‘తెర’ తీసినా వీడని ‘భరోసా’ చెర
- BAGADI NARAYANARAO
- Jul 13, 2024
- 3 min read
మత్స్యకార పరిహారానికి కొత్త నిబంధనలు
నిషేధం ముగిసి నెలైనా జమకాని నిధులు
డీజిల్ బకాయిలు గుదిబండగా మారాయి
గత ప్రభుత్వ తప్పులకు మత్స్యకారులు బలి
అనర్హులను ఏరేస్తున్న అధికారులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సముద్రంలో మత్స్యసంపద వృద్ధి చెందే సమయంలో మరబోట్లతో చేపల వేట చేయడాన్ని నిషేధించడం వల్ల, దానిపైనే ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలకు అందించే పరిహారం జాప్యం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో పరిహారం పెంచినా, అరకొరగా అందించడం, అర్హులందర్నీ గుర్తించకపోవడం వల్ల 2024 ఎన్నికల్లో మత్స్యకార ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలన్నీ కూటమి వైపే మొగ్గుచూపాయి. ఈ ఏడాది ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు 61 రోజుల పాటు మెకనైజ్డ్ బోట్లను చేపల వేటకు వినియోగించడాన్ని నిషేధించారు. వీరి కోసం 2014 వరకు ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం, రూ.2వేలు పరిహారంగా అందజేస్తూ వచ్చారు. 2014లో ఈ పరిహారాన్ని రూ.4వేలకు పెంచారు. 2020లో పరిహారాన్ని రూ.4వేలు నుంచి రూ.10వేలకు పెంచి అందజేస్తూ వచ్చారు. నిషేధం అమల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే పరిహారం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తూ వచ్చారు. ఇప్పుడు సముద్రంపై తెరను తొలగించి నెల రోజులు పూర్తయినా మత్స్యకార భరోసా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. గత ఏడాది మే 16నే డబ్బులు జమ చేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. గత ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపికను అధికారులు పూర్తిచేసి ఈ నెల 2న ప్రాథమిక జాబితాను తయారుచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జాబితాకు ఆమోదం తెలపాల్సిన ఎన్డీయే సర్కార్ లబ్ధిదారుల గుర్తింపు అంశంపై కొర్రీలు వేసి మరోసారి సర్వే నిర్వహించాలని అధికారులకు ఆదేశించింది. దీంతో మత్స్యకారులకు అందాల్సిన పరిహారం జమ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జిల్లాలోని 197 కిలోమీటర్లు తీరప్రాంతానికి ఆనుకొని ఉన్న 11 మండలాల్లో మెకనైజ్డ్ బోట్లపై సముద్రంలో చేపల వేట చేసి జీవనం గడుపుతున్న కుటుంబాలు వేలల్లోనే ఉన్నాయి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అందించే పరిహారం కోసం మూడేళ్లుగా నిషేధిత కాలానికి వారం రోజుల ముందు మార్గదర్శకాలు విడుదల చేస్తూ వచ్చారు. గత ఏడాది మత్స్యకార భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలు ఏప్రిల్ 6న విడుదలయ్యాయి. ఏప్రిల్ 17 నుంచి ఎన్యుమరేషన్ నిర్వహించి అదే నెల 25న ఆర్బీకేలు, సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించారు. అదే సమయంలో అభ్యంతరాలను ఏప్రిల్ 25 నుంచి 27 వరకు స్వీకరించి 28, 29 తేదీల్లో పరిష్కరించారు. తుది జాబితాను 30న ప్రకటించి మే 16 నుంచి మత్స్యకారుల ఖాతాలో జమ చేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో ఎన్నికల కమిషన్ అనుమతితో ఈ ఏడాది మే2న గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించారు. అర్హులను గుర్తించి మే 3, 4 తేదీల్లో ఆన్లైన్లో డేటా నమోదుచేసి మే 6 నుంచి నవశకం పోర్టల్లో అప్లోడ్ చేశారు. అదే నెల 14న సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించి మే 17 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. మే 22న అర్హుల జాబితాను తయారుచేసి, ఈ నెల 2న ప్రభుత్వానికి నివేదించారు. పరిహారం జాబితాపై మరోసారి సర్వే చేసి ఈ నెల 22 నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కారణం.. గత ప్రభుత్వ హయాంలో అర్హులకు అందకుండా చాలామంది వైకాపా నాయకులు ఈ జాబితాలో తమ పేర్లు చేర్చుకున్నారన్న కథనాలు వెలువడ్డాయి.
అధికారులు ప్రభుత్వానికి అందజేసిన అర్హుల జాబితాను అనుసరించి జిల్లాలో 15,375 మంది విదేశీ మత్స్యకారులను గుర్తించి వీరిలో 12,952 మంది అర్హులుగా గుర్తించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2,423 మందిని అనర్హులుగా చూపించారు. వైకాపా ప్రభుత్వం ఈ ఏడాది ఇచ్చిన మార్గదర్శకాల్లో డీజిల్ సబ్సిడీ వాడుకుంటున్న వారి విషయంలో కొన్ని నిబంధనలు కఠినతరం చేసింది. మెకనైజ్డ్ బోట్లకు రూ.9 సబ్సిడీతో ఏడాదికి 300 లీటర్లు డీజల్ను సరఫరా చేస్తుంది. 300 లీటర్లలో కనీసం 100 లీటర్లు ప్రభుత్వ సబ్సిడీ డీజల్ను వినియోగించని వారిని ఈ ఏడాది అనర్హుల జాబితాలో చేర్చింది. గత ఏడాది దీనికి మినహాయింపు ఇచ్చింది. దీంతో 1890 మంది అనర్హుల జాబితాలో చేరిపోయారు.
ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ డీజల్ను ప్రభుత్వం గుర్తించిన బంకు నుంచే తీసుకోవాలి. సబ్సిడీ నిధులు ప్రభుత్వం నుంచి సకాలంలో జమ కావడం లేదని బంకు నిర్వాహకులు డీజల్ సరఫరాకు నిరాకరించడం వల్లనే సబ్సిడీ డీజిల్ను వినియోగించుకోలేకపోయామని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే కొందరు మత్స్యకారులు చేపలవేట గిట్టుబాటు కాక మెకనైజ్డ్ బోట్లను లీజుకిచ్చి తెప్పలపై వేట సాగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల కోసం అప్పుడప్పుడు మెకనైజ్డ్ బోట్లను వినియోగిస్తున్నట్టు చూపించి సబ్సిడీ డీజల్ను తీసుకుంటున్నారని చెబుతున్నారు. వీటితో పాటు 18 నుంచి 59 ఏళ్ల వయసు వారు మాత్రమే మత్స్యకార భరోసాకు అర్హులు. ప్రతి కుటుంబంలో ఒకరికి పరిహారం అందిస్తున్నారు. రేషన్ కార్డు మంజూరు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన 13 మార్గదర్శకాల మాదిరిగా మత్స్యకార భరోసాకు నిబంధనలు వర్తింపజేశారు. దీనికి కారణం.. ప్రస్తుత జాబితాలో 533 మంది అనర్హులు ఉన్నారు. జిల్లా అధికారులు అర్హుల జాబితాతో పాటు అనర్హులుగా గుర్తించబడినవారి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అనర్హుల జాబితాలో సుమారు 2వేల మంది చేరడంపై మత్స్యకార సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. చేపలవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు నిబంధనల పేరుతో అనర్హుల జాబితాలో చేర్చడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు నిషేధం ఎత్తివేసి నెల రోజులు పూర్తి కావచ్చినా పరిహారం జమ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పేరుతో కాలయాపన చేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారం విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments