నేతలు వారే.. పదవులూ వారివే!
- NVS PRASAD
- Aug 17, 2024
- 5 min read
విధాన నిర్ణయాల అమలులో అచితూచి
పార్టీ మార్పిడుల్లో మాత్రం దూకుడు వ్యవహారాలు
జెండా మార్చి పదవులను కాపాడుకుంటున్న వైకాపా నేతలు
టీడీపీ క్యాడర్కు ఏమాత్రం చేకూరని ప్రయోజనం
ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయ ప్రత్యర్థులపై దాడులు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నా.. ప్రతిపక్ష నేతలను టీడీపీ గొడుగు కిందకు తీసుకురావడంలో మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ప్రశ్నించకుండా గతంలో తాను ఏ తప్పులు చేసిందో ఇప్పుడు అవే తప్పులు టీడీపీ చేస్తుంటే మాత్రం నీతులు చెబుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ పూర్తిగా తొందరపాటు ధోరణితో వ్యవహరిస్తున్నాయని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ప్రత్యర్థులపై దాడులు, పార్టీ మార్పిడులు, విధాన నిర్ణయాల అమలు వంటి అనేక అంశాల్లో నాటి వైకాపా తీరునే ఇప్పుడు టీడీపీ అనుసరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి దుశ్చర్యలను సహించకే ప్రజలు వైకాపాను ఇంటికి పంపించారు. ఇప్పుడు అవే చర్యలకు పాల్పడితే తమకూ అదే గుణపాఠం తప్పదన్న విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించి తమ కార్యాచరణను మార్చుకుంటే మంచిది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గతంలో 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపడం వెనుక అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కీలకపాత్ర పోషించారంటూ గత ఐదేళ్లూ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇంటికే పరిమితం చేసిన వైకాపా అదే బాటలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లను మూలన కూర్చోబెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా వైకాపాతో అంటకాగారన్న ఆరోపణతో కొందరు ఐపీఎస్లను వీఆర్లో పెట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇంకా బదిలీల ప్రక్రియ పూర్తికాక ముందే టీడీపీ కక్ష సాధిస్తుందని వైకాపా పేర్కొనడం చూస్తే పాత గాయాన్ని మళ్లీ రేపడంలాగే కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ కూడా గతంలో వైకాపా చేసిన తప్పులే చేసుకుపోతోంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకోవడం వల్ల పదవులు సులభంగా లభించాయి. స్థానిక ఎమ్మెల్యేలు నచ్చినవారికి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మారిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలసలు అవసరమా? అంటే.. అనవసరమనే చెప్పాలి. ప్రస్తుతం మూడు పార్టీల కలగూర గంపగా ఉన్న కూటమిలో ఉన్నవారికి న్యాయం చేయడానికే నామినేటెడ్ పదవులు చాలడంలేదు. అయినా పక్క పార్టీల నుంచి తెచ్చి మరీ నెత్తిన మోస్తున్నారు. పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు గతంలో అధికారం అనుభవించారు. ప్రభుత్వం మారిన తర్వాత జెండా మార్చడం వల్ల కూడా ఇప్పుడూ అనుభవిస్తున్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు వలసలను ప్రోత్సహించడం వల్ల తాత్కాలిక లబ్ధి కలుగుతుందేమో గానీ భవిష్యత్తులో ఇది పార్టీకి పెద్ద నష్టం చేకూరుస్తుంది. గతంలో వైకాపాకూ ఇదే జరిగింది.
జెండా మార్చినా.. పదవుల్లో వారే
జీవీఎంసీ(మహావిశాఖ నగరపాలక సంస్థ)లో 17 మంది వైకాపా కార్పొరేటర్లు ఆ మధ్య టీడీపీ, జనసేనల్లో చేరారు. ఒంగోలులో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 డివిజన్లలో 41 స్థానాల్లో వైకాపా గెలుపొందింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ బాలినేని శ్రీనివాసరావు ఓడిపోవడంతో మెజారిటీ కార్పొరేటర్లు తెలుగుదేశానికి జైకొట్టారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి సైతం ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ తెలుగుదేశం బలం 23కు పుంజుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ తెలుగుదేశంలోకి వెళ్లి తమ పదవులను కాపాడుకోగలిగారు. కానీ మొదటినుంచీ ఉన్న టీడీపీ నేతలకు ఈ పదవులు దక్కలేదు. పల్నాడు జిల్లా మాచర్చలో 14 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చైర్మన్ చిన్న యేసోబు, వైస్చైర్మన్ నర్సింహారావులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సమక్షంలో పార్టీ మారారు. 2022లో ఇక్కడ ఎన్నికలు జరిగితే 31 వార్డుల్లో ప్రత్యర్థులు లేకుండా అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెదిరించి మరీ ఎన్నికలు జరిపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో శనివారం నాటికి 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. అంటే గతంలో వైకాపాలో పని చేసినవారే ఇప్పుడూ ఆ పదవుల్లో ఉన్నారని అర్థమవుతుంది. ఇక చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇక్కడ కూడా ఇంద్రజ పార్టీ మారడం ద్వారా తన పదవిని కాపాడుకున్నారు. తాజాగా రాజంపేట ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన సిట్టింగ్ కడప జిల్లాపరిషత్ చైర్మన్. దీంతో ఈ పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ స్థానం భర్తీ కానుండటంతో కడప జెడ్పీటీసీలకు జగన్మోహన్రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. జెడ్పీటీసీలందరితోనూ ఈ నెల 21న విజయవాడలో సమావేశం కావాలని జగన్మోహన్రెడ్డి కోరారు. ఇక్కడ వైకాపా జెడ్పీ పీఠాన్ని నిలుపుకోడానికి బలంగా ప్రయత్నిస్తుంది. విజయం కూడా సాధిస్తుంది. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే.. టీడీపీకి బలమున్నచోట వైకాపా నాయకులే పసుపు కండువాతో అధికారంలో ఉండగా, వైకాపాకు పట్టున్న చోట కూడా వైకాపా నాయకులే ఉన్నారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రస్తుత పాలకవర్గాలను తొలగించాలంటే నాలుగేళ్ల కాలపరిమితి దాటాలన్న నిబంధన ఉంది. దీన్ని సవరిస్తే గానీ టీడీపీ స్థానిక సంస్థల పగ్గాలు చేపట్టలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తే రెండేళ్లలో జరిగే ఎన్నికల వరకు వేచిచూసే విధంగానే కనిపిస్తోంది.
కబుర్లతో కాలయాపనలో తీసిపోని తీరు
ఇక జగన్మోహన్రెడ్డి వ్యవహార శైలిలో కూడా మార్పు కనిపించడంలేదు. పోలవరం డయాఫ్రం వాల్ పాపం టీడీపీదేనని గత ఐదేళ్లూ చెప్పుకొచ్చారు. ఇప్పుడూ అదే మాట చెబుతున్నారు. డయాఫ్రం వాల్ తప్పును సవరించడానికి జగన్మోహన్రెడ్డికి ఐదేళ్ల కాలం సరిపోకపోవడం ఒక విడ్డూరమైతే, ఇప్పుడు మళ్లీ దీనిపై మాట్లాడటం మరో విడ్డూరం. తల్లికి వందనం పథకాన్ని ఆగస్టు 15 నాటికి అందిస్తామని స్వయంగా మంత్రి లోకేష్ చెప్పినా, అదే రోజుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు కానీ అమ్మకు వందనం మాత్రం రాలేదు. దానికి ముందే అసెంబ్లీలో లోకేష్ తన పాత ప్రకటనను సవరించుకుని దాన్ని వచ్చే ఏడాది ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ పథకం మీద అనేకమందికి అనుమానాలు ఉన్నాయి. వైకాపా హయాంలో అమ్మఒడి పేరుతో కుటుంబంలో ఒక విద్యార్థికి రూ.15వేలు అందించారు. కాగా కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉంటే అంతమందికీ రూ.18వేలు చొప్పున ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ప్రజలందరూ తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ దీనిపై ఎక్కడా ప్రతిపక్షం స్పందించకపోవడం శోచనీయం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పటికీ వైకాపాను ముంచేసిన, ప్రభుత్వ నిధులు తినేసిన అధికారులను మార్చడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
అప్పుడు వారిపై.. ఇప్పుడు వీరిపై దాడులు
వైకాపా రీజనల్ ఇన్ఛార్జీలను ఇప్పటికీ మార్చలేకపోతోంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న రెడ్లను ఎంత తొందరగా తప్పిస్తే, పార్టీకి అంత మంచిది. ఈ మూడు ప్రాంతాల్లోనూ రెడ్ల పెత్తనాన్ని ఎప్పుడూ సహించరు. గత ప్రభుత్వం ఎమ్మెల్యేలను నమ్మకుండా రీజనల్ కోఆర్డినేటర్ అనే పదవిని తీసుకువచ్చింది. రెడ్డి సామాజికవర్గాన్నే నియమించుకోవాలంటే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, నర్సారావుపేట జిల్లాలకు ఆప్షన్ ఉంది. అంతే తప్పితే ఉత్తరాంధ్రలో రెడ్లను వేరేచోటకు పంపడమే మేలు. 2024 ఎన్నికల్లో కూటమి పెద్ద ఎత్తున సీట్లు దక్కించుకోవడం వెనుక ప్రధానమైన కారణం.. ఆ ఐదేళ్లలో తెలుగుదేశం క్యాడర్ను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విపరీతంగా వేధించడం, దాడులు చేయడమే. ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తోంది. కేవలం జగన్మోహన్రెడ్డి వల్ల నష్టపోయామన్న భావనతోనే వైకాపా క్యాడర్ ఈసారి కూటమికి పరోక్ష సహకారం అందించింది. దాని ఫలితంగానే 164 సీట్లు వచ్చాయి. అది మర్చిపోయి వైకాపా క్యాడర్ మీద ఎక్కడికక్కడ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో పరాజయం తర్వాత కోలుకోవడానికి ఏ పార్టీకైనా సమయం పడుతుంది. కానీ ఇలా దాడులు చేయడం వల్ల వైకాపా శ్రేణులు సంఘటితమవుతున్నాయి. గ్రామాలు విడిచిపోవాలని హుకుం జారీ చేయడం వల్ల వైకాపాకు అండగా నిలబడేందుకు అంతా ఒక్కటవుతున్నారు. గతంలో వైకాపా దాడులు చేసింది కాబట్టి ఇప్పుడు మేం చేస్తామనుకుంటే.. వైకాపాకు 11 సీట్లు ఇచ్చిన విషయాన్ని కూడా టీడీపీ మర్చిపోకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైకాపా శ్రేణులు జగన్మోహన్రెడ్డిపై కోపంగా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ చేస్తున్న పనుల వల్ల జగన్కు పెద్ద శ్రమ లేకుండా క్యాడరే ఆయన వద్దకు పరుగెత్తేలా చేస్తున్నారు.
ఓటమిపై సమీక్షించని జగన్
అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డికి కళ్లూచెవుల్లా వ్యవహరించిన సలహాదారులే ఇప్పుడూ ఆయన చుట్టూ ఉన్నారు. ఓడిపోయాక ఏ పార్టీనయినా ప్రక్షాళన చేస్తారు. కానీ జగన్ మాత్రం ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా, పార్టీ క్యాడర్ తీవ్ర విమర్శలు చేస్తున్నా ‘నాకు నచ్చింది నేను చేస్తా, పదిమందికి నచ్చిన పని నేను చేయను’ అనే పంథాలోనే కొనసాగుతున్నారు. అందుకే పదవి నుంచి దిగిపోయినా ఇప్పటికీ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కథనాలు వస్తున్నాయి. కారణం.. ప్రతిపక్ష నాయకుడి హోదా లేదన్న సాకుతో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించకపోవడమే. జిల్లాల్లో పర్యటించి ఓడిన అభ్యర్థులతో సమీక్షించిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు కేవలం రెండు వారాల్లోనే అనంతపురం జిల్లాలో రెండు రోజులు కూర్చొని సమీక్షించారు. కానీ జగన్ ఓడిపోయి 60 రోజులు దాటినా కొద్ది మందితో గ్రూప్గా కూర్చుని సమీక్షించిన సందర్భాలే తప్ప వ్యక్తిగతంగా ఓడిన అభ్యర్ధుల అభిప్రాయాలు ఇప్పటికీ తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సాధారణ కార్యకర్తలకు ప్రవేశించే అవకాశం ఇస్తామని మొదట్లో ప్రకటించినా ఆ తర్వాత దీన్ని ఆపేశారు.
నాడు భ్రష్టుపట్టించినవారే ఇప్పటికీ పదవుల్లో..

ఒక ఓటమి ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది. గతంలో అధికారంలో ఉండగా నేనే, నాది, నేను తెచ్చా, నేను చేశా అనే అధికార కాంక్ష చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేస్తే.. అదే అధికార కాంక్ష, అదే లెక్క లేనితనం, నేను చెప్పినవాడు ఎమ్మెల్యే, నేను చెప్పినవాడు ఎంపీ అంటూ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోకుండా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో రాజకీయ బదిలీలు చేసిన జగన్ చంద్రబాబు కంటే హీనంగా 11 సీట్లు తెచ్చుకున్నారు. ఇది ఆయన స్వయంకృతపరాధమే. గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు వివిధ వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వారే ఇప్పుడు టీడీపీ మద్దతుదారులమంటూ కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. బదిలీల కోసం జీవో తెస్తాం, ఆ తర్వాత మారుస్తామనే లోపే ఇక్కడ రికార్డులు తారుమారైపోతున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో అప్పటి చైర్మన్ హేమచంద్రారెడ్డినైతే తొలగించగలిగారు గానీ, ఆయన వందిమాగదులు ఇంకా ఆ కార్యాలయం విడిచిపెట్టిపోలేదు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం వీరు ఇప్పుడు టీడీపీ నేతలతో లాబీయింగ్ చేస్తుండటమే.
‘సుఖీభవ’పై ఉదాసీనత
జగన్మోహన్రెడ్డి సొంత ప్రాంతమైన గ్రేటర్ రాయలసీమ పరిధిలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఖరీఫ్లో ఆ ప్రాంతం కరువుతో అల్లాడుతుంటే కోనసీమలో అధిక వర్షాలు పడి పంటలు నాశనమయ్యాయి. ఎటొచ్చి మూడు ప్రాంతాల్లో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు అనేది వాస్తవం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ అందేనా అనే అనుమానం రైతుల్లో నెలకొంది. ఇప్పటికే వరదలకు తీవ్ర నష్టాలను చవిచూసిన రైతులు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కౌలురైతులు ఉండటంతో ఈ ప్రభుత్వంలోనైనా వారికి పెట్టుబడి సాయం అందేనా అనే చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రూ.20 వేలు గురించి నోరువిప్పడం లేదు. ఇప్పటి వరకూ ‘అన్నదాత సుఖీభవ’ అమలుకు సంబంధించిన విధివిధానాలపై ఆదేశాలు సైతం ఇవ్వలేదు. అయినా ప్రతిపక్ష నేతగా దీనిపై జగన్మోహన్రెడ్డి నోరు విప్పకపోవడం విడ్డూరం. ఎప్పటిలాగే తన సలహాదారులు మాట్లాడతారనుకుంటున్నారో, ఏమో?!
Commentaires