top of page

డీడీ అక్రమాలపై గుట్టుగా విచారణ

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 22
  • 2 min read


  • బాధితుల వాంగ్మూలం నమోదుకు నిరాకరణ

  • డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఇవ్వాలన్న అధికారి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహనరెడ్డి అక్రమాలు, అవినీతిపై కలెక్టరేట్‌లో మంగళవారం విచారణ జరిగింది. విచారణ అధికారిగా వ్యవహరించిన కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.పద్మావతి చాంబర్‌లో విచారణను నిర్వహించారు. బాధితుల తరఫున ఈ నెల 9న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన దళిత సంఘాల నాయకుడితో పాటు డీడీ విశ్వమోహన్‌రెడ్డిని విచారించారు. అయితే ఆమె విచారించిన తీరుపైనే బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులెవరికీ నోటీసులు ఇవ్వకుండా ఫిర్యాదుదారుడు తవిటయ్య ఒక్కరి వాంగ్మూలమే నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విశ్వమోహన్‌ రెడ్డి అక్రమాలు, సాంఘిక సంక్షేమశాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పేరుతో వసూలు తదితర ఆరోపణలపై ‘సత్యం’ వరుస కథనాలు ప్రచురించింది. అయినా అధికారులు స్పందించలేదు. వైకాపా ఏజెంట్‌గా విశ్వమెహన్‌రెడ్డి పని చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. చివరికి దళిత సంఘాల నాయకుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విశ్వమోహన్‌రెడ్డి అక్రమాలపై విచారణ ప్రారంభమైంది. అయితే విశ్వమోహన్‌రెడ్డికి మద్దతుగా కార్యాలయం పనివేళలో కొందరు సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు, వార్డెన్లు కలెక్టరేట్‌లో కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ చాంబర్‌ బయట కాచుకొని కూర్చోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ జరుగుతున్న అంశాన్ని తెలుసుకొని అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులు ఫోటో తీయడానికి అవకాశం ఇవ్వాలని కోరినా విచారణ అధికారి పద్మావతి నిరాకరించారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా ఒక అటెండర్‌ను కాపలా పెట్టారు. డీడీపై కలెక్టర్‌కు దళిత సంఘాల నాయకుడు తవిటయ్య ఫిర్యాదులో పేర్కొన్న వారెవరికీ నోటీసులు జారీ చేయలేదు. విచారణకు పిలవకపోవడంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తవిటయ్య పేర్కొన్న బాధితుల్లో నోటీసులు ఇవ్వకపోయినా కలెక్టరేట్‌కు వచ్చిన ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తానని చెప్పి డీడీ విశ్వమోహన్‌రెడ్డి ఏడాదిన్నర క్రితమే రూ.2.50 లక్షలు డిమాండ్‌ చేస్తే విడతల వారీగా రూ.2.30 లక్షలు ఇచ్చినట్టు వివరించాడు. అవుట్‌ సోర్సింగ్‌ జాబితాలో పేరు చేర్చడానికి మరో రూ.20 వేలు డిమాండ్‌ చేస్తే ఇవ్వలేకపోయానని, దీంతో ప్రసాద్‌ పేరును జాబితా నుంచి తప్పించడంతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కుటుంబ సభ్యులతో కలిసి విశ్వమోహన్‌రెడ్డిని కార్యాలయంలో కలిస్తే దూషించి, దుర్భాషలాడినట్టు బాధితుడు తెలిపారు. విచారణ అధికారి లోపలికి పిలిచి వాంగ్మూలం నమోదు చేయకుండా డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలుంటే ఇవ్వాలని సూచించినట్టు బాధితుడు వివరించారు. ఆధారాలు లేవని చెప్పడంతో లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని విచారణ అధికారి సూచించి బయటకు పంపేసినట్టు బాధితుడు తెలిపాడు. డీడీ విశ్వమోహన్‌రెడ్డి విచారణకు ముందే సాంఘిక సంక్షేమశాఖలో సీనియారిటీని విస్మరించి నిర్వహించిన ఉద్యోగోన్నతుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై వార్డెన్‌ తారకేశ్వరరావు విచారణ అధికారి పద్మావతిని కలిసి అక్రమాలపై ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే విచారణ అధికారి పద్మావతి డీడీ విశ్వమోహన్‌రెడ్డిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆధారాలు లేకుండా తననెవరూ ఏమీ చేయలేరని డీడీ విశ్వమోహన్‌రెడ్డి అన్నట్టు బాధితులు వాపోతున్నారు. దీంతో విచారణ ఏకపక్షంగానే సాగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

`

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page