై కమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున సంపాదించుకుంటున్నారు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోయి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీల పరిస్థితి డోలాయమానంలో పడిరది. లబ్ధిదారులు ఇళ్లు అమ్మేసుకుంటున్నారన్న ఫిర్యాదులు సైతం ప్రభుత్వానికి అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Comments