top of page

పగబట్టిన నాగావళికి అడ్డుకట్ట!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 29
  • 3 min read
  • మార్గాలను అన్వేషిస్తున్న జాతీయ సంస్థ

  • కేంద్రమంత్రి, ఎమ్మెల్యే చొరవతో తరలివచ్చిన శాస్త్రవేత్తల బృందం

  • ఐదురోజులు ఇక్కడే మకాం.. జెట్టీ ఏర్పాటు సాధ్యాసాధ్యాల అధ్యయనం

  • గనగళ్లపేట ముంపు, తీరం కోత సమస్యకు త్వరలో పరిష్కారం



సముద్రంలో కలవాల్సిన నాగావళి పగబట్టినట్లు తీరం వైపు చొచ్చుకొస్తూ తీర గ్రామాలను ముప్పు ముంగిట్లోకి నెడుతోంది. ఈ ముప్పు నుంచి అక్కడి ప్రజలను తప్పించేందుకు.. నది ప్రవాహ దిశను మళ్లించేందుకు జెట్టీ నిర్మాణం అవశ్యమన్న స్థానికుల వినతులను మన్నించి ఆచరణలో పెట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలిస్తూ గనగళ్లపేట తీరానికి రప్పిస్తున్నారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ సంస్థ ఇక్కడి తీరంలో కోత సమస్యను పరిశీలించి, జెట్టీ నిర్మాణంతో దాన్ని అడ్డుకోవచ్చా లేదా అన్నది నిర్థారించేందుకు ఒక ఉన్నతస్థాయి బృందాన్నే పంపింది. రెండు రోజులుగా ఈ బృందంలోని శాస్త్రవేత్తలు గణగళ్లపేట తీరంలోని నదీసాగర సంగమ ప్రదేశంలో రకరకాల పరీక్షలు చేస్తున్నారు.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

గత కొంతకాలంగా నాగావళి నుంచి ముంపు ముప్పు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం రూరల్‌ మండలం గనగళ్లపేట పంచాయతీని రక్షించేందుకు వీలుగా ఆ ప్రాంతంలో జెట్టీ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో జెట్టీ నిర్మాణానికి సంబంధించి ఫీజిబులిటీ, ఇతర సాంకేకిత అంశాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌(ఎన్‌సీసీఆర్‌).. అంటే జాతీయ తీరప్రాంత అధ్యయన కేంద్రం రంగంలోకి దిగింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుల చొరవతో ఈ పంచాయతీ పరిధిలోని వేలాది ప్రజలకు ముంపు సమస్య నుంచి రక్షించేందుకు కృషి చేస్తున్నారు. వారి చొరవ ఫలితంగానే ఎన్‌సీసీఆర్‌ బృందం ఇక్కడి వచ్చి అధ్యయనం చేస్తోంది.

గ్రామాలపై దండెత్తుతున్న నాగావళి

నాగావళి నది బంగాళాఖాతంతో సంగమించే ప్రాంతం గనగళ్లపేట తీరం. ఇన్నాళ్లూ నాగావళి తన మానాన తాను గ్రామాలకు కాస్త దూరంగా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేది. అందువల్ల ఈ పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 8వేల జనాభాకు ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఈ గ్రామాల్లో మెజారిటీ ప్రజలు మత్స్యకారులే. వారంతం యథాప్రకారం స్వేచ్ఛగా సముద్రంలోకి వెళ్లి చేపల వేట సాగిస్తూ ఉపాధి పొందేవారు. కానీ కొద్దికాలంగా నాగావళి నది మత్స్యకార గ్రామాలపై కన్నెర్ర చేస్తోంది. గ్రామాలకు దూరంగా ఉన్న తన ప్రవాహ దిశను మార్చుకుని క్రమంగా జనావాసాలపైకి దండెత్తి వస్తోంది. హఠాత్తుగా నది తన ప్రవాహ దిశను ఎందుకు మార్చుకుందో అర్థం కాని పరిస్థితి. దీనివల్ల తీరప్రాంతం కోతకు గురవుతోంది. ఇసుక మేటల వల్ల సముద్రంలో నాగావళి కలిసే ముఖద్వారం మూసుకుపోవడంతో మత్స్యకారులు చేపల వేటకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ప్రవాహ తీవ్రత కారణంగా 12 విద్యుత్‌ స్తంభాలు, గంగమ్మ గుడి కొట్టుకుపోయి నదిలో కలిసిపోయాయి. ఇటీవల కొత్తగా రూ.1.60 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా నదీ ప్రవాహం తాకుతోంది. కొన్ని రోజుల్లో ఇది కూడా కొట్టుకుపోయే ప్రమాదముంది. ఈ సమస్యపై గణగళ్లపేట, నరసయ్యపేట తదితర గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్‌కు లిఖితపూర్వకంగా విన్నవించారు. సమస్య పరిష్కారానికి జెట్టీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఎమ్మెల్యే శంకర్‌ కొద్దిరోజుల క్రితం గనగళ్లపేట తీరానికి వెళ్లి అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సమస్య తీవ్రతను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

తీరంలో విస్తృత అధ్యయనం

వీరందరి కృషి ఫలితంగా ముంపు సమస్యకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. జాతీయ తీరప్రాంత అధ్యయన కేంద్రం నుంచి ఎనిమిది మంది సభ్యులతో కూడిన శాస్త్రవేత్తల బృందం ఇక్కడికి వచ్చి పరిశోధనలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను బృందంలోని ఏకైక తెలుగు శాస్త్రవేత అయిన సొండి సుధీర్‌ ‘సత్యం’కు వివరించారు. కేంద్ర మంత్రి, జిల్లా కలెక్టర్‌ వినతి మేరకు తమ సంస్థ గనగళ్లపేట సమస్యపై దృష్టి సారించిందన్నారు. తమ బృందం ఇక్కడికి రావడం ఇది రెండోసారి అని చెప్పారు. గత నవంబర్‌లో మొదటిసారి వచ్చి కొంత అధ్యయనం చేశామని, ఇప్పుడు రెండోసారి వచ్చామని చెప్పారు. ఐదురోజుల పాటు ఇక్కడే ఉండి విస్తృత అధ్యయనం చేస్తామన్నారు. సముద్రం, నది కలిసేచోట ఓషనోగ్రఫీ ఎక్విప్‌మెంట్‌ అమర్చి నీటి లోతు ఎంత ఉంది? వాటర్‌ లెవల్‌ ఎలా మారుతోంది? ప్రవాహం వేగం, ఒత్తిడి ఎలా ఉన్నాయి? అన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తామని వివరించారు. డ్రోన్‌, టోపోగ్రఫీ(ఆర్‌టీకే), బేథిమెట్రీ అనే మూడు రకాల సర్వేల ద్వారా డేటా సేకరించి విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణ ఆధారంగా జెట్టీ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అని నిర్థారిస్తారు. ఆ మేరకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తారని సురేష్‌ వివరించారు. జెట్టీ నిర్మాణం కాకుండా ఇంకేదైనా పరిష్కార మార్గం ఉంటే దాన్ని కూడా సూచిస్తారని, ఈ మొత్తం అధ్యయన ప్రక్రియ తమ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ రమణమూర్తి ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు. శాటిలైట్‌ ఇమేజెస్‌ ద్వారా ఇప్పటికే కొంత సమాచారం సేకరించామని, అయితే జెట్టీ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు.

ఎన్‌సీసీఆర్‌ విధులు ఇవీ..

జాతీయ తీరప్రాంత అధ్యయన సంస్థ(ఎన్‌సీసీఆర్‌) దేశవ్యాప్తంగా పని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. దేశంలో మరెక్కడా దీనికి కార్యాలయాలు లేవు. ప్రస్తుతం ఈ సంస్థ డైరెక్టర్‌గా విశాఖకు చెందిన డాక్టర్‌ కె.వి.రమణమూర్తి వ్యవహరిస్తుండగా, త్వరలో ఆ సంస్థ శాఖను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు సురేష్‌ తెలిపారు. తీర ప్రాంతాల్లో కోత సమస్య, సముద్ర పర్యావరణం, తదితర అంశాలను ఈ కేంద్రం నిరంతరం అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా అంశాలపై సూచనలు, సలహాలు కోరినా తగిన సమాచారం ఇచ్చి సహకరిస్తుంది. అటువంటి ప్రఖ్యాత సంస్థ శ్రీకాకుళం తీరానికి రావడం, ఏకంగా ఐదురోజులు మకాం వేసి అధ్యయనం చేయడంతో గనగళ్లపేట ముంపు, కోత సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page