నామినేటెడ్ సందడి సర్దుబాటు పీటముడి!
- NVS PRASAD
- Aug 13, 2024
- 4 min read
పదవుల రేసులో పెద్దసంఖ్యలో టీడీపీ నేతలు
కూటమి పార్టీలకు కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి
శ్రీకాకుళంలో గొండు`గుండ వర్గాల చిక్కుముడి
వివిధ స్థాయిల్లో వడపోతకు సిద్ధమవుతున్న టీడీపీ అధిష్టానం

రాష్ట్రంలో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పాలన మీద దృష్టి పెట్టింది. ఆగస్టు 15 వేడుకల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభవుతుందని, జిల్లాల వారీగా డేటా సేకరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పదవుల పందేరంలో వెనుకబడిపోకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అవకాశం లేని కులాలు, గత ఎన్నికల్లో టికెట్ రాని నేతలు నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు క్లీన్స్వీప్ చేయడంతో నామినేటెడ్ పోస్టులకు నేతలను గుర్తించడం కూడా పార్టీకి కష్టసాధ్యంగా మారింది. గతంలో టీడీపీ సింగిల్గా అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి పని చేసిన వారిని గుర్తించడం సులువుగా ఉండేది. కానీ ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా అధికారాన్ని పంచుకోవడం వల్ల స్థానికంగా ఆ పార్టీ నేతలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ నిష్పత్తిలో పదవుల పంపకం జరుగుతుందో తెలియదు గానీ తెలుగుదేశం తరఫున మాత్రం నామినేటెడ్ పదవుల కోసం విపరీతమైన పోటీ ఉంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
టీడీపీ ఆవిర్భావం తర్వాత మూడు దఫాలు తప్ప ప్రతిసారీ శ్రీకాకుళం పార్టీకి కంచుకోటగా నిలుస్తూవచ్చింది. దీనికి తోడు ఇక్కడి నాయకులు కూడా జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇటువంటి చోట పార్టీ కోసం పని చేసినవారిని గుర్తించడం పెద్ద కష్టం కాదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపాను వీడి టీడీపీకి జైకొట్టిన కొందరికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. వీరంతా ఒక ఒప్పందం మేరకే పార్టీని వీడారు. పలాసలో దువ్వాడ శ్రీకాంత్ అయినా, నరసన్నపేట నియోజకవర్గంలో చిన్నాల కూర్మినాయుడు, తమ్మినేని నాగభూషణం అయినా బంధుత్వాలను వదులుకొని కూటమి అభ్యర్థుల కోసం పని చేశారంటే కచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తామన్న హామీ ఉండే ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కో అభ్యర్థి రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారని తేలింది కానీ ఎన్నికల సమయం నాటికి మాత్రం పరిస్థితి నువ్వా నేనా అన్న రీతిలోనే ఉంది. అటువంటి సమయంలో వైకాపా నుంచి ఎవరు వచ్చినా ఎన్నో కొన్ని ఓట్లు కలుస్తాయన్న భావనతో కూటమి అభ్యర్థులు వ్యవహరించారు. ఇప్పుడు అటువంటి వారికి స్థానం కల్పించడంతో పాటు టీడీపీ కోసం తొలినుంచి పని చేసిన క్యాడర్కు ఒక హోదా కల్పించాల్సిన బాధ్యత సిటింగ్ ఎమ్మెల్యేలపై ఉంది.
రాష్ట్రస్థాయి పదవులపై గురి
గతంలో కూడా జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు రాష్ట్రస్థాయి పదవులు వరించాయి. ఇప్పిలి శేషగిరిరావుకు రాష్ట్ర ఖాదీబోర్డు, పీవీ రమణకు ఏపీఎస్ఐఐడీసీ డైరెక్టర్, రత్నాల నర్సింహమూర్తికి గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్, ఇప్పిలి తిరుమలరావుకు లేపాక్షి డైరెక్టర్, టెక్కలికి చెందిన చాపర గణపతికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సిండికేట్ మెంబర్గా, పుప్పాల చినమహాలక్ష్మికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్గా, మొదలవలస రమేష్కు నీటి పారుదల శాఖ డైరెక్టర్గా, జామి భీమశంకర్కు ఆంధ్రా యూనివర్సిటీ సిండికేట్ మెంబర్గా.. ఇలా చెప్పుకుంటూపోతే ఎల్ఎల్ నాయుడు వరకు అనేకమందికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు వచ్చాయి. అయితే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంప్రదాయ నామినేటెడ్ పదవులతో పాటు కుల కార్పొరేషన్లు పెట్టి పెద్ద ఎత్తున చాలామందికి పదవులు అప్పగించింది. ఆ కుల కార్పొరేషన్లు ప్రస్తుత ప్రభుత్వంలో ఉంటాయో, లేదో తెలియదు. దీనికి తోడు మూడు పార్టీల నేతలకు బెర్త్లు ఇవ్వాలి. దాంతో ఈ వ్యవహారంలో పార్టీ ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది. రెండేళ్లలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నామినేటెడ్ పోటీలో ఉండరు అని తేలినవారిని ముందుగా ఫిల్టర్ చేస్తున్నారు. అందులో సీనియర్లు, రాజకీయంగా చివరి అంకంలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడానికి పార్టీ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
భిన్నమార్గాల్లో జాబితాల వడపోత
ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పది నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేల వద్ద జాబితాలు పెద్దవే ఉన్నాయి. వాటిని కాకుండా పార్టీ నేరుగా తన ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా బయోడేటాలు సేకరించడానికి సిద్ధపడుతుందట. ముఖ్యంగా 2019`24 మధ్య పార్టీ కోసం తెగించి కష్టపడినవారికి మొదటి ప్రాధాన్యత లభిస్తుందని భోగట్టా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ధర్నాకో, బంద్కో పిలుపునిచ్చిన సందర్భాల్లో రోడ్డెక్కితే పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెడతారని భయపడి టీడీపీ కార్యకర్తలే పోలీసులకు ఫోన్ చేసి తాము ఇంటిలో ఉన్నాం, హౌస్ అరెస్ట్ కింద చూపించుకోమంటూ ఉద్యమంలో పాల్గొనని వారి డేటాను స్వయంగా పోలీసుల నుంచే టీడీపీ నాయకత్వం సేకరిస్తోంది. ఆ సమయంలో తెగించి రోడ్డెక్కిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిసింది. కొందరైతే తమకు పదవి కావాలని నేరుగా ఎమ్మెల్యేలకు దరఖాస్తు పెట్టుకోగా, బుడితి సీతారామ్నాయుడు లాంటి పలువురు పార్టీ యే తమను గుర్తించి పదవి ఇవ్వాలి కానీ, అది కావాలంటూ నాయకుల వెనుక తిరగడం సరికాదన్న భావనలో ఉన్నారు. ఎలా చూసుకున్నా జిల్లాలో కనీసం ఒక 20 మంది రాష్ట్రస్థాయి పదవులకు సరిపోయినవారు ఉన్నారు. జెడ్పీ చైర్మన్గా రెండేళ్ల తర్వాత ఎవర్ని నిలపాలన్న అంశంపైనే ప్రధానమైన రాష్ట్రస్థాయి పోస్టు జిల్లా నుంచి భర్తీ కానుంది. పాతపట్నం ఎమ్మెల్యేగా మామిడి గోవిందరావుకు టికెటిచ్చినప్పుడు కలమట వెంకటరమణకు జెడ్పీ చైర్మన్ ఇస్తామన్న హామీ చంద్రబాబు ఇచ్చారనే ప్రచారం ఉంది. కానీ కూన రవికుమార్కు మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకోవడంతో ఇప్పుడు ఆయన భార్య కూన ప్రమీలను జిల్లాపరిషత్కు పంపిస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. మరోవైపు అదే స్థాయిలో చౌదరి బాబ్జీ కూడా ఉన్నారు. కూన రవికి ఎమ్మెల్యే, కలమట రమణకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఉండటంతో ఇప్పుడు చౌదరి బాబ్జీకి ఉన్నఫళంగా ఒక హోదా అవసరమైంది. అలాగే మెట్ట సుజాత జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా గత ఐదేళ్లు ఎడతెగని పోరాటం చేశారు. దీనికి తోడు ఆమెకు కూన రవి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కూడా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈసారి ఈమెకు రాష్ట్రస్థాయి పదవి కచ్చితంగా దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి మొదలవలస రమేష్ కూడా రేసులో ఉన్నారు. గతసారి కంటే ఈసారి మెరుగైన పదవి కోసం ఆయనకు అభయం ఉన్నట్టు తెలిసింది. వీరితో పాటు బోయిన గోవిందరాజులు, ఎల్.ఎల్.నాయుడు, చాపర గణపతి, పీరుకట్ల విఠల్, సీపాన వెంకటరత్నం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది ఈ రేసులో ఉన్నారు.
శ్రీకాకుళంలో భిన్న పరిస్థితి
ప్రతిచోటా కూటమిలో ఉన్న పార్టీల మధ్య పదవుల పంపకం జరగాల్సి ఉండగా శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రం టీడీపీలోనే గుండ, గొండు వర్గాల మధ్య పదవులు ఎవరికి దక్కుతాయన్న అంశంపై చర్చ జరుగుతోంది. గొండు శంకర్కు టికెట్ ప్రకటించిన తర్వాత కూడా చాలామంది గుండ లక్ష్మీదేవిని కాదని రావడానికి సిద్ధపడలేదు. చివరకు అచ్చెన్నాయుడు మంత్రాంగం, రామ్మోహన్నాయుడు అభయంతో ముందుకొచ్చారు. ఇప్పుడు పార్టీ నిర్ణయించిన వెంటనే గొండు శంకర్తో కలిసి ప్రయాణించినవారు, ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచి గొండు శంకర్ జెండా మోసినవారి మధ్య పదవుల పంపకం జరగాల్సి ఉంది. ఏది ఏమైనా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి అంపోలు మూర్తి, పాండ్రంకి శంకర్, చిట్టి మోహన్, కోరాడ హరిగోపాల్, ఎస్వీ రమణ మాదిగ, సింతు సుధాకర్ లాంటి వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ రెండు పరిస్థితులకు మధ్య కొందరు మాత్రం ఇట్టే ఇమిడిపోయారు. ఇటువంటి వారికి పదవులు రావడం కొంత సులువే. ఈ కోటాలో ఏయూ మాజీ సిండికేట్ సభ్యుడు జామి భీమశంకరరావు ఉన్నారు. 1998 నుంచి ఆరేళ్ల పాటు భీమశంకర్ ఏయూ సిండికేట్ సభ్యుడిగా పని చేశారు. ఆ తర్వాత నుంచి ఈయన పార్టీ బాధ్యతలే తప్ప అధికార హోదా ఉన్న పదవులు చేయలేదు. ఈ ఎన్నికల తర్వాత విశ్రాంత జీవితంలోకి వెళ్లిపోనున్న భీమశంకర్ తనను సుడా చైర్మన్ గానీ, ఏపీపీఎస్సీ మెంబర్ గానీ, యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా గానీ నియమించాలని కోరుతున్నారు. ఈమేరకు తెలుగుదేశం పెద్దలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏయే పోస్టులను భర్తీ చేయొచ్చన్న డేటాను పార్టీ సేకరిస్తోంది. ఎందుకంటే.. గత ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగుల కోసం దాదాపు 200 పోస్టులు అదనంగా సృష్టించింది. ఇప్పుడు వాటిలో ఎన్నింటిని కొనసాగించాలి, కొత్తగా పదవులు సృష్టించే అవకాశం ఉందా అన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది.
Comentarios