దుగ్గివలస దాహార్తి తీరే దారేది?
- BAGADI NARAYANARAO
- May 1
- 2 min read

అడుగంటిన దశాబ్దాలనాటి నేలబావులు
మూలన పడిన ఆర్డబ్ల్యూఎస్ నీటిపథకం
అవసరాలు తీర్చలేకపోతున్న సుజలధార
నీటివనరులు చూడకుండానే జల్జీవన్ పనులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో నీటి ఎద్దడి ఉన్నట్లు ఫిర్యాదులు అందితే దానికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని నెల రోజుల క్రితం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కానీ ఆ హెచ్చరికలను మించి జి.సిగడాం మండలం టంకాల దుగ్గివలస(టీడీవలస) గ్రామంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. కానీ అవి అధికారులు చెవికి చేరడంలేదు. దుగ్గివలస దప్పిక తీర్చేందుకు వారు చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా గ్రామంలో ప్రతిరోజూ నీటియుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ ఏడో తేదీన గ్రామానికి చెందిన యువకులు గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అయినా నేటికీ తాగునీటి అవస్థలు తప్పడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టీడీవలస గ్రామంలో 470 కుటుంబాలు.. సుమారు 1200 జనాభా ఉంది. వీరంతా కొన్ని దశాబ్దాలుగా నేలబావులను ఆశ్రయించి దాహం తీర్చుకుంటున్నారు. గ్రామం చుట్టూ నీటివనరులు పుష్కలంగా ఉన్నా ప్రజల అవసరాలకు మాత్రం అక్కరకు రావడంలేదు. నేలబావులు తప్ప బోరుబావులు లేకపోవడం ఈ గ్రామం పట్ల పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి, నిదర్శనం. గ్రామంలో ఉన్న మూడు నేలబావులు అడుగంటిపోయాయి. వాటిలో లభ్యమవుతున్న నీరు తాగునీటికి పనికిరావడంలేదు. నేలబావుల్లో మోటార్లు పెట్టి మంచినీటి అవసరాలు తీర్చేందుకు చేసిన ప్రయత్నాలు కొద్దిరోజులకు మించి ఫలించలేదు. గ్రామ దళితవాడలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 1980లో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో రెండు మినీ రక్షిత నీటి ట్యాంకులు ఏర్పాటుచేశారు. దశాబ్దానికిపైగా గ్రామ దాహార్తి తీర్చి ఆ ట్యాంకులు నిర్వహణ సరిలేక శిథిలావస్థకు చేరాయి. అనంతరం 2007లో సుజలధార పథకంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్ను నిర్మించి పైపులైన్ల ద్వారా నీరందించడం ప్రారంభించారు. కాలక్రమంలో పైప్లైన్లు లీక్ కావడం, కొన్నిచోట్ల ధ్వంసం కావడంతో రెండు రోజులకోసారి రాత్రి వేళల్లో నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఇంటికి ఒక్క బిందె మాత్రమే లభించే పరిస్థితి. దాంతో గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ప్రైవేట్ బిల్డింగ్ వద్ద ఉన్న నేలబావి నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. వేసవిలో గ్రామస్తుల తాగునీటి తిప్పలు చెప్పనలవికావు.
పూర్తికాని జల్జీవన్ పనులు
మరోవైపు నీటి వనరులు గుర్తించకుండానే అధికారులు జల్జీవన్ పథóకం చేపట్టారు. ఇంటింటికీ కుళాయిలు బిగించి వదిలేశారు. దీన్ని పూర్తి చేయడానికి సుమారు రూ.18 లక్షలు అవసరమని అంచనా వేసినా నిధులు కేటాయించలేదు. కలెక్టర్కు గ్రీవెన్స్లో గ్రామస్తులు ఫిర్యాదు చేసినా తర్వాత జల్జీవన్ మిషన్ పనులు పూర్తిచేసి నీరందిస్తామని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు ఇచ్చిన హమీ ఆచరణకు నోచుకోలేదు. పథకానికి అవసరమైన బోరుబావి తవ్వడానికి రిగ్ వస్తుందని అధికారులు చెప్పడమే తప్ప దాని జాడలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేసవి నీటి ఎద్దడి నివారణకు నిధుల సమస్య లేదని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదు. జల్జీవన్ మిషన్ ద్వారా పనులు చేపట్టిన గ్రామాల్లో తాగునీటి పనులకు ఆర్ధిక సంఘం నిధులు వినియోగించడానికి వీల్లేదని అధికారులు అంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రతిసారీ మండల అధికారులు గ్రామంలో పర్యటించి అంతా సవ్యంగా ఉందని, నీటి సమస్య లేదని రిపోర్టు ఇచ్చి తప్పించుకుంటున్నారని, దీనివల్ల సమస్య పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments