డీజిల్ లేదు.. పెట్రోల్కు కొరత లేదు
- Prasad Satyam
- Apr 27
- 1 min read
ప్యానిక్ సిండ్రోమ్తో బంక్ల వద్ద క్యూ
సోమవారం సాయంత్రానికి అన్ని బంకులకూ ఫుల్స్టాక్

(శ్రీకాకుళంలో మూర్తి పెట్రోల్ బంక్ )
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఎక్కడో ఒక మారుమూల బంక్లో పెట్రోల్ దొరకడంలేదన్న సోషల్ మీడియా ప్రచారానికి సగటు వాహనదారుడు ప్యానిక్ అయిపోయి ట్రంప్ మీద హత్యాయత్నం, ఇరాన్ యుద్ధం అన్నీ తన నెత్తినే పడినట్లు ఫీలైపోయి పెట్రోల్ బంక్ వద్ద క్యూ కట్టడంతో పెట్రోల్ కూడా జిల్లాలో ఆదివారం దొరక్కుండాపోయింది. ఉన్నంతమేర కొన్ని బంకులు ఆదివారం సరఫరా చేసినా సోమవారం ఉదయానికి చేతులెత్తేశాయి. దీంతో నగరంలో అనేక బంకుల్లో నోస్టాక్ బోర్డు కనిపించింది. వాస్తవానికి నగరంతో పాటు జిల్లాలో ఎక్కడా పెట్రోల్కు కొరత లేదు. కంపెనీలు కూడా ఆమేరకు బంకులకు సరఫరా చేస్తున్నాయి. కానీ వంద బంకుల్లో 20 బంకులకు ఎప్ప్పుడూ పూర్తిస్థాయి వ్యాపారం ఉండదు. ఇటువంటివారు రెగ్యులర్గా ఆయిల్ను కంపెనీ నుంచి తెచ్చుకోరు. ఇటువంటి చోట పెట్రోల్ దొరక్కుండాపోతుంది. దీన్ని సోషల్మీడియా పెద్దగా చూపించడం వల్ల మిగిలిన బంకుల పైన జనాలు పడిపోయారు. అందరూ ఫుల్ట్యాంకులు కొట్టించుకోవడంతో పాటు ఇన్ఫ్లుయెన్స్ మేరకు స్టాక్ కూడా పెట్టుకోవడంతో అనేక బంకుల్లో పెట్రోల్ అయిపోయింది. వాస్తవానికి ఆదివారం చమురు సంస్థల నుంచి ట్యాంకర్లు రావు. శనివారం కూడా అరకొరగా వస్తాయి. దీనికితోడు ఒకేసారి ప్యానిక్ అవడంతో పెట్రోల్ అందకుండాపోయింది. సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయానికి అన్ని బంకులకూ పెట్రోల్ సరఫరా కానుంది. డీజిల్ను మాత్రం ఎప్పట్నుంచో కంపెనీలు ఆశించిన స్థాయిలో ఇవ్వడంలేదు. ఇంటర్నెషనల్ మార్కెట్లో బ్యారెల్ ధర పెరగడం వల్ల చమురు సంస్థలు నష్టాన్ని చవిచూస్తున్నాయి. దీంతో డీజిల్ ఇవ్వడానికి అవి సిద్ధంగా లేవు. అందువల్ల బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డు కనిపిస్తోంది. దీనికి తోడు రెండు రోజుల్లో రెండోవిడత పోలింగ్ కూడా పశ్చిమబెంగాల్లో ముగుస్తున్నందున ప్రభుత్వం ఆయిల్ ధరలు పెంచుతుందనే నమ్మకంతో కంపెనీలున్నాయి. అందుకే తమ దగ్గర ఉన్న డీజిల్ను ముందుగానే రిలీజ్ చేయడానికి ఇష్టపడటంలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పెట్రోల్ కోసం సగటు వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.






Comments