top of page

ధరల దరువు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 13, 2024
  • 3 min read
  • గత ఏడాదితో పోలిస్తే డబుల్‌ అయిన కూరగాయల ధరలు

  • ధరల స్థిరీకరణపై దృష్టి పెట్టని ప్రభుత్వాలు

  • వర్షాభావంపై నెపం నెట్టేస్తున్న అధికారులు

  • సగటు వ్యయంలో 90 శాతం తినడానికే సరిపోతుంది

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు దాటి పరుగులు తీస్తున్నాయి. దీంతో సామాన్యుడి పరిస్థితి ఘోరంగా మారుతోంది. కేవలం ధరల పెరుగుదల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం రెండు నెలల క్రితం 3.5 శాతానికి చేరింది. గత ఐదు సంవత్సరాల కాలంలో రిటైల్‌ ధరలు ఇంత ఎక్కువ నమోదు కావడం ఇదే మొదటిసారి. కీలకమైన ఆహార వస్తువుల ధరలు పెరగడం వల్ల వినియోగంలో తగ్గుదల నమోదై దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడుతోంది. సగటు కుటుంబం తన నెలసరి వ్యయంలో సగం సగం ఆహారం, దాని అనుబంధ వస్తువుల కొనుగోలుకే ఖర్చు చేస్తుంది. వినాయకచవితి, దసరా, దీపావళి పండుగల వేళ సామాన్యుడికి కష్టకాలం వచ్చింది. రుతుపవనాల వల్ల దేశంలో ఒకచోట అధిక వర్షపాతం, మరోచోట అత్యల్ప వర్షపాతం నమోదు కావడం వల్ల కూరగాయల దిగుబడిపై దాని ప్రభావం పడిరది. కీలకమైన ఉల్లి, బంగాళాదుంపలు ఈ నెలలో గత ఏడాదితో పోలిస్తే 65.64 శాతం పెరిగాయి. అలాగే ఉల్లిపాయల దిగుబడి 20 శాతం, బంగాళా దుంపల దిగుబడి 6 శాతం పడిపోయింది. వీటికి కారణం వర్షాల్లో తేడాలే ఈ ఏడాది అక్టోబరులో కొత్త పంట చేతికి వచ్చేలోపు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ‘సత్యం’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడయింది.

బహిరంగ మార్కెట్‌లో ఒక్కో వ్యాపారస్తుడి వద్ద ఒక్కో ధర ఉండటం వల్ల రైతుబజార్లలో విక్రయిస్తున్న ధరలను ప్రామాణికంగా తీసుకొని ‘సత్యం’ జరిపిన పరిశోధన ప్రకారం గత ఏడాది సెప్టెంబర్‌ 13న టమోటా కిలో రూ.18 ఉండగా, ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.36 పలుకుతుంది. బహిరంగ మార్కెట్‌లో రూ.46 నుంచి రూ.50కి పైగా ధర పలుకుతుంది. జూన్‌, జూలైల్లో టమోటా ధర రూ.100కు చేరింది. సకాలంలో వర్షాలు పడడం, ఇతర జిల్లాలో పంట చేతికి రావడంతో క్రమంగా కిలో రూ.24కి తగ్గింది. ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో రైతు బజార్లో రూ.36కి బహిరంగ మార్కెట్‌లో రూ.50కి ఎగబాకింది. రైతుబజార్లో బంగాళదుంపలు కిలో రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.32 వద్ద స్థిరంగా ఉంది. జూన్‌, జూలైల్లో రూ.50కి చేరింది. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.55కు చేరాయి. గత ఏడాది ఈరోజుకు కిలో ఉల్లి ధర రూ.30గా రైతుబజారులో అందుబాటులో ఉండేది. వెల్లుల్లి కిలో ఏడాదిలో 100 శాతం ధర పెరిగింది. గత ఏడాది కిలో వెల్లుల్లి రూ.170 ఉండగా, ప్రస్తుతం రూ.310కి చేరింది. బహిరంగ మార్కెట్లో రూ.350కు పైగా పలుకుతుంది. బెండ, దొండ, వంకాయ, బీర, కాకర, పచ్చిమిర్చి, బీన్స్‌ ధరలు రెట్టింపయ్యాయి.

అధికారంలోకి వస్తే ధరలను స్థిరీకరిస్తామని ప్రకటించడం తప్ప ఆచరణకు నోచుకోవడంలేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రభుత్వ విధానాల వల్లే ధరలు పెరుగుతున్నాయని ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల స్థిరీకరణ అంశం గాలికొదిలేస్తున్నాయి. దీంతో కూరగాయలు, పప్పుదినుసుల ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారుతున్నాయి. జిల్లాలో కూరగాయలు సాగు తగ్గడం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ధరలు పెరుగుదలపై ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం పడిరదని అధికారులు చెబుతున్నా అందులో వాస్తవం లేదు. జూన్‌, జూలై నెలల్లో వర్షాభావం కావడం కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. శ్రావణ మాసం కావడంతో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు కొంతమేర పెరిగాయి. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వరితో పాటు ఇతర వాణిజ్య పంటలకు రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. మైదాన ప్రాంతాల్లో మాత్రమే కూరగాయలు సాగు చేస్తుంటారు. వీటిలో ఆరుతడి పంటల వైపే రైతులు మక్కువ చూపిస్తుంటారు. పొలాల్లో కూరగాయలు సాగుచేసి ఖరీఫ్‌ సీజన్‌ వచ్చిన తర్వాత వాటిని తొలగించి వరితో పాటు సంప్రదాయ పంటలు వేస్తుంటారు. దీంతో జిల్లాలో కూరగాయల దిగుబడి తగ్గి డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరగక ధరలు పెరగడం ఏటా సర్వ సాధారణం.

జిల్లాలో ప్రస్తుతం బెండ, వంకాయ, బీర పంటలు మాత్రమే రైతులు సాగు చేస్తున్నారు. అక్కడక్కడ పచ్చిమిర్చి, కాకర, గోల్కొండ చిక్కుడును పండిస్తున్నారు. మిగతా కూరగాయలు, దుంపజాతులు, ఉల్లి, టమాటాను దిగుమతి చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నగరం పరిధిలో గార, శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, లావేరు, పొందూరు, ఆమదాలవలసలో అక్కడక్కడ కూరగాయల సాగు జరుగుతుంది. ఈ పంటలను నగరంలోని రైతుబజార్‌కు తీసుకువచ్చి విక్రయించే రైతులు చాలా తక్కువ. పంట పొలం వద్దనే వ్యాపారులు టోకు ధరకు కొనుగోలుచేసి మార్కెట్‌కు తరలించుకుపోయి చిల్లర ధరలకు అమ్ముతుంటారు. అక్కడ వ్యాపారులు అమ్ముతున్న ధరను బట్టి రైతుబజార్‌లో ధరను నిర్ణయించి కేజీపై రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి విక్రయించేలా చర్యలు తీసుకుంటారు. ఉల్లిని కర్నూలు, మహారాష్ట్ర నుంచి, బంగాళాదుంపలను బెంగాల్‌ నుంచి, టమోటాను చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి జిల్లాకు దిగుమతి అవుతుంటాయి. వెల్లుల్లి, అల్లం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని హోల్‌సేల్‌ వ్యాపారులు నుంచి స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లోనూ, రైతులు రైతుబజార్‌లోను విక్రయిస్తుంటారు. దీంతో వీటి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. జిల్లాలో ఉన్న శ్రీకాకుళం, ఆమదాలవలస, కోటబొమ్మళి రైతుబజారుల్లో ధరల్లోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. స్థానికంగా రైతులు పండిరచిన పంటలు రైతులు తీసుకువస్తే స్థానిక మార్కెట్లో ధరలను బట్టి రైతుబజార్లో అధికారులు ధరలను నిర్ణయిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కూరగాయలు విషయంలో మాత్రం స్థానిక పెద్దమార్కెట్‌ను అనుసరించే విక్రయాలు జరుపుతున్నారు.

శ్రీకాకుళం రైతుబజార్‌కు ప్రతి రోజు రూ.1.5 టన్నుల కూరగాయలు, ఆదివారం 2 టన్నుల మేరకు కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. వీటిలో ఉల్లి, బంగాళదుంపలు, టమోటాలదే అగ్రభాగం. అక్టోబర్‌ నుంచి కూరగాయల దిగుబడి తగ్గి డిమాండ్‌ పెరగనుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండగల సీజన్‌ కావడం వల్ల కూరగాయలకు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో టమోటా, క్యాబేజీ స్థానిక రైతుల వద్ద అందుబాటులోకి వస్తుందని, వీటి ధర దిగివస్తుందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు, విపత్తులు సంభవించకుంటే కూరగాయలు ధరలు స్థిరంగా కొనసాగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురవడంతో కూరగాయ పంటలకు ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీనివల్లనే ధరలు పెరుగుదల నమోదవుతుందని చెబుతున్నారు. పెరిగిన కూరగాయలు, పప్పుదినుసుల ధరలు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page