తెలంగాణలో హైడ్రా బాంబ్ కలకలం
- DV RAMANA
- Aug 24, 2024
- 2 min read

ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఇక రాజకీయాల్లో అయితే చెప్పనవసరం లేదు. మరో వైపు బడాబాబులు, రాజకీయాల ముసుగులో ఉన్న రియల్టర్లు, అక్రమ నిర్మాణాదారుల గుండెల్లో హైడ్రా బాంబ్ పేలుతోంది. అది ఏ క్షణంలోనైనా తమపై పడవచ్చని ఆ వర్గాలన్నీ వణికిపోతున్నాయి. ఇక బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్కు చెందినదిగా చెబుతున్న జన్వాడ ఫాంహౌస్ విషయంలో హైడ్రా వివాదం రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లింది. అయినా హైడ్రాను అడ్డుకునేందుకు కోర్టు నిరాకరించింది. ఇంతగా ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రా అంటే ఏమిటి? ఇప్పుడిదే చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ఆక్రమణలను గుర్తించి కూల్చివేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థే హైడ్రా. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిట రింగ్ ప్రొటెక్షన్. మున్సిపల్ పరిపాలన శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెం.99 ద్వారా ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే హైడ్రా కమిటీలో మున్సిపల్, రెవెన్యూ మంత్రులతోపాటు హైదరా బాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, హైదరాబాద్ మేయర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. మెంబర్ కన్వీనర్గా ఐఏఎస్ అధికారి ఏవీ రంగనాథ్ను నియమించారు. హైదరాబాద్ నగర విస్తరణకు వీలు గా భూములను గుర్తించడం, ఆక్రమణలు ఉంటే తొలగించడం వంటి చర్యలు చేపట్టడం హైడ్రా ప్రధాన లక్ష్యం. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది చెరువులు, కాలువలు, విలువైన భూములు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురయ్యాయి. పక్కా నిర్మాణాలతో రూపురేఖలే కోల్పోయాయి. అలాగే జనజీవనానికి అడ్డంకిగా ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగులు వంటి వాటిని కూడా తొలగించి ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు అవాంతరాలు లేకుండా పనిచేసేలా చేయడం హైడ్రా ప్రధాన విధులు. ఈ విధుల నిర్వహణకు వీలుగా కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారాలు కట్టబెట్టింది. ఇప్పుడదే చాలామందికి కంట గింపుగా మారింది. నగరం చుట్టుపక్కల రెండువేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా తన అధికారాల కొరడా రaుళి పిస్తోంది. ఆక్రమణలను గుర్తించి బల్డోజర్లు, పొక్లెయిన్లతో కూల్చివేస్తోంది. చెరువులు, కుంటలు, కాలువలు, ఇతర విలువైన స్థలాలు ఆక్రమణల చెర నుంచి బయటపడుతున్నాయి. ఆక్రమణల్లో చాలావరకు రాజకీయ అండదండలతోనే జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. దాంతో హైడ్రా కూల్చివేత కార్యకలాపాలకు సహజం గానే రాజకీయాలు అడ్డుతగులుతున్నాయి. అయితే జన్వాడ ఫాంహౌస్ వివాదం రూపంలో హైకోర్టు కూడా హైడ్రాకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయడంతో అక్రమణదారులు, వారి వెనుకనున్న రాజకీయ నేతల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. నగరంలోని కీలక ప్రాంతంలో ఒక చెరువు స్థలాన్ని దాదాపు సగం ఆక్ర మించి సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్పై కూడా హైడ్రా దృష్టి పడిరదంటున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అక్రమ నిర్మాణం కూల్చివేతకు అధికార యంత్రాంగం సిద్ధమైనా.. చివరి క్షణంలో అవి నిలిచిపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయన్న ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు హైడ్రా దృష్టి సారించి కూల్చివేతలు మొదలెట్టింది. ఇలాంటివే వందలాది అక్రమ నిర్మాణాలను హైడ్రా యంత్రాంగం కూల్చుకుంటూ పోతోంది. ఆక్రమణలను తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడం, చివరికి రాజ కీయ ఒత్తిళ్లతో మమ అనిపించి చేతులెత్తేయడం కొత్త కాదు. కానీ హైడ్రా రూపంలో కఠిన చర్యలు తీసుకోవడా నికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పూనుకున్నారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చిన్న వయసులోనే.. అదీ అనుకోని రీతిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్రెడ్డి తన హయాంలో ప్రజలకు చిరకాలం గుర్తుం డిపోయే పనులు కొన్నయినా చేయాలని భావిస్తున్నారు. వాటిలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఒకటి కాగా.. ఇప్పటికే బహుళ రూపాల్లో విస్తరించి రద్దీగా మారిపోయిన హైదరాబాద్ మహానగరంపై ఒత్తిడి తగ్గించేందుకు నగరానికి ఆనుకుని మరో సిటీని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈ రెండూ జరగాలంటే విస్తృతంగా భూములు, ఆదాయ వనరులు అవసరం. నగరం, దాని చట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొల గించి ఆ భూములను స్వాధీనం చేసుకుంటే కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి భూవసతి సమకూరుతుంది. వాటిలో కొన్ని భూములను డెవలప్మెంట్కు ఇచ్చినా వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. అలాగే ఆక్రమణ లు తొలగిస్తే వాటి కారణంగానే రూపం కోల్పోయి మురుగు కూపంలా మారిన మూసినదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ పనులు చేపట్టేందుకు వీలవుతుంది. అలాగే మూసి ప్రాజెక్టుకు, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, అసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం సంప్రదిం పులు జరుపుతోంది. అయితే రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు గ్యారెంటీలు కోరడం సహజం. అక్రమ నిర్మా ణాలను కూలగొట్టి వేలకోట్ల విలువైన ఆ భూములను హామీగా చూపించి రుణాలు తీసుకోవాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. ఒక్క మూసి నదికి ఇరువైపులే సుమారు 56 చెరువులు అక్రమణలకు గుర య్యాయి. వేలాది నిర్మాణాలు అక్రమంగా వెలిశాయి. వాటిని క్లియర్ చేస్తే చాలు సుమారు 120 కోట్ల చదరపు అడుగుల భూమి అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఇప్పుడున్న మున్సిపల్, రెవెన్యూ వ్యవస్థల వల్ల కాదు. అందుకే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి, దానికి అధికారాల కోరలు అమర్చారు. సిన్సియర్ అధికారి అయిన రంగనాథ్ చేతికి కొరడా అందించారని చర్చ జరుగుతోంది.
Comentários