నకిలీ పాస్ల కేసులో ఆరుగురిపై FIR
- Prasad Satyam
- Apr 17
- 1 min read
శుక్రవారం వన్టౌన్లో మొదలైన ప్రాథమిక విచారణ
ప్రింటింగ్కు వాడిన పరికరాలు సీజ్ చేసే అవకాశం
‘పాస్లకు పిల్లలు పుట్టాయి’ కేసులో కదలిక మొదలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా వీఐపీలు, వీవీఐపీలు, డోనార్లకు సంబంధించిన నకిలీ పాస్లు సష్టించి వేలకు వేలు మార్కెట్లోకి విడుదల చేసిన కేసులో ఆరుగురిపై శ్రీకాకుళం వన్టౌన్ పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే వీరిని స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. నకిలీ పాస్లు ఎన్ని ముద్రించారు? ఎంతకు అమ్మారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్ప్పుడే టూటౌన్ పోలీస్స్టేషన్ వెనుక కలర్ జిరాక్స్ నడుపుతున్నవారిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా అన్ని విషయాలూ రాబట్టి రికార్డు చేశారు. అలాగే నగరంలో అనేక ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలను కూడా పోలీసులు ప్రశ్నించారు. చివరకు ఇందులో సూత్రధారులు ఆరుగురని పోలీసులు తేల్చారు. వీరిపై ఎఫఐఆర్ నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. అసలు రథసప్తమి నాడు ఎంత కంట్రోల్ చేసినా జనాలు వీవీఐపీ గేటు నుంచి రావడాన్ని నిలువరించలేకపోయారు. నిజంగా వీరంతా భక్తజనమే అనుకున్నారు. కానీ రథసప్తమి మరుసటి రోజు ‘పాస్లకు పిల్లలు పుట్టాయి’ అనే శీర్షికతో ‘సత్యం’ కథనం ప్రచురించింది. దీంతో జిల్లా ఎస్పీ మహేశ్వర్రెడ్డి ఆ కోణంలో ఆరా తీయడంతో మణికంఠ జిరాక్స్ భాగోతం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి తీగ లాగుతూవచ్చిన పోలీసులు శుక్రవారం ఈ ఆరుగుర్ని వన్ టౌన్కు పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.






Comments