నిజవియ్యంకులు నటించిన బాపుమార్క్ సినిమా!!
- Guest Writer
- May 1
- 2 min read

చిరంజీవి తండ్రి వెంకటరావు గారు కూడా నటించిన ఒకే ఒక్క సినిమా ఈ మంత్రి గారి వియ్యంకుడు . అదీ మంత్రి గారి పాత్రలోనే. అయితే తండ్రీకొడుకులకు కలిసి సీనేదీ లేదు. అల్లు రామలింగయ్యకు వెంకటరావు గారికి మాత్రమే ఉంటుంది ఆ సీన్. విశేషం ఏమిటంటే నిజ జీవితంలో వీరిద్దరూ వియ్యంకులు కావడం.
చిరంజీవి జైత్రయాత్రలో మరో మైలురాయి 1983 నవంబరులో వచ్చిన ఈ క్లాసిక్ మసాలా సినిమా. బాపుతో చిరంజీవికి ఇది రెండో సినిమా. ఆయన నటించిన 63వ సినిమా. మళయాళంలో సక్సెస్ అయిన ఓ సినిమా రైట్స్ నలభై వేల రూపాయలకు కొని 22 లక్షల బడ్జెటుతో నలభై రోజుల్లో తీసారు. తరచూ ఏదో ఒక చానల్లో వస్తూనే ఉండే ఈ బాపు-రమణల మార్క్ క్లాస్ మసాలా ఫస్ట్ రిలీజులో ఖైదీ సినిమా బాధిత. ఖైదీ విడుదలయిన వారం రోజులకే రావడం వలన వంద రోజులు ఆడలేకపోయింది. ఆరు కేంద్రాలలో యాభై రోజులు ఆడిరది. డబ్బులు బాగా వచ్చాయట.
ఒక సినిమా విజయానికి డబ్బులు కొలబద్ద అయినా ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానం పొందింది అనేదీ ముఖ్యమే. ఈరోజుకీ ప్రేక్షకులను అలరించే సినిమా ఇది. హీరోయిన్ మైనస్ పాయింటేమో అని అనిపిస్తుంది. తమిళ మళయాళాల్లో పెద్ద హీరోయిన్ పూర్ణిమ భాగ్యరాజ్. ఆమె నిర్మాత చాయిస్ అంటారు. తెలుగులో హీరోయినుగా ఆమె ఈ ఒక్క సినిమాలోనే నటించింది. ఈమధ్య 2019లో తల్లి పాత్రలో నిను వీడని నీడను నేనే సినిమాలో నటించింది. అఫ్కోర్స్ హీరోయిన్ ఎవరయినా ఖైదీ దెబ్బకు నిలబడటం కొంచెం కష్టమే అనుకోండి.
చిరంజీవి ఉన్నాడు కాబట్టి ఆయన్నే హీరో అనక తప్పదు. వాస్తవానికి ఈ సినిమాలో హీరో అల్లు రామలింగయ్యే. అల్లు తల్లి లేని పిల్లలతో రావి కొండలరావు - నిర్మలమ్మల దగ్గర పనిచేస్తూ ఉంటాడు. కాలక్రమంలో అదృష్టం కలిసొచ్చి డబ్బు చేస్తుంది. డబ్బుతో పాటు అహం, పటాటోపం, వగైరాలు వస్తాయి. ఇంట్లో ఓ సర్కిల్, ఓ లాయరూ అల్లుళ్ళుగా ఉంటారు. పెళ్ళి కాని డాక్టర్ కొడుకు శుభలేఖ సుధాకర్ నర్సమ్మ తులసిని ప్రేమిస్తాడు.
కూతురు పూర్ణిమను కాలేజీలో కొబ్బరి పదార్ధాలతో టీజ్ చేసే హీరో చిరంజీవితో ఫైటింగులు చేసీ చేసీ అలిసి లవ్వులో పడిపోతుంది. అల్లు కూతురు కొడుకు రావి కొండలరావు-నిర్మలమ్మల కొడుకు కూతుళ్ళను ప్రేమిస్తారు. సంబంధం మాట్లాడుకుంటానికి రమ్మని అవమానిస్తాడు అల్లు. అన్నపూర్ణమ్మ పాత్రలో నిర్మలమ్మకు, కుటుంబ సభ్యులకు తిక్క రేగుతుంది. ఇంతలో ఎన్నికలు వస్తాయి. నిర్మలమ్మ ఎమ్మెల్యేగా గెలిచి క్లైమాక్సులో ధనామని మంత్రి అయిపోతుంది. అల్లు మంత్రి గారి వియ్యంకుడు అయిపోయి తన జీవితకాల కోరికను తీర్చుకుంటాడు.
చిరంజీవి కాలేజీకుర్రోడిగా చాలా హుషారుగా, చలాకీగా, అల్లరిగా, రొమాంటిగ్గా బాగా నటించాడు. ఈ సినిమాలో ప్రధానంగా మెచ్చుకోవలసింది అల్లు రామలింగయ్య, నిర్మలమ్మలనే. పోటాపోటీగా నటించారు. సత్యనారాయణ రాజకీయ విలనాసురుడిగా బాగా నటించాడు. స్క్రీన్ప్లేని బిర్రుగా తయారు చేసుకున్న ముళ్ళపూడి ప్రతీ పాత్రకు ప్రాధాన్యతను కల్పించారు. రాళ్ళపల్లి, నూతన్ ప్రసాద్, రావి కొండలరావు, తులసి, శ్రీలక్ష్మి ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సినిమాలో క్లైమాక్స్ సీన్ చాలా ఆర్ద్రంగా, ఇంటెన్సివుగా ఉంటుంది. అల్లు రామలింగయ్య, నిర్మలమ్మలు తినేసారు.
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి. టీజింగ్ పాటలు, డ్యూయెట్లు కుర్రకారుకు బాగా నచ్చాయి. ఛీఛీ పో పాపా ఒప్పుల కుప్పా, ఏమని నీ చెలి పాడెదనూ, సలసలా నను కవ్వించనేల, కోకోనట్ మనకు దోస్తీ, మనసా శిరసా నీ నామమే పాడెద ఈ వేళ పాటలు బాగుంటాయి. అమ్మ కాదె బుజ్జి కాదె నాపై కోపమా దానికదే దీనికదే అంటే నేరమా అంటూ చిరంజీవిని పూర్ణిమ టీజ్ చేసే పాట చాలా బాగుంటుంది. చిరంజీవి బుంగమూతితో అందంగా కనిపిస్తాడు. ఎలక్షన్ల సమయంలో కొలువైనాడే ఊరికి కొలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడు పాట కాలేజి కుర్రాళ్ళతో హుషారుగా ఉంటుంది.
- దోగిపర్తి సుబ్రమణ్యం
Comments