దేశంలో 35 కోట్ల ఆకలికేకలు!
- DV RAMANA

- Jul 14
- 2 min read

ప్రపంచంలో శరవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని నివేదికలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకు తగినట్లే మన దేశం ఇప్పటికే జర్మనీని వెనక్కి నెట్టి ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. గణాంకాలు, కాగితాల్లో విశ్లేషణలు ఎంతో ఘనంగా కనిపిస్తుంటే.. దీనికి మరో కోణాన్ని మరికొన్ని విశ్లేషణలు ఆవిష్కరిస్తున్నాయి. దేశ జనాభాలో సమారు మూడోవంతు ప్రజలు ఆకలితో అలమటిస్టున్నారని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడిరచింది. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లు పైగానే ఉంది. ఇందులో 35 కోట్ల మంది అర్ధాకలి జీవితాలు వెళ్లదీస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ ఆకాశమంత ఎత్తు ఎదుగుతున్నా.. పేదలు పేదల్లానే ఉంటు న్నారంటే.. మన పాలకులు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, వాటి ఫలితాలు పేదల వరకు చేరకపో వడమో లేదా విఫలం కావడమో జరుగుతోందన్నది నిష్టుర సత్యంగా గుర్తించకతప్పదు. అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో ప్రభుత్వాలు వెనుకబడ్డాయని ఈ నివేదికలు చెప్పకనే చెబుతున్నాయి. పేదరిక నిర్మూలనకు దశాబ్దాలుగా భారత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడు తోంది. పథకాలు అమలుచేస్తోంది. ఈ విషయంలో మంచి పురోగతి సాధిస్తుండటం వల్ల పెద్ద సంఖ్యలో పేదలు దారిద్య్ర రేఖను దాటి ఎగువకు వస్తున్నప్పటికీ.. అంతకుమించి పెరుగుతున్న జనాభా వృద్ధిరేటను డామినేట్ చేస్తోంది. ఫలితంగా ఇప్పటికీ పేదరికం తాండవిస్తోంది. దేశ జనాభా లో ప్రతి నలుగురిలో ఒకరు కనీస జీవన ప్రమాణాల కంటే దిగువనే గడుపుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. అంటే 35 కోట్ల ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవటంలో ఇబ్బంది పడు తున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. అలా అని వారందరూ కటిక పేదరికంలో మగ్గుతున్నట్లు చెప్పలేం.. కానీ ఇల్లు, వైద్యం, విద్య, బలవర్థకమైన ఆహారం వంటి కనీస అవసరాలను సమకూర్చు కోవడంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది వాస్తవమని ప్రపంచ బ్యాంక్ నివేదిక తేల్చింది. 2011 నుంచి ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలు మనదేశంలో పేదరికాన్ని తగ్గించ టానికి కొంత వరకు దోహదపడ్డాయి. అయినా ఇప్పటికీ కోట్లాది మంది పేదరికాన్ని అనుభవిస్తు న్నారు. ప్రపంచ స్థాయిలో రోజువారీ కనీస ఆదాయం మూడు డాలర్లు అంటే భారత కరెన్సీలో రోజుకు రూ.250గా పరిగణిస్తున్నారు. కానీ ఆమాత్రం సంపాదన కూడా లేనివారిని పేదలుగా పరిగణించాలని ప్రపంచ బ్యాంకు ప్రామాణికాలు నిర్దేశిస్తున్నాయి. కానీ ఈ రేటు ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి సరిపోదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. తాజా ప్రమాణాల ప్రకారం తక్కువ ఆదాయ వర్గాల సగటు రోజువారీ సగటు ఆదాయం 4.2 డాలర్లు అంటే రూ.350 ఉండాలని ఆ బ్యాంకు నిపుణులు పేర్కొంటున్నారు. భారత పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లలో కూడా 4.2 డాలర్ల రోజువారీ ఆదాయాన్నే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. కొత్త ప్రామాణికాల ప్రకారం రూ.350 రోజువారీ ఆదాయాన్ని పరి గణనలోకి తీసుకున్నా కూడా భారత్లో 35 కోట్ల మంది రోజు వారీ అవసరాలు తీర్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తేలింది. అయితే భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలైన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను పరిగణనలోకి తీసుకుంటోంది. ఎందుకంటే ఇందులో విద్య, శుభ్రత, విద్యుత్, హౌసింగ్ వంటి అనేక అంశాలను ప్రమాణికాలుగా తీసుకుంటారు. మరోవైపు దేశంలో సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాసం ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. ఇండియా గినీ సూచీ ప్రకారం దేశ జనాభాలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్న సంపన్నుల వద్దే జాతీయ సంపదలో 40 శాతం పేరుకుపోయినట్లు వెల్లడైంది. అదే సమయంలో అట్టడుగున ఉన్న 50 శాతం భారతీయుల చేతిలో కేవలం 6.4 శాతం సంపద మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. పట్టణాలు, నగరాల్లో అధిక అద్దెలు, స్థిర త్వం లేని ఉద్యోగాలు ప్రజలను పేదరికంలోనే నివసించేలా చేస్తున్నాయని వెల్లడైంది. ఇక గ్రామాల విషయానికి వస్తే చిన్న చిన్న కమతాలు, సీజనల్ పనులు ప్రజలకు స్థిరమైన ఆదాయం లేకుండా చేస్తున్నాయని తేలింది. ఈ కారణాల వల్ల సగటు భారతీయ కుటుంబం మెడికల్ ఎమర్జెన్సీ, ఉద్యోగం కోల్పోవటం, వేతనాల్లో ఆలస్యం వంటి సమస్యలు ఎదురైనప్పుడు తట్టుకుని నిలబడటంలో తడబడు తున్నాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.










Comments