top of page

టీడీపీలో సంస్థాగత రాజకీయం

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Apr 24
  • 2 min read


  • డివిజన్‌ ఇన్‌ఛార్జీల మార్పునకు కసరత్తు

  • అనంతరం నగర అధ్యక్షుడి ఎన్నికకు సన్నాహాలు

  • వీటిపై టీడీపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం

  • ఈ ఎన్నికలు ఎమ్మెల్యే శంకర్‌కు కత్తి మీద సామే


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

తెలుగుదేశం పార్టీ నగర శాఖ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో గురువారం సాయంత్రం 50 డివిజన్ల ప్రస్తుత ఇన్‌ఛార్జీలతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించినా లేకపోయినా సంస్థాగతంగా అన్ని డివిజన్లకు పక్కాగా ఇన్‌ఛార్జీలను నియమించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు అందరితోనూ సమావేశమవుతున్నారు. ప్రస్తుతం గొండు శంకర్‌ ఎమ్మెల్యేగా ఉండగా.. గతంలో 2014`19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గుండ లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ ఐదేళ్లూ లక్ష్మీదేవే నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆ సమయంలో 50 డివిజన్లకు పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించారు. 2024 ఎన్నికల్లో ఆ ఇన్‌ఛార్జీలతోనే గొండు శంకర్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిని మార్చడంతో అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. శంకర్‌ ఎన్నిక కోసం ఎంతమంది పనిచేశారన్నది పక్కన పెడితే.. కొందరు ఇన్‌ఛార్జీలు ఓపెన్‌గానే శంకర్‌కు మద్దతు పలికి, ఆయన వెనుక తిరిగారు. ప్రస్తుతానికి రెండు వర్గాలకు చెందిన ఇన్‌ఛార్జీలు ఉన్నారు. గుండ లక్ష్మీదేవికి టిక్కెటివ్వనప్పుడు నిరసన తెలిపిన డివిజన్‌ ఇన్‌ఛార్జీలను మార్చబోమని అప్పట్లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే వారిని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. గొండు శంకర్‌కు మద్దతు పలికిన పది డివిజన్లలో ఇన్‌ఛార్జీల పోస్టులకు ఢోకా లేకపోయినా, ప్రస్తుతం ఎమ్మెల్యేతో సఖ్యంగా ఉంటున్నవారెవరు, ఇప్పటికీ అరసవల్లికి రాకపోకలు సాగిస్తున్నవారెవరు అన్న లెక్కల మేరకు ఐదు డివిజన్లలో ఇన్‌ఛార్జీలను మారుస్తారని, మిగిలినవి అలాగే ఉంటాయని తెలుస్తోంది. ఇక ఎన్నికల ముందు వైకాపాను వీడి తెలుగుదేశంలోకి వచ్చిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వరం కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండటంతో ఆ డివిజన్‌లో మార్పు అనివార్యమని తెలుస్తోంది. ఇక గొండు శంకర్‌ కోసం బలంగా పని చేసిన మరో వలస నాయకుడు దాస్యం రాంబాబు (నాని)ను కూడా అకామిడేట్‌ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే డివిజన్‌ నుంచి రోణంకి కల్యాణ్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి రెండు డివిజన్లు సర్దుతారని భోగట్టా.

30న అధ్యక్షుడి ఎన్నిక

50 డివిజన్లకు ఇన్‌ఛార్జీల నియామక ప్రక్రియను ఈ నెల 30 నాటికి పూర్తి చేసి అదే రోజు నగర టీడీపీ అధ్యక్షుడ్ని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. డివిజన్ల వరకు ఇన్‌ఛార్జీలను నియమించడం పెద్ద కష్టం కాకపోయినా, నగర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మాత్రం ఎమ్మెల్యేకు కత్తిమీద సామే. ప్రస్తుత టౌన్‌ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ తనను కొనసాగిస్తారన్న భావనతో ఉండగా, ప్రస్తుతం ఉన్న డివిజన్‌ ఇన్‌ఛార్జీలు, 30వ తేదీలోపు మారే ఇన్‌ఛార్జీల్లో మెజార్టీ సభ్యులు ఆయన మనుషులే. కానీ సుదీర్ఘ కాలంగా ఆయనే నగర అధ్యక్షుడిగా ఉన్నందున ఎమ్మెల్యే మారినట్టే నగర అధ్యక్షుడిని కూడా మార్చాలని మరికొందరు కోరుతున్నారు. ఇందులో బహిరంగంగా తనకు నగర పార్టీ పగ్గాలు కావాలని అడుగుతున్నది మాజీ కౌన్సిలర్‌ పాండ్రంకి శంకర్‌ ఒక్కరే. లక్ష్మీదేవి కుటుంబాన్ని మొదటే వ్యతిరేకించి గొండు శంకర్‌కు టికెట్‌ వస్తుందో, రాదో తెలియని రోజుల నుంచి ఆయన వెంట నడిచిన పాండ్రంకి శంకర్‌ నగర అధ్యక్ష పదవి కోసం పట్టుపడుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆశీస్సులు తనకు ఉన్నాయని చెబుతున్నారు. వీరిద్దరూ కాకుండా కళింగకోమట్ల కోటా నుంచి వరం కుమారుడు సంతోష్‌, కోరాడ హరిగోపాల్‌ కూడా తమకిస్తే తప్పేంటన్న ధోరణిలో ఉన్నారు. అయితే ఇందులో వరం తనయుడు బహిరంగంగా తనకు కావాలి అని అడగకపోయినా కోరాడ హరిగోపాల్‌ మాత్రం నగరంలో కోమట్ల ఓట్లు పోలరైజ్‌ కావాలంటే నగర పార్టీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు భోగట్టా.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page