నాన్న ఆలోచనలే నడిపిస్తున్నాయ్!
- ADMIN
- Sep 2, 2024
- 1 min read
ఆయన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు
వరం వర్ధంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు
నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
పలువురు వికలాంగులకు వీల్చైర్ల పంపిణీ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

తమ తండ్రి ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళతామని మున్సిపల్ మాజీ ఛైర్మన్, దివంగత అంధవరపు వరహానరసింహం (వరం) కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. పేదలకు అండగా నిలిచే క్రమంలో తండ్రి పేరుతో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ప్రకటించారు. కళింగ కోమటి సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కళింగ వైశ్య కల్యాణమండలంలో సోమవారం సంఘం పట్టణ అధ్యక్షుడు ఊణ్ణ నాగరాజు అధ్యక్షతన జరిగిన వరం వర్ధంతి కార్యక్రమంలో వారు ఈ ప్రకటన చేశారు. తొలుత ముఖ్యఅతిధిగా పాల్గొన్న కళింగ వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు వరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళింగ వైశ్య జాతి ఐక్యతను కాపాడుతూ, వారి గౌరవం పెంచేందుకు వరం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కుటుంబ సభ్యులు కూడా వరం ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ వరం కేవలం జాతి కోసమే కాకుండా శ్రీకాకుళం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని ప్రస్తుతించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ తమ తండ్రి ఆశయాలు, కార్యక్రమాలను కొనసాగిస్తూ వాటిలోనే ఆయన్ను చూసుకుంటున్నామన్నారు. సంఘం పెద్దలు సలహా సూచనలతో ముందుకు వెళ్తామన్నారు. పలువురు సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న కాలంలో వరం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో పాటు సంఘం తరఫున కూడా నిర్వహించాలని సూచించారు. అనంతరం పేదవర్గాలకు చెందిన వికలాంగులకు వీల్చైర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తంగుడు జోగారావు, వరం తనయులు అంధవరపు ప్రసాద్, అంధవరపు సంతోష్, సంఘం పెద్దలు కోరాడ రమేష్, అంధవరపు రఘు, కోణార్క్ శ్రీను, అంధవరపు గోవిందరాజులు, బరాటం నాగేశ్వరరావు, పీవీరమణ, కోరాడ హరగోపాల్, తంగుడు నాగేశ్వరరావు, ఊణ్ణ సర్వేశ్వరరావు, వైశ్యరాజు చంద్రమౌళిరాజు, జామి భీమశంకర్, తదితరులు పాల్గొన్నారు.
Comments