పరపతి కోల్పోతున్న సీఎం మమత!
- BAGADI NARAYANARAO
- Aug 20, 2024
- 2 min read

ఇప్పుడు మరో నిర్భయ కేసు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. తాను పని చేస్తున్న ఆస్పత్రిలోనే హంతకుడి చేతిలో చిత్రహింసలు అనుభవించి, అత్యాచారానికి.. ఆపై హత్యకు గురైన ఒక జూనియర్ డాక్టర్ దారుణ ఘటనను జాతి యావత్తు గర్హిస్తోంది. హంతకులను కఠినాతికఠినంగా శిక్షించాలని ఘోషిస్తోంది. ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తోంది. అయితే దారుణ ఘటనపై స్పందించి, తక్షణ చర్యలు తీసుకుని ప్రజాబాహుళ్యానికి నమ్మకం, భరోసా కల్పించాలని వ్యవస్థలు మాత్రం ఇందులోనూ సొంతి నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తున్నాయి. దీనికి కారణం.. రాజకీయ పాలకులు సొంత లాభం కోసం వెంపర్లాడటమే. ఒక యువ డాక్టర్పై జరిగిన అమానుషాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నించడం కంటే హీనమైన విషయం ఇంకొకటి ఉండదు. ప్రస్తుతం ఈ రాజకీయ రాక్షస క్రీడకు పశ్చిమ బెంగాల్ వేదికగా మారింది. ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుగొట్టి, కాంగ్రెస్ను ఆనవాలు లేకుండా చేసి తిరుగులేని ఆధిపత్యం చెలాయి స్తున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను ఇటీవలి కాలంలో భారతీయ జనతాపార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. పెను సవాళ్లు విసురుతోంది. ఫలితంగా రెండు పార్టీల కారణంగా గత కొన్నేళ్లుగా రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతోంది. ఆ మధ్య ఇదే రాష్ట్రంలోని సందేశ్ ఖాలీలో జరిగిన అత్యాచారాలు, దాడులను అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ చేసిన యత్నాలను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి మమత నేతృత్వం లో తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగడం, ఘటనపై విచారణకు వచ్చిన సీబీఐ అధికారులను ఆ పార్టీ కార్యకర్తలు వెంటాడి పరుగులు పెట్టించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దాన్ని మర్చిపోకముందే తాజాగా కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో నైట్డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్పై జరిగిన దారుణ హత్యా చారం విషయంలోనూ మమతా బెనర్జీతో పాటు ఆమె అడుగుజాడల్లో తృణమూల్ కార్యకర్తలు సైతం అదే పంథా అనుసరిస్తూ జనంలో మరింత పలుచన అయిపోతున్నారు. ముఖ్యంగా ఫైర్బ్రాండ్గా, బెంగాల్ ప్రజ లతో దీదీగా పిలిపించుకునే మమతా బెనర్జీ పాలన గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూనియర్ డాక్టర్పై హత్యాచారం ఘటనలో మమతతో పాటు ఆమె ప్రభుత్వం వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరుపై బాధితురాలి తల్లిదండ్రులే కాకుండా ఆ రాష్ట్ర ప్రజలు.. చివరికి కోర్టులు సైతం నిప్పులు కక్కుతున్నాయంటే మమత ఈ దారుణంపై ఎంత ఉదాసీనంగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారో అర్థమవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. కానీ ఆ విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని యువడాక్టర్ హత్యాచారం ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో ముఖ్య మంత్రి కఠిన చర్యలు తీసుకోవాల్సిన మమత ఆ పని చేయకుండా తానే స్వయంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం నిర్వహించడం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న నాటకంగా కనిపించింది. ఇంకా విచి త్రమేమిటంటే సీఎం హోదాలో నిరసన ప్రదర్శన చేసిన ఆమె.. హత్యాచార ఘటనపై ఇతరులెవరూ ఆందోళన లు, నిరసనలు చేయడానికి వీల్లేదంటూ నిషేధాజ్ఞలు విధించడం ప్రజలను మరింత చిర్రెత్తించింది. ఒంటినిండా రక్తగాయాలతో, దాదాపు వివస్త్రగా ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్ పడిపోయి ఉంటే.. సదరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెప్పడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అతనిపై కఠిన చర్యలు తీసుకోకుండా బదిలీ చేసి.. రెండు రోజుల్లోనే తిరిగి వేరే కళాశాలలో నియమించడం మమత ద్వారా తన చిత్తశుద్ధిపై అనుమానాలు పెరిగేలా చేసుకున్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తం తన చేతుల్లోనే ఉన్నా.. చేతులు ముడుచుకున్న ఆమె మరోవైపు కేంద్రంపై నెపాన్ని నెట్టివేయడానికా అన్నట్లు సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేయాలని, రెండురోజుల్లోనే నింది తుడిని పట్టుకుని ఉరి తీయాలని డిమాండ్ చేయడం ఫక్తు రాజకీయంలా కనిపించింది. మమత తీరుపై బాధి తురాలి తల్లిదండ్రులే తీవ్ర విమర్శలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీదీ సర్కారు మహిళలను ఉద్ధరి స్తామంటూ పలు ఆర్థిక సహాయ పథకాలు అమలు చేస్తోందని, కానీ వారికి భద్రత మాత్రం కల్పించలేకపోతోం దని మృతురాలి తల్లి ఆరోపించారు. మొదట భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి, నిందితులపై కఠిన చర్యలు తీసుకున్న తర్వాతే మమత సర్కారు ఇచ్చే ఆర్థిక పథకాలను పుచ్చుకోవాలని ఆమె మహిళాలోకానికి పిలుపునిచ్చారు. ఇక ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు బయటపడుతోంది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో తృణమూల్ కాంగ్రెస్కు చెందినవారి ఆధ్వర్యంలో డ్రగ్స్ దందా నడుస్తోందన్న ఆరోపణలు చాలాకాలం నుంచే ఉన్నాయి. ఈ దందా గురించి జూనియర్ డాక్టర్కు తెలిసిపోవడం వల్లే తృణమూల్ వర్గాలే ఆమె హత్యకు కారణమయ్యాయన్న తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆందోళనకారుల ముసుగులో తృణమూల్ కార్యకర్తలు రాత్రివేళ ఆస్పత్రిపై దాడికి పాల్పడి యువడాక్టర్ మృతదేహం లభించిన సెమినార్ హాల్లో విధ్వంసం సృష్టించి ఆధారాలు లభించకుండా చేశారని అంటున్నారు. పైగా ఈ హత్యోదంతాన్నే సాకుగా చూపి ఏకంగా 42 మంది డాక్టర్లను ఒకేసారి బదిలీ చేయడం కూడా విమర్శల పాలైంది. ఉద్యమంలో పాల్గొన్నందుకే వారిని బదిలీ చేశారన్న విమర్శలు చెలరేగడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకతప్పలేదు. ఇవన్నీ చూస్తే హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించిన మమత తన పరపతిని తానే పతనం అంచుకు తీసుకెళ్తున్నట్లుంది.
Comments