నగర టీడీపీలో సుడి‘గుండ’ం!
- NVS PRASAD
- Apr 30
- 3 min read

కొద్దిరోజులుగా యాక్టివేట్ అవుతున్న ఆ కుటుంబ క్యాడర్
మాజీమంత్రి కళాను పరామర్శించిన గుండ లక్ష్మీదే
మరోవైపు సంస్థాగత మార్పులకు గొండు సన్నాహాలు
తనను వ్యతిరేకించిన వారందరినీ తెగ్గొట్టేందుకు కసరత్తు
వెరసి.. నగర పార్టీలో ఏదో జరగబోతున్న సంకేతాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ సాక్షిగా జిల్లా కేంద్రంలో ఏదో జరగబోతోంది. పార్టీలో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇది బయటపడనుంది. ఇది టీకప్పులో తుపానా లేక పార్టీలో ఏర్పడిన అల్పపీడనమా? అనేది ప్రస్తుతానికి తెలియకపోయినా కొన్ని సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి చెందిన స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నాయి.
అదే సమయంలో తన భర్త శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి తెలుగుదేశం క్యాడర్తోనూ, గుండ కుటుంబ అభిమానులతోనూ, పార్టీలో ఎమ్మెల్యే గొండు శంకర్ను వ్యతిరేకించే వ్యక్తులతోనూ ఎక్కువగా కనిపిస్తున్నారు. తమను కాదని తొలినుంచి ఇక్కడ కింజరాపు కుటుంబం కొత్త వ్యక్తులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోందన్న కారణంతో గుండ కుటుంబం అచ్చెన్నాయుడును వ్యతిరేకించే కళా వెంకటరావుతో పయనిస్తోంది. క్రియాశీల రాజకీయాలపై గుండ అప్పలసూర్యనారాయణ మౌనం పాటించినప్పుడు.. చంద్రబాబు మీద అలిగి పొలంలో కూర్చున్నప్పుడు ఆయన్ను మళ్లీ పార్టీ బాట పట్టించినా.. చంద్రబాబునాయుడును అప్పలసూర్యనారాయణ ఇంటికి తీసుకువచ్చినా.. ఇవన్నీ కళా వెంకట్రావే చేశారు. జిల్లాలో రెండు గ్రూపులు ఉండటం భవిష్యత్తులో టీడీపీకి ప్రమాదమని భావించిన చంద్రబాబు చీపురుపల్లిలో అప్పటికే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున గెలుస్తారనే రిపోర్టులు ఉన్నప్పటికీ కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపించారు. అయినా తాము కళాతోనే ఉన్నామన్న సంకేతాలు పంపడంలో గుండ కుటుంబం ఒకడుగు ముందుకేసింది. ఇటీవల కళా వెంకట్రావుకు కాటరాక్ట్ ఆపరేషన్ జరిగితే గుండ లక్ష్మీదేవి రాజాం వెళ్లి ఆయన్ను పరామర్శించారు. శ్రీకాకుళంలో తమకు టిక్కెట్ ఇవ్వకపోయినా, ఇక్కడ అచ్చెన్నాయుడు వర్గం తమను వ్యతిరేకిస్తున్నా పార్టీలో తమకోసం ఒక మాట చెప్పడానికి కళా వెంకట్రావు ఉన్నారు సుమా అన్న సంకేతాన్ని లక్ష్మీదేవి పంపగలిగారు.
మళ్లీ క్రియాశీలం అవుతున్న గుండ
ఎర్రన్నాయుడు ఉన్నప్పుడు ఆయన వెంట నడిచి, ఆయన తర్వాత రామ్మోహన్నాయుడు రంగప్రవేశం చేస్తే ఆయనతో ఉన్న ఖాజీపేటకు చెందిన పార్టీ నాయకుడు నాగావళి కృష్ణ ఇప్పుడు గుండ కుటుంబం వెంట నడుస్తున్నారు. నాగావళి కృష్ణ, కింజరాపు కుటుంబాలు వేరు కాదన్న ప్రచారం జరిగిన ఈ నగరంలోనే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర మంత్రులను కాదని గుండ లక్ష్మీదేవికి ఆయన మద్దతు పలుకుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్కు నాగావళి కృష్ణ పని చేయలేదు సరికదా.. చివరి వరకు నడిచిన అసమ్మతి శిబిరానికి ఆర్థికంగా అండదండలు అందించారన్న భావన మంత్రి అచ్చెన్నాయుడులో ఉంది. ఎన్నికల అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రి అయ్యాక కొన్నాళ్లు ఆయనతో నడిచిన నాగావళి కృష్ణను, ఆ తర్వాత అచ్చెన్నాయుడు ఆదేశానుసారం పక్కన పెట్టారన్న ప్రచారం ఉంది. దీంతో ఇన్నాళ్లూ ఒకే ప్రాంతంలో ఉన్నా గుండ కుటుంబాన్ని వ్యతిరేకించిన నాగావళి కృష్ణ ఇప్పుడు ఆ గ్రూపులో కీలక నాయకుడిగా ఉన్నారు. దీనికి తోడు గొండు శంకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత తమ గోడు విన్నవించుకుందామంటే కనీసం కలిసే అవకాశం కూడా రావడంలేదని భావించే టీడీపీ డివిజన్ ఇన్ఛార్జిలు కొద్దిమంది ఉన్నారు. వారంతా ఇప్పుడు లక్ష్మీదేవి వెంట నడుస్తున్నారు. ఇటీవల మడ్డివీధికి చెందిన టీడీపీ కార్యకర్త అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రిలో ఉంటే లక్ష్మీదేవి పరామర్శకు వస్తున్నారని తెలుసుకున్న కొందరు టీడీపీ నాయకులు ఆమెను అక్కడ కలుసుకున్నారు.
సహకరించని వారికి చెక్
గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ వచ్చినప్పటికీ, దాన్ని అంగీకరించకుండా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంటి ముందు చొక్కాలిప్పుకొని వీరంగం చేసినవారందర్నీ పక్కన పెట్టాలన్న యోచనలోనే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కొందరు డివిజన్ ఇన్ఛార్జిలను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదు. ఆ తర్వాత డబ్బులిస్తే గానీ ప్రచారానికి వచ్చేది లేదంటూ మంచమెక్కి కూర్చున్నవారి జాబితా కూడా జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇక పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఇచ్చినవాటిని మడిచేసి పరోక్షంగా పక్కవారికి సహకరించిన వారి గురించి పోలింగ్ రోజే రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇటువంటి వారందర్నీ ఇప్పుడు డివిజన్ ఇన్ఛార్జి పదవుల నుంచి తప్పించబోతున్నారన్న సంకేతాలు బయటకు వెళ్లాయి. వచ్చే నెల 15 లోగా తమ పదవులు పోకముందే అరసవల్లి వెళ్లి మద్దతు తెలిపితే భవిష్యత్తులో అవకాశాలుంటాయన్న భావనతో చాలామంది ఉన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే సంస్థాగతంగా మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ గొండు శంకర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన గ్రూపు ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే తమ పదవులు తీసేయరనే హామీని తెచ్చుకొని ఎన్నికల్లో మద్దతిచ్చారు. ఈ ఒప్పందం మేరకే రాష్ట్ర పార్టీ డెడ్లైన్ ఇచ్చేవరకు సంస్థాగత ఎన్నికల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి 50 డివిజన్లలో పెద్ద ఎత్తున ఇన్ఛార్జిల మార్పు జరగబోతుందని అర్థమవుతుంది.
ఆచితూచి మార్పులు
కార్పొరేషన్కు 15 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో ఏ టీడీపీ ఇన్ఛార్జి పట్టు ఎంతనేది ఎవరికీ తెలియదు. పబ్లిక్ రెస్పాన్స్ను బట్టి చూస్తే పట్టుమని పది ఓట్లు లేనివాడు కూడా మొన్నటి ఎన్నికల్లో తాను డివిజన్ ఇన్ఛార్జినన్న పొగరుతో విర్రవీగారు. ఇప్పుడు వీరికే డివిజన్ ఇన్ఛార్జీలుగా మళ్లీ అవకాశం కల్పిస్తే ఇన్నాళ్లు ఉన్నాం కాబట్టి కార్పొరేటర్ సీటివ్వాలని అడిగే ప్రమాదం ఉంది. కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదుగానీ.. జరిగితే మాత్రం దీన్ని కైవసం చేసుకోవడం సిట్టింగ్ ఎమ్మెల్యేకు జీవన్మరణ సమస్య అవుతుంది. నియోజకవర్గానికి సంబంధించి పదవులు ఇవ్వాలన్నా, బదిలీలు చేయాలన్నా కేంద్ర, రాష్ట్ర మంత్రుల దృష్టిలో పెట్టకుండా అడుగు ముందుకేయని శంకర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే మాత్రం బలిపీఠం ఎక్కక తప్పదు. అందుకే తన సొంత టీమ్ను తయారు చేసుకోవడానికి ఎమ్మెల్యే సిద్ధపడుతున్నారు. అలా అని ఇప్పటి వరకు ఏ డివిజన్లో ఎవర్ని నియమించాలన్న జాబితాను మాత్రం ఆయన రూపొందించుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు డివిజన్ల ఇన్ఛార్జిలు ఈయనతోనే ఉన్నారు. ఇప్పుడు వారు వద్దనుకుంటే తప్ప వారి పదవులు పదిలం కాగా, మిగిలిన చోట్ల మార్పు తథ్యం కానుంది. 2013 నుంచి మాదారపు వెంకటేష్ నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున ఆయన్ను మార్చాలని బలమైన వాదన ఉంది. అయితే మార్పులు చేర్పుల మీద ముందుగానే పార్టీ క్యాడర్తో సమావేశం కావాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులుగా పార్టీ సీనియర్లతో భేటీ అవుతున్నారు. వెంకటేష్ను టౌన్ పార్టీ నుంచి తప్పిస్తే ఎక్కడ అకామిడేట్ చేస్తారు? టౌన్ పార్టీ అధ్యక్షుడిగా ఎవర్ని నియమిస్తారు? పార్టీ అధిష్టానానికి ప్రతిపాదించే ఐదుగురి జాబితాలో ఎవరెవరున్నారన్న అంశాలను మరో కథనంలో చర్చిద్దాం.
Comments