top of page

పని కాకపోయినా ఫర్లేదు.. కమీషన్లు ఇచ్చేయండి

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Feb 12
  • 3 min read
  • పడకేసిన గుంతలు కప్పే పనులు

  • అగ్రిమెంట్లు మార్చడంతోనే అధికారులు బిజీ

  • మరో నెల ఆగితే పూర్తయిపోయాయని చెబుతారు

  • నాయకుల పేరు చెప్పి తస్మదీయులకు బెదిరింపులు

  • ఆర్‌ అండ్‌ బి లో మామూళ్ల పండగ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వైకాపా పాలన ఐదేళ్లలో కొత్త రోడ్ల కోసం రోడ్లు, భవనాల శాఖకు బడ్జెట్టే కేటాయించకపోవడం, ఉన్న రోడ్ల మెయింటినెన్స్‌కు కూడా రూపాయి విదల్చకపోవడంతో దశాబ్దాల తరబడి లెక్కాపత్రం లేకుండా వారు కొలిచిందే కొలత, వారు నిర్ణయించిందే పర్సంటేజ్‌ లెక్కన అడ్డపడ్డగా దోచేసిన రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రభుత్వం మారిన తర్వాత పండగ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నాశనం చేసేసిందని, తాము వాటిని బాగుచేస్తామంటూ గుంతలు పూడ్చే పేరుతో కూటమి ప్రభుత్వం స్టేట్‌ హైవేలు, గ్రామాల ప్రధాన రహదారులు మరమ్మతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.140 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇందులో రూ.47.25 కోట్లు రాష్ట్ర హైవేలకు, రూ.92.75 కోట్లు మండలాల్లో మెయిన్‌ రోడ్ల మరమ్మతులకు కేటాయించింది. వైకాపా ఐదేళ్లలో మాంచి దాహం మీద ఉన్నారేమో.. ఆర్‌ అండ్‌ బి అధికారులు ఈ పనుల్లో వచ్చే పర్సంటేజ్‌ల మీద ఆశతో అసలు పనులు జరుగుతున్నాయా, లేవా, ఎన్నింటికి అగ్రిమెంట్లు జరిగాయి, ఇంకెన్ని ఏ స్థాయిలో పూర్తయ్యాయి? అన్నవి పరిశీలించకుండానే స్థానిక రాజకీయ నాయకులకు ఇవ్వాల్సిన పర్సంటేజీ ఇచ్చేసి పనులు ప్రారంభించిన వెంటనే తమ వాటా తమకు పడేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవానికి రెండు నెలల్లో ఈ రోడ్‌ ప్యాచ్‌వర్క్‌ల పని పూర్తికావాలి. అలాగే పాడైన కల్వర్టులు, జంగిల్‌ క్లియరెన్స్‌లు, రోడ్డు పక్కన బెర్మ్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తికావాలి. ఎందుకంటే.. ఇందుకు సంబంధించిన జీవో గత ఏడాది నవంబరు రెండో వారంలోనే వచ్చింది. ఆ తర్వాత టెండర్లు పిలవడం, అగ్రిమెంట్‌లు తీసుకోవడం, పనులు ప్రారంభించడం, ఎం`బుక్‌ రికార్డు చేయడం పూర్తయిపోవాలి. కానీ జిల్లాకు కేటాయించిన పనుల్లో సగానికి పైగా ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలినవి 20 శాతం, 40 శాతం మాత్రమే పూర్తయివున్నాయి. ఇక్కడ ఆర్‌ అండ్‌ బీలో టెక్కలి, శ్రీకాకుళం రెండు డివిజన్లు ఉన్నాయి. ఈ రెండు డివిజన్లను ఇద్దరు ఈఈలు పర్యవేక్షిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈఈలు డీఈలు, ఏఈల ద్వారా ఈ పనుల తీరును, పనుల ప్రగతిని పరిశీలించిన దాఖలాలు లేవు. ఏమని అడిగితే ఆర్‌ అండ్‌ బిలో రెన్యువల్‌ వర్క్‌లు సాధారణమేనని, గోతులు కప్పడాన్ని ఏం చూస్తామన్న భావనతో ఉన్నారు. ఇక్కడే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం డివిజన్‌లో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఎన్‌హెచ్‌ 16 నుంచి పట్నవానిపేట రోడ్డు వరకు 4.60కిలోమీటర్ల పరిధిలో బీటీ రెన్యువల్‌ చేయాల్సివుంది. ఇందుకోసం రూ.4.80 లక్షలు కేటాయించారు. అంటే ఒక రోడ్డులో 4.50 కిలోమీటర్లు వర్క్‌ చేశారా, లేదా అనేది చూడకుండానే బిల్లులు చేయడం సరికాదు. ఎందుకంటే.. కొంతమేర చేసి మిగిలిన భాగాన్ని వదిలేస్తే అందుకు బాధ్యులెవరు? ఇది కేవలం ఒక రోడ్డుకే పరిమితమైనది కాదు. ఇదే ఎచ్చెర్లలో పొందూరు నుంచి సర్వేశపురం రోడ్డుకు 2.20 కిలోమీటర్ల రోడ్డుకు రూ.4.50 లక్షలు కేటాయించారు. అలాగే సూరంపేట రోడ్డు నుంచి మెంటాడ వరకు 10.90 కిలోమీటర్లకు కేవలం రూ.4.80 లక్షలు మాత్రమే కేటాయించారు. ఒకచోట 4.60 కిలోమీటర్లకు రూ.4.80 లక్షలు, దాదాపు 11 కిలోమీటర్లకు కూడా అదే బడ్జెట్‌ కేటాయించారంటే, ఒకచోట అక్కడక్కడ గోతులుంటే, మరోచోట రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయుంటుంది. ఇలాంటి దగ్గర డీఈలు, ఏఈలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ టెక్కలి డివిజన్‌లో అక్కడి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, మిగిలిన అధికారులు ఇప్పటికీ అగ్రిమెంట్లు మార్చే పనిలోనే బిజీగా ఉన్నారు. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లను రాజకీయ నాయకుల పేరు చెప్పి భయపెట్టి పనిని వదిలేస్తున్నట్టు ఒక డిక్లరేషన్‌ తీసుకొని, వేరేవారికి అగ్రిమెంట్‌ కట్టే పనిలో మునిగిపోయారు. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్థానిక నాయకులకు రోడ్డు కాంట్రాక్ట్‌ను అప్పగిస్తుంటారు. ఇది ఎక్కడా జరిగేదే. కానీ ఇక్కడ తాము చెప్పినట్టు పర్సంటేజీలిచ్చే కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి నిర్ద్వందంగా కాంట్రాక్ట్‌లు అప్పగించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి రెండు డివిజన్లలోనూ ఇదే ప్రాక్టీస్‌ జరుగుతోంది. స్థానికంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ కేడర్‌కే పనులిస్తున్నారని భావిస్తున్నారు. కానీ ఆ ముసుగులో ఆర్‌ అండ్‌ బి అధికారులను పెంచి పోషించే కాంట్రాక్టర్లను తెర మీదకు తెస్తున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ గతంలో కాంట్రాక్టర్‌ అయినప్పటికీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కాంట్రాక్ట్‌లోనూ పాల్గోలేదు. కానీ శ్రీకాకుళంలో టెండరు దక్కించుకున్నవారిని తప్పించి కొత్త అగ్రిమెంట్లు చేస్తుంటే ఇదేమని ప్రశ్నించినవారికి ఆ వర్క్‌లు ఎమ్మెల్యే చేస్తున్నారని స్వయంగా ఆర్‌ అండ్‌ బి అధికారులే చెబుతున్నారట.

రికార్డ్‌ అసిస్టెంట్‌తో దందా, దాదాగిరి..

శ్రీకాకుళం డివిజన్‌లో అడ్డగ పడ్డగ అగ్రిమెంట్లు రాయడం, టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ను బెదిరించడం కోసం ఇక్కడ రికార్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. హిరమండలంలో పని చేయాల్సినవాడిని శ్రీకాకుళం డివిజన్‌కు తీసుకువచ్చి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేయడం, తమకు నచ్చని కాంట్రాక్టరు టెండరు ధరావతు కడితే, ఆ డీడీని మాయం చేయడం, తమ మనుషులకు కాకుండా టెండరు వేరేవారికి దక్కితే ఆ ఫైళ్లను మాయం చేయడం వంటి చర్యలకు రికార్డ్‌ అసిస్టెంట్‌ను వాడుకుంటున్నారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అందుకే గుర్తింపు లేని యూనియన్‌కు నాయకుడ్ని చేసి, ఆయనకో ఆఫీసునిచ్చి ఈఈలకు, డీఈలకు ఎదురుతిరుగుతున్న వారిపై దాడికి పురిగొలుపుతున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి రికార్డ్‌ అసిస్టెంట్‌కు డ్రాఫ్ట్స్‌మెన్‌ ఛాంబర్‌లో పనుండదు. కానీ ఎవరికి టెండర్లు దక్కాయి, ఎవరికి వర్క్‌ ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వకూడదు అని నిర్ణయించడం కోసం సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ వద్దే ఈయనకో సీటేసి, ఒక బీరువా ఇచ్చి ఆఫీసులో ఈఈ తర్వాత రాణాప్రతాపేనన్నంత స్థాయిలో బిల్డప్‌ తెచ్చారు. దీంతో అటు కాంట్రాక్టర్లు గాని, ఇటు మిగిలిన సిబ్బంది గాని రాణాప్రతాప్‌ చెప్పినట్లే నడుచుకోవాలని, లేదంటే దాడులు తప్పవని స్వయంగా ఈఈ స్థాయి అధికారులే చెబుతున్నారట. సాధారణంగా జంగిల్‌ క్లియరెన్స్‌కు నిధులు మంజూరైనా దాన్ని తొలగించకుండా బిల్లులు డ్రా చేసేస్తుంటారు. ఎందుకంటే.. టెండరు ఖరారైన వెంటనే సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలిస్తే రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు తొలగించారో, లేదో తెలుస్తుంది. కానీ బిల్లుల చెల్లింపు తర్వాత కూడా ఫీల్డ్‌ విజిట్‌ లేకపోవడం వల్ల వర్క్‌ మెజర్మెంట్‌కు వెళ్లినా ఫలితం ఉండదు. ఎందుకంటే పిచ్చిమొక్కలు తొలగించి మూడు నెలలైందని, మళ్లీ పెరిగాయని కాంట్రాక్టర్‌ చెబుతారు. కాదు కాదు ఇంజనీరింగ్‌ అధికారులే చెప్పిస్తారు. ప్రస్తుతం పల్లెపండగ నిధులతో చేపట్టిన పనులు ఏమేరకు పూర్తయ్యాయో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఫలానా చోట ఎందుకు పూర్తికాలేదని అడిగితే, ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదని, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని చెబుతుంటారు. రూ.5 లక్షల పనికి కాంట్రాక్టర్‌ రావడంలేదని చెప్పేబదులు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు ఉద్యోగాలొదిలేయడం బెటర్‌. కానీ ఆ పని చేయరు. ఎందుకంటే.. ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకున్నవారి దగ్గర్నుంచి మాత్రం అన్ని డివిజన్లకు పీసీలు అందిపోయాయి. ఇందులో కేవలం ఈ పీసీల మీద ఆధారపడి ఒక ఈఈ తన కొడుకును మెడిసిన్‌ చదివిస్తుంటే, మరో ఈఈ పెద్ద వ్యాపారం చేస్తున్నారు.

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page