జనసేన జెండా ఎక్కడ సార్..?
- NVS PRASAD

- Dec 19, 2025
- 1 min read
వాజ్పేయి విగ్రహావిష్కరణలో కనిపించని పొత్తు ధర్మం
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసైనికులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అటల్ - మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎక్కడా జనసేన రంగు జెండాలు కనిపించలేదు. కూటమి బంధంలో భాగంగా స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టూ టీడీపీ, బీజేపీ జెండాలు కనిపించాయి కానీ, ఎక్కడా జనసేన జెండాలు దర్శనమివ్వలేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సనాతనం అంటూ దీక్షలు చేస్తుంటే, ప్రధాని మోడీ భవిష్యత్తులో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే పవనే కీలకమని భావిస్తున్నారనే విశ్లేషకుల అంచనాల మేరకు వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆ పార్టీ జెండాలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. వాజ్పేయి బీజేపీ సొత్తు కాబట్టి కమలం జెండాల వరకు అభ్యంతరం లేదుగానీ, టీడీపీ జెండాలు కూడా కనిపిస్తున్నప్పుడు కూటమి పొత్తులో తమ పార్టీ లేదా? అని స్థానిక జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని పవన్ వీరాభిమాని ఒకరు వెళ్లి బీజేపీ నేతలను ప్రశ్నించారు కూడా. జనసేన జిల్లా అధ్యక్షుడికి జెండాలివ్వాలంటూ 15 రోజుల నుంచి అడిగామని, అయినా స్పందించలేదని, చివరకు తమనుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో పిసిని చంద్రమోహన్ వేరేవారి ఫోన్ నెంబరు ఇచ్చిన నగరంలో ఉంటారని, ఆయనతో మాట్లాడమని చెప్పారని, అయినా కూడా తమకు జెండాలు అందలేదు సరికదా, కొనుగోలు చేసి పెట్టుకోవాలని ఉచిత సలహాలిచ్చారని బీజేపీ నేతలు ఆ అభిమానికి స్పష్టం చేయడంతో హతాశుడవటం ఆయన వంతయింది.






Comments